సింగపూర్ తో బాబు ఒప్పందం రద్దు..! కానీ..ఆ దేశ కంపెనీలతోనే :మంత్రుల తాజా చర్చలు..!
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా..రాజధాని విషయంలో సింగపూర్ సంస్థలకు ఇచ్చిన ప్రాధాన్యత వైసీపీ అప్పట్లో తీవ్ర విమర్శలు చేసింది. సింగపూర్ కంపెనీలకు రైతుల భూములు కట్టబెడుతోందంటూ ఆరోపణలు గుప్పించింది. దీంతో..స్టార్టప్ ఏరియా గురించి నాడు టీడీపీ ప్రభుత్వం..సింగపూర్ కన్సార్షియంతో చేసుకున్న ఒప్పందం రద్దు దిశగా జగన్ సర్కార్ అడుగులు వేస్తోంది. తాజాగా, సింగపూర్ ప్రతినిధులతో మంత్రులు సమావేశమయ్యారు. గత ఒప్పందం గురించి సమీక్షించారు.
అది తమకు ఆమోద యోగ్యం కాదని.. స్టార్టప్ ప్రాంతం ప్రగతి పైన మరోసారి కొత్తగా ప్రతిపాదనలు సమర్పించాలని కోరారు. దీని ద్వారా వారిచ్చే ప్రతిపాదనలను పరిశీలించిన తరువాత వారితో కలిసి కొనసాగాలా వద్దా అనే అంశం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. దీని ద్వారా సింగపూర్ సంస్థలతోనే రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
చంద్రబాబు ఒప్పందం రద్దు..!
రాజధానిలో స్టార్టప్ ఏరియా డెవలప్ మెంట్ కోసం గతంలో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకొనే దిశగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాజధానిలో 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా కోసం సింగపూర్ కు చెందిన అసెండాస్..సింగ్ బ్రిడ్జి..సెంట్ కార్బ్ సంస్థల కన్సార్షియంను గత ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్ గా ఎంపిక చేసింది. ఈ కన్సార్షియంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థలు కలిసి ఎస్పీవీగా ఏర్పాటయ్యాయి. ఇందులో సింగపూర్ సంస్థకు 58 శాతం..ఏడీపీకీ 42 శాతం వాటా ఉంది.
ఇంసమీదులో భాగంగా పెట్టుబడుల వాటా సైతం ఖరారు చేసారు. అయితే, ఈ ఒప్పందం మీద సమీక్షించిన వైసీపీ ప్రభుత్వం ఇది సింగపూర్ కంపెనీలకు మేలు చేసేదిగా ఉందనే అభిప్రాయానికి వచ్చింది. దీంతో..ఆ ఒప్పందం రద్దు దిశగా అడుగులు వేస్తోంది. అయితే, ఏకపక్షంగా రద్దు చేయకుండా ఆ సంస్థలతో చర్చించి..వారికి మరో అవకాశం ఇవ్వాలని భావిస్తోంది.
అవే సంస్థలతో ప్రతిపాదనలు కోరుతూ..
ఇప్పుడు మంత్రులు బొత్సా సత్యనారాయణ..బుగ్గన రాజేంద్రనాద్ రెడ్డి సింగపూర్ కన్సార్షియం ప్రతినిధులతో భేటీ అయ్యారు. గత ఒప్పందం తమ ప్రభుత్వానికి ఆమోద యోగ్యంగా లేదని..కొత్త ప్రతిపాదనలు ఇవ్వాలని సూచించారు. ఈ ప్రాజెక్టు పైన అసలు కన్సార్షియం ఎంత మేర పెట్టుబడి పెడుతోంది.. వారికి భూమి కేటాయించటం వలన ఏపీ సీఆర్డీఏ కు ఎటువంటి ప్రయోజనం కలుగుతుందనే అంశం మీద వారు చర్చలు చేసారు. గత ప్రతిపాదనలను పక్కన పెట్టాలని..కొత్త ప్రతిపాదనలతో ముందుకు రావాలని సూచించింది. దీని ద్వారా గతంలో చేసుకున్న ఒప్పందం అమలు చేయటం లేదని ప్రభుత్వం పరోక్షంగా సింగపూర్ కన్సార్షియం ప్రతినిధులకు చెప్పినట్లుగానే కనిపిస్తోంది.
అయితే, సింగపూర్ కంపెనీలను భూములు కట్టబెట్టటం పైన అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ నేతలే తిరిగి ఇప్పుడు ప్రతిపాదనలు కోరటం పైన భిన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఒప్పందాలను ఏకపక్షంగా రద్దు చేయలేమని..అది ప్రతికూల పరిస్థితులకు కారణం అవుతుందని చెబుతున్నారు.
ఆ సంస్థలు ముందుకొచ్చేనా..
ఇప్పుడు మంత్రులు అమరావతిలో స్టార్టప్ ఏరియా పైన గతంలో చేసుకున్న ఒప్పందాన్ని కాదని..కొత్త ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరారు. అయితే, వారిచ్చే ప్రతిపాదనలు ఏపీకి..సీఆర్డీఏకు మేలు చేసే విధంగా ఉంటే ముందుకు వెళ్తామని..లేకుంటే నిర్ణయాన్ని మార్చుకుంటామని మంత్రులు చెబుతున్నారు. గతంలో ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సమీక్షించే అధికారం కొత్త ప్రభుత్వానికి ఉంటుందని కొద్ది రోజుల క్రితం సింగపూర్ మంత్రి సైతం వ్యాఖ్యానించారు.
కొత్త ప్రభుత్వ విధానం స్పష్టం అయిన తరువాత తాము స్పందిస్తామని చెప్పుకొచ్చారు. ఇక, ఇప్పుడు మంత్రులు నేరుగా కన్సార్షియం ప్రతినిధులతో సమావేశమై..తాము ఏం కోరుకుటుందీ స్పష్టం చేసారు. ఇప్పుడు సింగపూర్ కంపెనీల స్పందనకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.