వైఎస్ జగన్ దిద్దుబాటు: చంద్రబాబు హయాంలో కూల్చేసిన దేవాలయాల పునర్నిర్మాణం?:
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వంపై ఈ మధ్యకాలంలో రాజకీయ దాడులు తీవ్రం అయ్యాయి. ఇటీవలి కాలంలో ప్రత్యేకించి- తూర్పు గోదావరి జిల్లా సఖినేటి పల్లి మండలంలోని అంతర్వేదిలో వెలసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి చెందిన రథం మంటల్లో దగ్ధమైన అనంతరం జగన్ సర్కార్పై మతపరమైన విమర్శల తాకిడి ఉధృతమైంది. అంతర్వేది ఆలయ రథం కాలిపోయిన ఘటన అనంతరం దేవతా విగ్రహాల విధ్వంస ఘటనలు కొనసాగాయి.
రాజ్యసభ వేదికగా వైసీపీ, టీడీపీ అమీతుమీ: డాక్టర్ సుధాకర్ సహా: ఎంపీ కనకమేడల: కౌంటర్ ఎలా?
వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి..
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో వెండి సింహాల ప్రతిమల చోరీతో మరింత ఆగ్రహావేశాలు వ్యక్తం అయ్యాయి. అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరికి గురి చేశాయి. వరుసగా చోటు చేసుకున్న అంతర్వేది ఘటన, విగ్రహాల విధ్వంసం, వెండి సింహాల ప్రతిమల చోరీ ఘటనల పట్ల భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. ఛలో అమలాపురం ఆందోళననూ చేపట్టారు. అంతర్వేది ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణకు ఆదేశించినప్పటికీ.. నిరసన జ్వాల చల్లారలేదు.
దిద్దుబాటు చర్యల్లో జగన్..
ఈ పరిణామాలన్నీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై హిందువుల్లో వ్యతిరేకత పెరగడానికీ కారణమౌతోందని భావిస్తోన్న తరుణంలో.. వైఎస్ జగన్ దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపిస్తోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విజయవాడలో కూల్చివేతకు గురైన దేవాలయాలను పునర్నిర్మించడానికి చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని ఆయన దేవాదాయ మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
కృష్ణా పుష్కరాల సమయంలో..
2016లో కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలోని పలు దేవాలయాలను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. భక్తులతో పూజలు అందుకున్న అనేక విగ్రహాలను మున్సిపాలిటీ వాహనాల్లో తరలించిన ఘటన పట్ల హిందువులు మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో భాగస్వామిగా ఉండటం పట్ల అప్పట్లో బీజేపీ నేతలు ఎవరూ దీనిపై నోరు మెదపలేదనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఆ సమయంలో బీజేపీ సీనియర్ నేత పైడికొండాల మాణిక్యాలరావు స్వయంగా దేవాదాయ శాఖ మంత్రిగా చంద్రబాబు కేబినెట్లో ఉన్నారు.
రోడ్ల విస్తరణ పేరుతో..
అప్పట్లో ఎదురైన విమర్శలను చంద్రబాబు ప్రభుత్వం పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. పైగా కృష్ణా పుష్కరాల సందర్భంగా పుణ్యస్నానాలను ఆచరించడానికి వచ్చే భక్తుల రాకపోకలు అడ్డంకిగా ఉన్నాయని, రోడ్ల విస్తరణలో భాగంగా వాటిని తొలగించాల్సి వచ్చిందనీ చెప్పుకొంది అప్పటి ప్రభుత్వం. వాటిని పునర్నిర్మించాలని జగన్ సర్కార్ తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ ఆలయాలను కూల్చిన చోటే నిర్మిస్తారా? లేదా? అనేది తేలాల్సి ఉంది.
సూరాయపాలెం వద్ద
విజయవాడ శివార్లలోని గొల్లపూడి సూరాయపాలెం వద్ద 10 ఎకరాల్లో ఆలయాలను పునర్నిర్మించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికోసం ఇప్పటికే సూరాయపాలెం వద్ద పదెకరాల స్థలాన్ని ప్రభుత్వం డీనోటిఫై చేసిందని తెలుస్తోంది. దీనికోసం ఓ ఐఎఎస్ అధికారి సారథ్యంలో ప్రత్యేక కమిటీని నియమించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఆలయాల పునర్నిర్మాణాకి అవసరమైన నిధులను దేవాదాయ శాఖ పరిధిలోని సర్వ శ్రేయోనిధి (కామన్ గుడ్ ఫండ్-సీజీఎఫ్) నుంచి సేకరిస్తారని చెబుతున్నారు.
Recommended Video
డబుల్ చెక్..
దేవాలయాలను పునర్నిర్మించడం ద్వారా రాజకీయంగా, మతపరంగా వెల్లువెత్తుతోన్న విమర్శలకు తెర దించినట్టవుతుందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి డబుల్ చెక్ పడినట్టవుతుందని అంటున్నారు. ఆయా దేవాలయాలను ఎందుకు పునర్నిర్మించాల్సి వచ్చిందనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతుందని, చంద్రబాబు హయాంలో కూల్చివేతకు గురైన ఆలయాల అంశం మరోసారి తెరమీదికి తీసుకొచ్చినట్టవుతుందనే అభిప్రాయం వైసీపీ నేతల్లో వ్యక్తమౌతోంది.