సీఎం జగన్ రాజీ పడ్డారా : కేంద్రం ఒత్తిడికి లొంగారా : జాతీయ మీడియా ఏం చెబుతోంది..!!
ముఖ్యమంత్రి జగన్ రాజీ పడ్డారా. కేంద్రం తీసుకొచ్చిన ఒత్తిడికి లొంగక తప్పలేదా. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించాలనే జగన్ నిర్ణయం మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. గత ప్రభుత్వంలో అవినీతి జరిగిదంటూ పీపీఏల సమీక్షకు జగన్ నిర్ణయించారు. అయితే.. దీని మీద తొలుత కేంద్ర ఇంధన శాఖ అభ్యంతరాలు వ్యక్తం చేసినా జగన్ సీరియస్ గా తీసుకోలేదు. నేరుగా ప్రధానికి పరిస్థితిని వివరించారు. ఇదే సమయంలో కేంద్ర మంత్రి సైతం పీపీఏల అవినీతి విషయంలో ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేసారు.
ఏపీలో..ఇక 13 కాదు..25 జిల్లాలు: సీఎం మరో హామీ అమలు దిశగా: ముహూర్తం ఖరారు..!!
ఇక..ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పీపీఏల సమీక్ష విషయంలో పరిస్థితిని వివరిస్తూ లేఖ రాసిందంటూ జాతీయ ఛానెళ్లు కధనాలు ప్రసారం చేస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ విద్యుత్ మంత్రి మాత్రం గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని ఈ విషయంలో అడుగు ముందుకే గానీ వెనక్కి ఉండదని స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు పీపీఏల విషయంలో ఏం జరుగుతోందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
జగన్ రాజీ బాట..కేంద్రానికి లేఖ..!!
ఏపీలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్ గత ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందని..అవసరమైన దాని కంటే ఎక్కువ మొత్తంలో చెల్లించారని ఆరోపించారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షిస్తామని ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ విషయాన్ని వివరించారు. అయితే దీని పైన కేంద్ర ఇంధన శాఖ వెంటనే స్పందన వ్యక్తం చేసింది. సమీక్ష చేస్తే అది ఏపీకే కాదని..జాతీయ స్థాయిలోనూ సమస్యలు వస్తాయని వివరిస్తూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీని పైన ఏపీ ముఖ్యమంత్రి జగన్ నేరుగా ప్రధాని కి ఈ అంశాన్ని వివరించారు. ఆ తరువాత కేంద్ర మంత్రి స్వయంగా ముఖ్యమంత్రికి లేఖ రాసారు. అయినా ప్రభుత్వం వెనుకడుగు వేయలేదు. దీని పైన జపాన్ వంటి దేశాల మొదలు పలువురు పారిశ్రామిక వేత్తలు సీఎం నిర్ణయాన్ని తప్పు బట్టారు. దీని పైన ఢిల్లీ వెళ్లి మరీ ప్రధానికి ముఖ్యమంత్రి తన వద్ద ఉన్న సమాచారం..తాను తీసుకోబోయే చర్యలనున వివరించారు. ఇక, రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్లుగా పీపీఏల్లో అవినీతి పైన ఆధారాలు లేవని తేల్చేసారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం గత పీపీఏల పైన సమీక్ష చేయటం లేదని.. ఖరారు కాని వాటి పైనే సమీక్ష చేస్తామంటూ కేంద్రానికి లేఖ రాసిందని జాతీయ మీడియా కధనాలు ఇచ్చింది. దీని ద్వారా జగన్ కేంద్రం సూచనలు..ఒత్తిడి మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నారనే వాదన మొదలైంది.
మంత్రి బాలినేని ఏం చెబుతున్నారంటే..
ప్రజా ప్రయోజనాల విషయంలో ఒక మెట్టు ఎక్కడమే తప్ప దిగడం ఉండదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.20 వేల కోట్ల భారంతో కొట్టుమిట్టాడుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ రంగం బతికిబట్టకట్టాలంటే ప్రక్షాళన తప్పనిసరన్నారు. ఇప్పుడున్న పరిస్థితితో ముందుకెళితే విద్యుత్ ఉత్పాదన కంపెనీలకు చార్జీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఉంటుందని చెప్పారు. ఇప్పటికే ఉత్పత్తి కంపెనీలకు చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోయాయని వివరించారు. విద్యుత్ రంగం పునర్జీవం కోసం ముఖ్యమంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వ హయాంలో అవినీతి, ఆశీత పక్షపాతంతో ప్రజల ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలిగించారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసుకున్న ఒప్పందాలను, వాస్తవ ధరలకన్నా ఎక్కువ ధరలకు కుదుర్చుకున్న ఒప్పందాలను తప్పకుండా పున: సమీక్షిస్తామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నామని ఈ విషయంలో అడుగు ముందుకే గానీ వెనక్కి ఉండదని మంత్రి బాలినేని చెప్పారు.
ఏపీ ప్రభుత్వం లేఖ రాయలేదా...
మంత్రి బాలినేని వ్యాఖ్యలను పరిశీలిస్తే తాము సమీక్షల విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గటం లేదని చెబుతున్నారు. అదే సమయంలో జాతీయ మీడియా ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గిందని.. కేంద్రానికి లేఖ రాసిందని చెబుతోంది. అయితే..ముఖ్యమంత్రి తమ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి ఉందంటూ పలు మార్లు చెప్పుకొచ్చారేు. అయితే..తాను తీసుకున్న నిర్ణయం నుండి జగన్ అంత త్వరగా వెనక్కు వెళ్లే వ్యక్తిత్వం కాదు. ఇటువంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడికి జగన్ లొంగుతున్నారా..లేక తన స్టాండ్ మీదే ఉంటారా అనేది ఆసక్తి కరంగా మారింది. మంత్రి బాలినేని మీడియాలో జరుగుతున్న ప్రచారం మీద వివరణ ఇచ్చారు కానీ, పీపీఏల్లో అవినీతిలో ఆధారాలు లేవనే కేంద్ర మంత్రి వ్యాఖ్యల మీద స్పందించలేదు. దీని పైన ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.