ఏపీలో ఇక ఇంగ్లీష్ మీడియం: కీలక ఉత్తర్వులు జారీ, ‘తెలుగు తప్పనిసరి’
రాష్ట్రంలో అన్ని ప్రాథమిక, ఉన్నత పఠశాలలో ఇంగీష్ మీడియం అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకటో తరగతి నుంచి 6వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు కానుంది.
ప్రతి మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలుగు మీడియం చదవాలనుకునే పిల్లల కోసం తెలుగు మీడియం స్కూళ్ల మండలానికి ఒకటి ఏర్పాటు చేస్తామని సర్కారు స్పష్టం చేసింది.
ఉర్దూ, ఒరియా, కన్నడ, తమిళ మీడియం పాఠశాలలు యథాతథంగాకొనసాగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రతీ మీడియం స్కూల్ లోనూ తెలుగును కంపల్సరీ సబ్జెక్టు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు బస్సు ఛార్జీలు కూడా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.
కాగా, ఇంగ్లీష్ మీడియంను వ్యతిరేకిస్తూ అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జనసేన పోరాటం చేసిన విషయం తెలిసిందే. తెలుగును చంపేస్తారా? అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాతృ భాషను మర్చిపోతే ఎలా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో వైఎస్ జగన్ సర్కారుపై ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. అయితే, జగన్ సర్కారు మాత్రం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదు. పలు సవరణలు చేసి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం విద్య అమల్లోకి రానుంది.