తమిళనాడుతో మాట్లాడండి, బాబు స్పందించాలి: చెన్నై టెక్కీ ఆవేదన, కేతిరెడ్డి ఏమన్నారంటే..
అమరావతి/చెన్నై: చెన్నైలో గత మంగళవారం అర్ధరాత్రి సమయంలో యువకుల దాడిలో గాయపడిన మహిళా సాఫ్టువేర్ ఇంజినీర్ లావణ్యకు సాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం రెండు రోజుల క్రితమే ముందుకు వచ్చింది. బాధితురాలు సోధరి నారీష చెప్పిన వివరాల మేరకు ఏపీ అధికారులు ఫోన్లో మాట్లాడారు.
చదవండి: చెన్నైలో దాడి: ఆంధ్రా టెక్కీ లావణ్య ఏడ్చినా కాపాడేందుకు రాలేదు! ముగ్గురి అరెస్ట్
దాడి సంఘటనపై దిగ్భ్రాంతికి గురయ్యారని, తమ కుటుంబానికి సహకరిస్తామని చెప్పారని తెలిపారు. అయితే, ప్రస్తుతం లావణ్య కంపెనీయే సహకరిస్తోందని, కాబట్టి ప్రస్తుతం అవసరం లేదన్నారు. డాక్టర్లు మంచి కేర్ తీసుకుంటున్నారని తెలిపారు. చెన్నై పోలీసులు కూడా బాగా స్పందించారన్నారు. తమకు సాయం చేసేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని లావణ్య సోదరి చెప్పారు.
లావణ్యను కలిసిన తెలుగు నాయకులు
ఇదిలా ఉండగా, తనకు జరిగిన అన్యాయంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించాలని లావణ్య అన్నారని తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కోలుకుంటున్నారు. మంగళవారం లావణ్యను ఆసుపత్రిలో తమిళనాడు తెలుగు నాయకులు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, టమ్స్ వ్యవస్థాపకులు గొల్లపల్లి ఇజ్రాయెల్, పి పాలకొండయ్య తదితరులు కలిశారు. త్వరగా కోలుకోవాలని ఉండాలని కోరుకుంటు తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను ఆమెకు ఇచ్చారు.
ఆ ప్రాంతంలో ఇలాంటివి ఎక్కువగా
వారు లావణ్య కుటుంబానికి సానుభూతిని తెలిపారు. అనంతరం కేతిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. చైన్నై పోలీస్ కమిషనర్ను, పోలీసు అధికారులను అభినందించారు. ముఖ్యంగా ఈ ఓఎంఆర్ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి పొట్టకూటి కొరకు, విద్య కొరకు వచ్చిన వారిపై దాడులు జరుగుతున్నాయని, తమ దృష్టికి వచ్చిందన్నారు. కొంతమంది ధైర్యంగా వాటిని ఎదుర్కొంటున్నారని చెప్పారు.
తెలుగువారిపై దాడులు
కొందరు ఉద్యోగులు, విద్యార్థులు అన్నీ వదిలేసి దాడులు జరిగితే సొంత ఊళ్లకు వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక చెన్నైలోనే కాదని, దేశంలోని పలు నగరాల్లో ఇలా జరుగుతోందన్నారు. ముఖ్యంగా తెలుగు వారిపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఇటీవల సత్యభామ వర్సిటీలో రాగమౌళిక రెడ్డి ఆత్మహత్య జరిగిందని గుర్తు చేశారు. కొన్ని పరువును కాపాడుకునే క్రమంలో బయటకు రావడం లేదన్నారు.
తమిళనాడు కదా ఎవరూ లేరనుకోవద్దు
తాము తమిళనాడులోని తెలుగు వారి సమస్యలపై పోరాటం చేస్తున్నామని మాత్రమే అనుకోవద్దని, విద్యాసంస్థల్లో, ఉద్యోగ సంస్థలలో పని చేసే తెలుగువారి న్యాయమైన కోర్కెల కొరకు కూడా పోరాటాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కేతిరెడ్డి చెప్పారు. అందరికీ అండగా ఉంటామన్నారు. ఇది తమిళనాడు మనకు ఎవరూ లేరనుకోవద్దని, అవసరమైతే ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తామని చెప్పారు. ఎవరూ అభద్రతా భావంతో ఉండవద్దన్నారు.
చెన్నై నగరం పెరిగింది కాబట్టి
చెన్నై నగరం బాగా పెరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చెన్నైని రెండు కమిషనరేట్లుగా చేయాలని కేతిరెడ్డి అన్నారు. ఓఎంఆర్లో ఎక్కువగా ప్రకటనల ద్వారా హెచ్చరికలు జారీ చేయాలని, హైసెక్యూరిటీ జోన్గా గుర్తించి పోలీసు వ్యవస్థను బలోపేతం చేయాలన్నారు. ఈ ప్రాంతంలో పబ్స్ శని, ఆదివారాలు మాత్రమే ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇలాంటి దాడి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు.
చంద్రబాబుకు విజ్ఞప్తి
ఇదిలా ఉండగా, లావణ్య, వారి కుటుంబ సభ్యులు ఏపీ సీఎం చంద్రబాబుకు ఓ విజ్ఞప్తి చేశారు. ఓ మహిళగా తన దుస్థితిని ఇక్కడ ఉన్న సీఎంతో మాట్లాడి నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చర్యలు చేపట్టాలని, ఓ తెలుగు మహిళకు అన్యాయం జరిగింది కాబట్టి నేను ఉన్నాను అనే సందేశం చంద్రబాబు ఇవ్వాలని ఆవేదనగా చెప్పారు. తనపై దాడి ఘటనపై చంద్రబాబు వెంటనే స్పందించాలన్నారు. ఇక్కడి ప్రభుత్వంతో మాట్లాడి తెలుగువారికి ధైర్యం ఇవ్వాలని కేతిరెడ్డి చంద్రబాబును కోరారు.