ఏపీలో ఇంకా అందని జీతాలు, పింఛన్లు.. ఆందోళనలో ఉద్యోగులు...
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వానికి రాబడి తగ్గడంతో ఆ మేరకు జీతాలు, వేతనాలను రెండు విడతల్లో చెల్లించాలని నిర్ణయించిన జగన్ సర్కార్.. నాలుగో తేదీ వచ్చేసినా ఇంకా ఉద్యోగులు, పింఛనర్లకు చెల్లింపులు చేయలేకపోయింది. రెండు విడతల్లో చెల్లింపులు చేయాలని చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం అధికారులు దీనిపై కసరత్తు పూర్తి చేయపోవడంతో ఈ ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల జీతాలు, పింఛన్ల ఆలస్యం..
ఏపీలో ప్రతీ నెల 25 కల్లా ఏ ఉద్యోగికి ఎంత చెల్లించాలన్న దానిపై ప్రభుత్వానికి ఆయా శాఖల నుంచి సమాచారం అందాల్సి ఉంటుంది. వీటి ఆధారంగా నెలవారీ చెల్లింపులు చేస్తుంటారు. కానీ ఈసారి సీఎం జగన్ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకోవడంతో ఆ మేరకు సవరించిన జీతభత్యాలు, పింఛన్ల వివరాలు ఇవ్వాల్సిందిగా డీడీవోలకు ఆదేశాలు వెళ్లాల్సి ఉంది. కానీ ఈ ప్రక్రియ మొదలైతే పూర్తయ్యేందుకు కనీసం 15 రోజులు పడుతుంది. దీంతో సీఎఫ్ఎంఎస్ సాఫ్ వేర్ లోనే అత్యవసరంగా కొన్ని మార్పులు చేశారు. వీటి ప్రకారం నిర్దారించిన మొత్తాలను డీడీవోలకు పంపి నిర్ధారించాల్సిందిగా కోరారు. వీటిని సరి చూసుకుని వారు నిర్ధారణ సమాచారాన్ని తిరిగి సీఎంఎఫ్ఎస్ కు పంపుతున్నారు. ఈ ప్రక్రియ నిన్న రాత్రికి కూడా పూర్తి కాలేదు.
ఇవాళ లేదా సోమవారమే చెల్లింపులు..
తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం జీతాలు, పింఛన్లను చెల్లింపుకు డీడీవోలు నిర్ధారించిన సమాచారాన్ని సీఎంఎఫ్ఎస్ ధృవీకరిస్తుంది. ఆ తర్వాత ఆన్ లైన్లో చెల్లింపులు జరుగుతాయి. ఈ ప్రక్రియ దాదాపుగా కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లలో ఇవాళ సాయంత్రం లోగా కొందరికి, సోమవారం మరికొందరికి చెల్లింపులు జరిగే అవకాశాలున్నాయి. ముందుగా ఉద్యోగులకు విభాగాల వారీగా చెల్లించి, ఆ తర్వాత పెన్షనర్లపై దృష్టిసారిస్తారు. ఈ లెక్కన పెన్షనర్లకు సోమవారం నుంచి చెల్లింపులు జరిగే అవకాశముంది.
అరకోర జీతాల్లో ఆలస్యంపై ఆందోళన..
ఉద్యోగులు, పింఛన్ తీసుకునే వారు ఎప్పుడూ ఒకటో తేదీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే వారే. ఒకటో తేదీకి తగినట్లుగా కుటుంబ బడ్డెట్ ను ప్లాన్ చేసుకుంటారు. కానీ ఏపీలో ప్రభుత్వం ఈసారి చివరి నిమిషం వరకూ దీనిపై నిర్ణయం తీసుకోకుండా మీనమేషాలు లెక్కించింది. పొరుగున ఉన్న తెలంగాణలో సైతం సీఎం కేసీఆర్ ముందుగానే నిర్ణయం తీసుకున్నా, ఏపీలో నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో సీఎఫ్ఎంఎస్ సాఫ్ట్ వేర్లో మార్పులతో పాటు హడావిడిగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్ధితి. అలా పనిచేయకపోతే జీతాలు, పింఛన్ల చెల్లింపుకు మరో 15 రోజులు ఆలస్యమవుతుంది. ఆందుకే చివరి నిమిషం మార్పులు చేసినా జరగాల్సిన ఆలస్యం జరిగిపోయింది. దీంతో ఉద్యోగులు, పెన్షనర్లలో సైతం ఆందోళన వ్యక్తమవుతోంది.