మెడిసిన్ విద్యార్థులకు జగన్ సర్కార్ గిఫ్ట్ : పీజీ వైద్య విద్య కోర్సుల ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు, విద్య వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలోనే వైద్య విద్య ఫీజులు తగ్గిస్తూ మెడిసిన్ చదవాలనే విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పింది జగన్ ప్రభుత్వం. ఈ రోజుల్లో మెడిసిన్ చదవాలంటే ఫీజులు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చదవాలని కోరిక ఉన్నా, టాలెంట్ ఉన్నప్పటికీ అధిక ఫీజులతో వైద్య విద్యకు చాలామంది పేద మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదవలేకపోతున్నారు. ఇక నాటి ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో కొందరు విద్యార్థులు కలిసి అధిక ఫీజుల గురించి ఆయన వద్ద ప్రస్తావించారు.
అధికారంలోకి వస్తే ఫీజుల నియంత్రణ చేపడతామని నాడు హామీ ఇచ్చారు. ఇప్పుడు ఎంతో ఖరీదైన వైద్య విద్యపై దృష్టి సారించిన సీఎం జగన్ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైద్య విద్యకు సంబంధించి ఫీజులు తగ్గించాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా హెల్త్ సెక్రటరీ జవహర్ రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పీజీ వైద్య సీట్లతో పాటు పీజీ దంత వైద్య సీట్ల ఫీజులనూ తగ్గిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇక వివిధ కేటగిరీల్లో 40 నుంచి 50శాతం మేరా ఫీజులను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. ప్రస్తుతం రూ. కోటి నుంచి రూ. కోటిన్నరగా ఉన్న మేనేజ్మెంట్ కోటా మెడిసిన్ సీటు... తాజా ఉత్తర్వులతో లక్షలకు చేరుకుంది. అదే సమయంలో కన్వీనర్ కోటా సీట్లు కూడా తగ్గిపోయాయి. ఈ కోటాలో ఏడాదికి రూ. 7.60 లక్షలు ఉన్న మెడిసిన్ సీటు దాదాపు సగానికి తగ్గిపోవడం విశేషం. పీజీ వైద్యవిద్య సీట్ల భర్తీలో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరేలా జీవో ఇప్పటికే విడుదల చేసింది. ఓపెన్ కేటగిరీలో సీటు పొందిన రిజర్వ్ అభ్యర్థి వేరే సీటుకు మారితే అదే రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థితోనే సీటును భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు.
ఇక ఫీజుల విషయానికొస్తే ప్రభుత్వం సూచించిన దానికంటే ఎక్కువగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవనే సంకేతాలు కళాశాల యాజమాన్యాలకు పంపింది ఏపీ ప్రభుత్వం. ఇక ప్రభుత్వం నిర్ణయించిన కొత్త ఫీజుల విషయానికొస్తే ట్యూషన్ ఫీజు, అడ్మిషన్ ఫీజు, స్పెషల్ ఫీజు, ఇతరత్రా ఫీజులన్నీ కలిపే ఉంటాయని స్పష్టం చేసింది. వీటికి వేరుగా వసూలు చేయరాదని ప్రభుత్వం పేర్కొంది. ఇక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యార్థులకు ఎంతైతే స్టైఫెండ్ చెల్లిస్తున్నారో అంతే స్టైఫండ్ ప్రభుత్వ కళాశాలలు కూడా చెల్లించాలని వెల్లడించింది.
Recommended Video
ఫీజులు తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఏడాది పీజీ వైద్య విద్యలో అడ్మిషన్లు నిలిపివేస్తామంటూ ఏపీ ప్రైవేట్ వైద్య కళాశాల యాజమాన్య సంఘం ప్రకటించింది. ఈమేరకు ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. కళాశాల నిర్వహించేందుకు తమకు తలకు మించిన భారం అవుతోందని అలాంటప్పుడు ఫీజులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం సరికాదని పేర్కొంటూ ఆరోగ్యశాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అందుకే ఈ ఏడాది పీజీ వైద్య విద్య అడ్మిషన్లు నిలిపివేసేందుకు నిర్ణయించుకున్నామని స్పష్టం చేసింది.