కొడాలి నాని వర్సెస్ చంద్రబాబు: పెన్షన్లు తగ్గించలే, పెంచాం, కళ్లున్న కబోది అంటూ...
ఏపీలో పెన్షన్లు తగ్గించడం లేదని, అర్హులకు ఇంటికి తీసుకొచ్చి మరీ అందజేస్తున్నామని ఏపీ మంత్రి కొడాలి నాని స్పష్టంచేశారు. కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మాత్రం అసత్యాలను వల్లెవేస్తారని విమర్శించారు. అతని ఎల్లో మీడియాకు కూడా గత 8 నెలలుగా చేస్తున్న సంక్షేమ పనులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఆదివారం తాడేపల్లిలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.
రూ.2500కి పెంపు..
రాష్ట్రంలో 90 లక్షలకు పైగా మంది పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి కొడాలి నాని చెప్పారు. రూ. వెయ్యి పెన్షన్ రూ.2500 పెంచినట్టు గుర్తుచేశారు. ఆర్థిక స్థోమత ఉన్నవారికి మాత్రం తగ్గించామని.. అలా లక్ష మంది వరకు ఉంటారని తెలిపారు. 55 లక్షల మందికి కొత్తగా పెన్షన్లు ఇస్తున్నామని.. 8 నెలలో కోటి మందికి చేయూతనిచ్చామని పేర్కొన్నారు. వ్యవసాయం ద్వారా రైతులు, వృద్దులకు, వికలాంగులకు, వితంతులను ఆదుకున్నామని చెప్పారు. ఇవేగాక అమ్మఒడి ద్వారా రూ.15 వేలు, రైతు భరోసా ద్వారా రూ.13,500 అందజేశామని చెప్పారు.
3 నెలల ముందు..
చంద్రబాబు నాయుడు లాగా జగన్మోహన్ రెడ్డి మాయచేయరని కొడాలి నాని చెప్పారు. ఎన్నికలు మూడు నెలలు అనగా పసుపు కుంకుమ పేరుతో రూ.10 వేల అందజేశారని గుర్తుచేశారు. దానిని ఆ చానెళ్లు, పత్రికలు కవర్ చేశాయని చెప్పారు. ప్రభుత్వంపై ఏదో ఆరోపణ చేసి.. జగన్ను ఎప్పుడూ దించేద్దామా.. ఎప్పుడు అధికారం చేపడుదామా అని చంద్రబాబు ఆలోచిస్తున్నారని కొడాలి నాని విమర్శించారు. రాష్ట్రంపై పడి దోచుకోవాలని.. ఫైరవీలు చేసుకోవాలని తహతహలాడుతున్నారని విమర్శించారు.
ఎల్లో మీడియా అబద్ధాలు..
చంద్రబాబు ఎల్లో మీడియా నిజా నిజాలు తెలుసుకోకుండా 7 నెలల్లో 7 లక్షల మందికి పెన్షన్ కట్ అని వార్తలు రాస్తోందని చెప్పారు. వీరి బాస్ చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకేసి.. జగన్ వాగ్దానాలను వమ్ము చేస్తున్నారని కామెంట్లు పెడతారని పేర్కొన్నారు.
ఐదేళ్లు తగ్గింపు
అర్హులకు పించన్ ఇచ్చేందుకు జన్మభూమి కమిటీలు రద్దుచేశామని వివరించారు. కులం, మతం, జాతి, ప్రాంతం అని తేడా లేకుండా అందరికీ పింఛన్లు ఇస్తున్నామని చెప్పారు. అర్హులకు పించన్ అందించాలనే ఉద్దేశంతో వయస్సు కూడా తగ్గించామని మంత్రి కొడాలి నాని చెప్పారు. 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించామని పేర్కొన్నారు.