ఏపీలో అవినీతిపై భారీగా ఫిర్యాదులు: కొత్తగా కాల్ సెంటర్ ఏర్పాటు: రుజువైతే ఇంటికే..!
ఏపీలో అవినీతి రహిత పాలన అందిస్తామని ముఖ్యమంత్రి జగన్ గతంలోనే ప్రకటించారు. తాజాగా జరిగిన సమీక్షలో ..ఏపీలో రాజకీయ అవినీతి తగ్గినా..కింది స్థాయిలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి తగ్గలేదని కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో ఏసీబీకి ప్రత్యేకాధికారాలు ఇస్తూ..దాడులు పెంచాలని ఆదేశించారు. ఇప్పటికే ఏపీలో అవినీతి నిరోధక శాఖ ఒక టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా అవినీతి పైన ఫిర్యాదులను స్వీకరి స్తోంది. దీంతో పాటుగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1100 ద్వారా అవినీతి పైన ఫిర్యాదులు స్వీకరించే వారు. అయితే, కొద్ది రోజులుగా ఈ రెండు నెంబర్లకు పెద్ద ఎత్తున అవినీతి పైన ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో..కాల్ సెంటర్ ఏర్పాటుతో పాటుగా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అవినీతి ఫిర్యాదులకు కాల్ సెంటర్
రాష్ట్రంలో అవినీతి వ్యవహారాల పైన ఫిర్యాదుల కోసం ప్రభుత్వం కొత్తగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే రెండు నెంబర్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నా..పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వస్తుండటంతో మరో కాల్ సెంటర్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ఈ కాల్ సెంటర్ పని చేయనుంది.
ఇప్పటికే అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వద్ద 1064 టోల్ఫ్రీ కాల్సెంటర్ ఉంది. కొన్నేళ్లు గా ఇది పనిచేస్తోంది. దీనికి అదనంగా 1100 కాల్సెంటర్కూ అవినీతిపై ఫిర్యాదులు వస్తున్నాయి. వీటికి అదనంగా..తాజాగా జగన్ ప్రభుత్వం మరో కాల్సెంటర్ను ఏర్పాటు చేయనుంది.
టోల్ ఫ్రీ నెంబర్ 10044 కు ఫిర్యాదు చేస్తే..
ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నూతన కాల్ సెంటర్ కు కొత్తగా 10044 అనే టోల్ఫ్రీ నంబర్ను కేటాయించారు. సీఎం జగన్ తాడేపల్లిలోని తన నివాసం నుం చి దీన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, పౌరసేవల్లో అవినీతిని నిరోధించాలని ముఖ్యమంత్రి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసారు. ఏసీబీ ఇప్పటి వరకు 1064 అనే టోల్ఫ్రీ నంబరుతోపాటు 8333995858 అనే నంబరుకు వాట్సప్ ద్వారానూ ఫిర్యాదులు స్వీకరిస్తోంది. టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 1100 కాల్సెంటర్కూ అవినీతిపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో..అవినీతి పైన యుద్దం పేరుతో ప్రభుత్వం ఈ కాల్ సెంటర్ అందుబాటులోకి తెస్తోంది.
రుజువు అయితే ఇక ఇంటికే..
ముఖ్యమంత్రి జగన్ అవినీతిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని అనేక సందర్భాల్లో స్పష్టంగా చెబుతున్నారు. జిల్లా కలెక్టర్లు..ఎస్పీలు సైతం దీని మీద ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. అవినీతిపై యుద్ధం అంటున్న జగన్ ప్రభుత్వం కొత్తగా 10044 అనే టోల్ఫ్రీ నంబర్ను తీసుకొస్తోంది.
ఈ కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను స్వయంగా ఇంటలిజెన్స్, ఐఏస్, ఏసీబీ అధికారి పర్యవేక్షణలో స్వీకరించటంతో పాటుగా వాటి మీద చర్యల దిశగా యంత్రాంగం పని చేస్తుంది. ఇక నుండి అవినీతిపై ఫిర్యాదులు రుజువు ఐతే ఇక ఇంటికే పంపుతామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. దీని పైన ముఖ్యమంత్రి కీలక ప్రకటన దిశగా కార్యాచరణ సిద్దమవుతోంది.