ఉద్యోగాల వయో పరిమితిపై కీలక నిర్ణయం: సంక్రాంతికి నియామక క్యాలెండర్: కొత్త విధానంలో పరీక్షలు..!
ఏపీలో నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కేలండర్ సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉంది. అదే విధంగా వయో పరిమితి విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీపీఎస్సీ ఈ మేరకు సిఫార్సులు చేసింది. అదే విధంగా ప్రతీ ఏటా జనవరి తొలి వారంలోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రకటన విడుదల చేస్తామని గతంలోనే ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ఈ ఏడాది అది సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
అదే సమయంలో పరీక్షల నిర్వహణలో కొత్త విధానం ప్రవేశ పెడుతోంది. ఏపీపీఎస్సీ ద్వారా పరీక్షలు నిర్వహించినా..ప్రశ్నా పత్రాల తయారీ బాధ్యత మూడో సంస్థకు ఇవ్వాలని నిర్ణయించారు. పరీక్షకు కేవలం రెండు నిమిషాల ముంద పరీక్షా హాల్లో ట్యాబ్ ద్వారా అభ్యర్ధులకు ప్రశ్నపత్రం అందిస్తారు. ఈ మొత్తం వ్యవహారం ఉద్యోగాల నోటిఫికేష న్ సమయంలో అధికారికంగా ప్రకటించనున్నారు.
వయో పరిమితి 46 ఏళ్లు...!
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలో అభ్యర్దులు రిక్వెస్ట్ మేరకు ఏపీపీఎస్సీ ప్రభుత్వానికి కీలక సిఫార్సులు చేసింది. వయోపరిమితి పెంపును 46 ఏళ్లు..ఆ పైన పెంచే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి నివేదించారు. కమిషన్ ఇటీవల నిర్వహించిన ఓపెన్ హౌస్లో ఉద్యోగ పరీక్షల్లో వయో పరిమితికి సంబంధించి ఎక్కువ వినతులు వచ్చాయి. వాటి ఆధారంగా వయో పరిమితి లేకుండా చేయాలని ఏపీపీఎస్సీ సభ్యులు చేసిన సూచన మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇందులో ప్రభుత్వం 46 ఏళ్ల వయో పరిమితి మీద ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీని కోసం గతంలో జారీ అయిన నోటిఫికేషన్లు.. నిరుద్యో గుల్లో సగటు వయసు..ప్రస్తుతం ప్రభుత్వం భర్తీ చేస్తున్న ఉద్యోగాల ఆధారంగా వయో పరిమితి పైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. దీని పైన ఒకటి రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటనకు అవకాశం కనిపిస్తోంది.
నియామక క్యాలెండర్ సంక్రాంతికే..
ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రతీ ఏటా జనవరి మొదటి వారంలో ఉంటుందని స్పష్టం చేసారు. అయితే, జనవరి ప్రవేశిస్తున్నా..ఆయా శాఖల నుండి ఉద్యోగ ఖాళీల వివరాల పైన అధికా రిక నిర్ణయం జరగకపోవటంతో ఉద్యోగాల భర్తీ ప్రకటన కొంత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు గుర్తించాలని రెండు నెలల కిందటే ప్రభుత్వం ఆదేశించింది. దీని పైన శాఖల వారీగా ఎన్ని పోస్టులు భర్తీ చేయాలనే దాని పైన సమాచారం వచ్చిన తరువాత భర్తీ ప్రకటన జారీ కానుంది. ఇదే విషయాన్ని మరోసారి ప్రభుత్వానికి నివేదింగా..తాజాగా ప్రభుత్వం నుండి వెల్లిన ఆదేశాలతో తొలి వారం ప్రభుత్వ శాఖల నుండి ఏపీపీఎస్సీకి సమాచారం అందే అవకాశం ఉంది. దీంతో...సంక్రాంతికి అంటే జనవరి 15 నుండి నెలాఖరులోగా మొత్తంగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ జారీకి అవకాశం ఉంది.
కొత్త విధానంలో పరీక్షల నిర్వహణ..
ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం కొత్త విధానం ఎంచుకుంది. దీని ద్వారా పరీక్షల నిర్వహణ..ర్యాకింగ్ వంటి వాటిని మూడో సంస్థ ద్వారా నిర్వహించే విధంగా ఏపీపీఎస్సీ ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగానే..ఫిబ్రవరి 4నుంచి 16వరకు జరిగే గ్రూప్-1 పరీక్షలన్నీ ఆన్లైన్ ద్వారా నిర్వహించబోతున్నారు. ప్రశ్నా పత్రాలు లీకవుతుండటంతో వాటి ముద్రణ లేకుండా నేరుగా పరీక్షా కేంద్రంలో పరీక్ష సమయానికి రెండు నిముషాలు ముందు ఇన్విజిలేటర్ టాబ్లోకి వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడి నుంచి ప్రశ్నాపత్రం వస్తుందో... వాటిని ఎవరు తయారు చేస్తున్నారో ఏపీపీఎస్సీ సెక్రటరీకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ప్రతి అభ్యర్థికి ఒక ట్యాబ్ ఇచ్చి వాటిలోకి ప్రశ్నా పత్రాన్ని పరీక్ష సమయానికి కొన్ని సెకన్ల ముందు పంపుతారు. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే ప్రశ్నాపత్రం ట్యాబ్లో కనిపిస్తుంది. అప్పటికే 36 పేజీలతో బార్ కోడ్ ఆన్సర్ షీట్ అభ్యర్థులకు అందిస్తారు. సమాధానం మాత్రం అందులోనే రాయాల్సి ఉంటుంది. పరీక్ష సమయానికి కరెక్టుగా ట్యాబ్లో ప్రశ్నాపత్రం క్లోజ్ అయిపోతుంది.