లాస్ట్ ఛాన్స్: మండలి రద్దు..మూడు రోజులు: టార్గెట్ ఛైర్మన్.. వైసీపీ వ్యూహం ఇదే..!
ఏపీలో శాసన మండలి రద్దు దిశగా అడుగులు పడుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలిచ్చారు. మండలికి ఖర్చు చేస్తున్న నిధులతో పాటుగా..అసెంబ్లీలోనే మేధావులు ఉన్నారంటూ వ్యాఖ్యలు చేసారు. ఇక, మంత్రులు..ఎమ్మెల్యేలు సభలోనే మండలి అవసరం లేదంటూ స్పష్టం చేసారు. అయితే, గురువారమే దీని పైన తుది నిర్ణయం తీసుకోవాలని భావించినా..చివరి నిమిషం లో మాత్రం సీఎం వ్యూహాత్మకంగా సోమవారం దీని పైన చర్చించి తుది నిర్ణయం తీసుకుందామంటూ ప్రతిపాదించారు. అయితే, ఈ మూడు రోజుల నిర్ణయం వెనుక వైసీపీ భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. తమ లక్ష్యాలకు పరిస్థితులు అనుకూలంగా మరితే..ఓకే లేకుంటే వేటే అన్నట్లుగా పార్టీ కార్యాచరణ సిద్దం చేసినట్లుగా తెలుస్తోంది. అందులో ప్రధాన లక్ష్యం మండలి ఛైర్మన్. ఇంతకీ వైసీపీ ఏం చేయబోతోంది..
మండలి విజయం .. అది చంద్రబాబు అనుభవం .. అర్ధమైందా : నారా లోకేష్
మండలి సభ్యులకు సమయం ఇచ్చారా...
కొద్ది రోజులుగా మండలి రద్దు గురించి ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇస్తూనే ఉంది. శాసనసభలో ప్రభుత్వం ఆమోదించిన ఎస్సీ కమిషన్..ఇంగ్లీషు మీడియం బిల్లులను శాసన మండలి సవరణలను ప్రతిపా దించి...తిరిగి శాసనసభకు పంపింది. ఆ సమమంలోను సీఎం మండలిలో తీసుకున్న నిర్ణయాల పైన అసహనం వ్యక్తం చేసారు. ఇక, తాజాగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన మూడు రాజధానులు.. సీఆర్డీఏ రద్దు బిల్లులను అనూహ్య పరిణామాల మధ్య..ఛైర్మన్ తన విచక్షణాధికారాలతో సెలెక్ట్ కమిటీకి పంపటం పైన ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇక, తొలుగ గురువారమే శాసనసభలో మండలి రద్దు తీర్మానం ప్రతిపాదించాలని భావించారు. అయితే, వైసీసీకి భవిష్యత్ లో రాజకీయంగా అసవరాలు ఉండటం..ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీలకు లాస్ట్ ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే..నిర్ణయం ఖాయమనే సంకేతాలిస్తూనే ఏపీ ప్రభుత్వం మూడు రోజుల వ్యూహాత్మక సమయం ఇచ్చింది.
ఇదే లాస్ట్ ఛాన్స్...
వైసీపీలో జరుగుతున్న చర్చల ప్రకారం..మండలి రద్దు నిర్ణయం ప్రభావం అనేక మండి సభ్యుల మీద ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రద్దు నిర్ణయం పైన టీడీపీ ..బీజేపీ సభ్యులు బయట పడకపోయినా కొందరు మాత్రం టీడీపీ తీరు కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయంతో ఉన్నారు. అదే సమయంలో టీడీపీలోని కొందరు సైతం తమ పదవులును కోల్పోవటానికి సిద్దంగా లేరని తెలుస్తోంది. వీరంతా ఈ మూడు రోజుల కాలంలో వైసీపీతో టచ్ లోకి వచ్చే పరిస్థితి అంచనా వేస్తున్నారు. మండలిలో తమకు సానుకూల వాతావరణం నెలకొనే అవకాశాలను పరిశీలించి..తాము అనుకున్న విధంగా జరగకపోతే ముందుకే వెళ్లాలని భావిస్తున్నారు. సభ్యులు వైసీపీ నేతలతో చర్చలకు వచ్చి..వారికి అనుకూలంగా వ్యవహరిస్తే మాత్రం ప్రభుత్వం మండలి రద్దు నిర్ణయం పైన మరోసారి ఆలోచించే అవకాశాలకు ఛాన్స్ ఉందని పార్టీ నేతలే చెబుతున్నారు. మండలి సమావేశం జరుగుతున్న సమయంలోనే విపక్ష సభ్యులు ఇద్దరు నేరుగా ప్రభుత్వానికి మద్దతివ్వగా..మరో ఎమ్మెల్సీ రాజీనామా లేఖను తమ పార్టీ అధినేతకు పంపారు.
టార్గెట్ ఛైర్మన్..ఆ వెంటనే
మండలి చైర్మన్ తీరు పైన ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా ఆగ్రహంతో ఉన్నారు. మండలిలో పరిస్థితి తమకు అనుకూలగా మారి..రద్దు నిర్ణయం పైన పునరాలోచన చేసినా...ఛైర్మన్ గా షరీఫ్ కొనసాగటానికి మాత్రం ససేమిరా అంటున్నారు. ఈ మూడు రోజుల్లో మండలిలో సభ్యులు తాము అంచనా వేస్తున్నట్లుగా తమ వైపు వస్తే..ముందుగా ఛైర్మన్ హోదా నుండి షరీఫ్ ను తప్పించే ప్రతిపాదన తీసుకొచ్చే అవకాశం ఉంది. అయితే, మైనార్టీ వర్గానికి చెందిన నేత కావటంతో..వైసీపీ తమ ప్రమేయం లేకుండానే ఆయనంతటగా ఆయన ఛైర్మన్ పదవికి రాజీనామా చేసేలా మరో వ్యూహం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. షరీఫ్ ను రాజీనామా కోరే అవకాశాలు లేకపోలేదు. అయితే, ఈ మూడు రోజుల పాటుగా టీడీపీ తమ సభ్యుల మనసు మారకండా ఏ రకంగా మేనేజ్ చేస్తుందీ.. మండలిలో ఇతర సభ్యులు ప్రభుత్వం ముందుకు ఏ రకమైన ప్రతిపాదనలతో ముందుకు వెళ్తారు..అంతిమంగా ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.