బాబు..పవన్ టార్గెట్: రాజధాని తరలింపుపై అఖిలపక్షంపై కొత్త ట్విస్ట్: అక్కడే ఫైనల్!
ఏపీలో మూడు రాజధానులు..విశాఖలో పరిపాలనా రాజధాని దిశగా ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రెండు కమిటీలు ప్రభుత్వ ఆలోచనలకు తగినట్లుగానే నివేదికలు ఇచ్చాయి. ఇక, ప్రభుత్వం నియమిం చిన హైపవర్ కమిటీ నివేదిక..అసెంబ్లీ ఆమోదం ప్రభుత్వ వర్గాలు మాత్రం లాంఛనంగానే భావిస్తున్నాయి. అయితే, ఇదే సమయంలో అమరావతిలో రైతుల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. అధికార పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు అమరావతి రైతులకు అండగా నిలుస్తున్నాయి.
రైతులకు మద్దతు ప్రకటించాయి. ఇదే సమయంలో మూడు రాజధానుల ప్రతిపాదన..అమరావతి నుండి పరిపాలనను తరలించటం పైన వ్యతిరేకంగా ఉన్నాయి. రాజధాని వ్యవహారం ప్రభుత్వ సొంత వ్యవహారం కాదని..అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి ఆమోదం తీసుకోవాలని పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, ప్రభుత్వం అఖిలపక్షం పైన కొత్త ఆలోచన చేస్తోంది. అసలు..అఖిలపక్షం ఉంటుందా..ఉండదా..ఉంటే ప్రభుత్వం ఏ రకంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది...
అఖిపక్షం నిర్వహిస్తారా..
రాజధాని వ్యవహారం పైన ప్రభుత్వం కార్యాచరణ దాదాపు ఖరారైంది. ఇప్పటికే అందిన రెండు నివేదికల మీద ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక రాగానే..కేబినెట్ ఆమోదం..ఆ తరువాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తీర్మానం చేయటం ద్వారా ఆమోద ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలుత ఈ వ్యవహారం మీద అఖిలపక్షం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాము తీసుకున్న నిర్ణయం ద్వారా అమరావతి గ్రామాల్లో మాత్రం వ్యతిరేకత ఉందని..రైతులకు మంచి ప్యాకేజి ఇవ్వటం ద్వారా వారిని శాంతింప చేయవచ్చని భావించింది. రాజధాని ప్రతిపాదనలను ఇతర పార్టీలు వ్యతిరేకిస్తే.. ఆ ఆ ప్రాంతాల్లో టీడీపీ వంటి పార్టీలు పూర్తిగా నష్టపోతాయని వైసీపీ అంచనా వేసింది. ఇందు కోసం ప్రభుత్వ ప్రతిపాదనపైన అఖిలపక్షం ఏర్పాటు చేయాలనే దిశగా ఆలోచన చేసింది. ఇప్పుడు, మాత్రం ఆ దిశగా ఎక్కడా ప్రభుత్వంలో చర్చ జరగటం లేదు.
8న కేబినెట్ లో నిర్ణయం...
రాజధాని అంశం మీద ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేవలం అసెంబ్లీలోనే చర్చ చేసారని...అఖిల పక్ష సమావేవం నిర్వహించ లేదని కొందరు మంత్రులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశ పెట్టి జనసేన..టీడీపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని..అక్కడే ప్రాంతాల వారీగా టీడీపీ ఎమ్మెల్యేలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తారని అంచనా వేస్తోంది.
అదే సమయంలో వైసీపీ నుండి మాత్రం మూడు ప్రాంతాలకు చెందిన ఎంపిక చేసిన ఎమ్మెల్యేలతో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతుగా మాట్లాడిం చాలని నిర్ణయించింది. ఇక, జనసేన ఎమ్మెల్యే ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే, చంద్రబాబు చేసిన విధంగా కాకుండా.. అఖిలపక్షం సైతం ఏర్పాటు చేసి సభలో ప్రాతినిధ్యం లేని పార్టీల కు సైతం ఆహ్వానం పలికి..ప్రభుత్వ సదుద్దేశం వివరించాలనే భావన సైతం ప్రభుత్వంలోని ముఖ్యులు వ్యక్తం చేస్తున్నారు.
పవన్..చంద్రబాబును ఫిక్స్ చేద్దామంటూ..
అఖిలపక్షం పైన ఈ నెల 8న జరిగే కేబినెట్ సమావేశంలో మంత్రుల అభిప్రాయాలను సేకరించి..ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకోనున్నారు. అఖిలపక్షం సమావేశంలో పార్టీ ప్రతినిధులను కాకుండా.. రాష్ట్ర రాజధాని అంశం కావటంతో పార్టీ అధ్యక్షులను ఆహ్వానించటం ద్వారా..రాజకీయంగా పైచేయి సాధించవచ్చనేది ప్రభుత్వ వ్యూహంగా తెలుస్తోంది.
ఇప్పటికే జనసేన అధినేత ప్రభుత్వం ఈ నిర్ణయం పైన ప్రతిపక్షాలు ఆమోదం తెలిపేలా వ్యవహరించాలని డిమాండ్ చేసారు. దీంతో.. టీడీపీ..జనసేన నుండి పార్టీ అధినేతలను..అదే విధంగా బీజేపీ నుండి రాష్ట్ర అధ్యక్షుడు..కమ్యూనిస్టు పార్టీల నుండి రాష్ట్ర కార్యదర్శులను..ముఖ్యమైన సంఘాలను ఆహ్వానించే ప్రతిపాదన పైనా చర్చ సాగుతోంది. అధినేతలను పిలవటం ద్వారా ప్రాంతాల వారీగా నేతలను అఖిలపక్ష సమావేశానికి పంపే అవకాశం ఉంటుందని..దీని కారణంగా ప్రతిపక్షాలకు రాజకీయంగా అవకాశం ఇచ్చినట్లవుతుందని భావిస్తున్నారు. దీంతో..అఖిలపక్షం నిర్వహించాలని నిర్ణయిస్తే పార్టీ అధినేతల ద్వారా నిర్వహించి..వారి అభిప్రయాలు ఏ రకంగా ఉండేదీ ప్రభుత్వం ఇప్పటికే అంచనాకు రావటంతో.. చివరకు అసెంబ్లీ నిర్ణయం మేరకు నిర్ణయం జరిగిందని చెప్పే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేస్తోంది.