సంక్రాంతి సెలవుల పొడిగింపుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం?
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కేసుల సంఖ్య అనూహ్యంగా దూసుకెళ్తోంది. సంక్రాంతి పండగ సీజన్ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు కూడా విధించకపోవడం వల్ల కోవిడ్ పాజిటివ్ కేసులు మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. నైట్ కర్ఫ్యూను ఇదివరకే విధించినప్పటికీ.. దాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. మంగళవారం రాత్రి నుంచి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది.
శనివారం నాటి బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో 4,955 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో రోజువారీ కోవడ్ కేసులు రికార్డు కావడం ఇదే మొదటిసారి. మరణాలు ఆ స్థాయిలో నమోదు కాకపోవడం ఊరట కలిగిస్తోంది. కోవిడ్ వల్ల కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 22,870గా నమోదయ్యాయి. 14,509 మంది మృత్యువాత పడ్డారు.
విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం-1,103, చిత్తూరు-1,039 కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ స్థాయిలో మరే ఇతర జిల్లాలోనూ రోజువారీ కేసులు రికార్డు కాలేదు. అనంతపురం-212, తూర్పు గోదావరి-303, గుంటూరు-326, కడప-377, కృష్ణా-203, కర్నూలు-323, నెల్లూరు-397, ప్రకాశం-190, శ్రీకాకుళం-243, విజయనగరం-184, పశ్చిమ గోదావరి-55 కేసులు నమోదయ్యాయి.
ఈ పరిణామాల మధ్య జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సెలవులను ఈ నెల చివరి వరకు పొడగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో స్కూళ్లకు సెలవులు పొడిగింపుపై రాత్రి నాటికి ప్రకటన వెలువడొచ్చని తెలుస్తోంది. అన్ని కళాశాలలు, విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటుందని అంటున్నారు. ఏపీలో ప్రస్తుతం 13.87 శాతం కరోనా పాజిటివిటీ రేటు నమోదు అవుతోంది.
సమీప భవిష్యత్తులో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఆఫ్లైన్ తరగతులను నిర్వహించడం వల్ల విద్యార్థులు కోవిడ్ బారిన పడే ప్రమాదం ఉందంటూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించిందని, దీన్ని పరిగణనలోకి తీసుకుని విద్యాశాఖ కీలక నిర్ణయాన్ని తీసుకుంటుందని అంటున్నారు. ఇవే తరహా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను పొడిగించింది. ఈ నెల 30వ తేదీ వరకు అన్నిపాఠశాలలు, కళాశాలలకు సెలవును ప్రకటించింది.