వందలాది మంది ఏపీ విద్యార్థులకు కరోనా పరీక్షలు..గందరగోళం: జగన్కు కేసీఆర్ ఫోన్..కేటీఆర్ ట్వీట్
హైదరాబాద్: తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లోని గరకిపాడు చెక్పోస్ట్ వద్ద ఏర్పడిన తలెత్తిన వివాదానికి తెరపడింది. తమ స్వస్థలాలకు చేరుకోవడానికి హైదరాబాద్లో నివసిస్తోన్న వేలాదిమంది విద్యార్థులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు జగన్ సర్కార్ అనుమతి ఇచ్చింది. వారికి సమగ్రంగా వైద్య పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు. వారందర్నీ వేర్వేరు క్వారంటైన్లకు తరలించారు. వారికి వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నారు.
హాస్టళ్లను మూసివేయడంతో..
కరోనా వ్యాప్తి చెందడాన్ని నివారించడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్లోని కొన్ని ప్రైవేటు వసతి గృహాలను మూసివేశారు. దీనితో వాటిల్లో నివసించే విద్యార్థులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఎదుర్కొంది. స్వస్థలాలకు వెళ్లడానికి తమకు అనుమతి ఇవ్వాలంటూ వారు పోలీసులను ఆశ్రయించారు. కూకట్పల్లి పోలీస్స్టేషన్ వద్ద బారులు తీరి నిల్చున్నారు. పోలీసుల నుంచి అనుమతిని తీసుకుని కార్లు, బైక్ల మీద ఏపీకి బయలుదేరిన విద్యార్థులను గరికపాడు చెక్పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
చెక్పోస్ట్ వద్ద అడ్డుకున్న పోలీసులు..
తమ రాష్ట్రంలోకి రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఫలితంగా- రాత్రి అర్ధరాత్రి వరకు విద్యార్థులు చెక్పోస్ట్ వద్దే పడిగాపులు పడ్డారు. సుమారు రెండువేల మందికి పైగా విద్యార్థులు, కొందరు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఒకేచోట చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకూ ఇవే పరిస్థితులు కొనసాగాయి. తెలంగాణ పోలీసులు మంజూరు చేసిన అనుమతులు ఉన్నాయని, తమను ఇళ్లకు పంపించాలని వారంతా పట్టుబట్టారు.
కేటీఆర్ ట్వీట్..
ఈ విషయం తెలిసిన వెంటనే రెండు రాష్ట్రాల అధికారులు అప్రమత్తం అయ్యారు. లాక్డౌన్ ప్రకటించిన వేళ.. వందలాది మంది విద్యార్థులు ఒకే చోట గుమికూడటం వల్ల కరోనా వైరస్ ముప్పు మరింత పెచ్చరిల్లుతుందని అనుమానించారు. ఈ విషయం తెలిసిన వెంటనే తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మాట్లాడరని వెల్లడించారు. సమస్య వెంటనే పరిష్కారమౌతుందని చెప్పారు.
వేర్వేరు క్వారంటైన్లకు విద్యార్థులు..
ఈ సమస్యను పరిష్కరించే బాధ్యతను వైఎస్ జగన్.. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి అప్పగించారు. వైద్య పరీక్షలను నిర్వహించిన తరువాతే వారిని ఇళ్లకు పంపించాలని ఆదేశించారు. దీనితో సామినేని ఉదయభాను రంగంలోకి దిగారు. కృష్ణా, గుంటూరు జిల్లాలవారిని నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్లకు తరలించారు. తూర్పుగోదావరి జిల్లావారిని రాజమండ్రి క్వారంటైన్కు పంపించారు. పశ్చిమగోదావరి జిల్లావారిని తాడేపల్లిగూడం, పాలకొల్లు, భీమవరం క్వారంటైన్ కేంద్రాలకు పంపించారు.
Recommended Video
సమస్యలు ఉంటే 1902కు కాల్ చేయ్యండి
అలాగే హైదరాబాద్లో ఉంటున్న ఏపీ విద్యార్థులు, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న వారు ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సమయంలో బయటకు రావొద్దని వారిని కోరింది. ఏపీలోని తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కడి వారు ఆక్కడే ఉండాలని పేర్కొంది. అదేవిధంగా ఏమైనా సమస్యలు ఉంటే 1902కు కాల్ చేయమని ప్రభుత్వం కోరింది.