ఎక్కువ అద్దె అయితే తరలింపే..! రాజధాని పరిధిలో కార్యాలయాల పై కీలక నిర్ణయం: అమలు దిశగా..!
ఏపీ రాజధాని అమరావతిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల విషయంలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి రాజధానిగా కొనసాగింపు పైన ఇంకా క్లారిటీ రాకుండానే..ఇప్పుడు రాజధాని పరిధి లో ఉన్న ప్రభుత్వ కార్యాలయపైన ఫోకస్ పెట్టింది. రాజధాని పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల అద్దె ఒప్పందాలను సమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. మార్కెట్ ధరల కంటే ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దెలపై సమీక్ష చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. అయితే, ఈ సమీక్ష తరువాత ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం కంటే ఎక్కువగా అద్దె చెల్లిస్తున్న ప్రభుత్వ కార్యాలయాలను అక్కడి నుండి తరలించి ..అద్దె తక్కువ ఉన్న చోటకు తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో..ఇప్పుడు ఈ తాజా ఉత్తర్వులు ప్రభుత్వ ఉద్యోగుల్లో కొత్త చర్చకు కారణమవుతున్నాయి.
ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత: ముట్టడించిన సీమ విద్యార్ధి సంఘాలు: రాజధాని..హైకోర్టు డిమాండ్ తో..!
కార్యాలయాల అద్దెపై సమీక్ష
అమరావతి పరిధిలో ప్రైవేటు భవనాల్లో అద్దెకు ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 2016 మార్చి 1 తేదీ నుంచి అద్దె ప్రాతిపదికన తీసుకున్న ప్రైవేటు భవనాల వివరాలు సేకరిస్తున్న సాధారణ పరిపాలనా శాఖ ...ఒక్కో కార్యాలయం వారీగా సమాచారం సేకరిస్తోంది. 2016 లో చదరపు అడుగు కార్యాలయ స్థలం అద్దెను 20 రూపాయలుగా నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ అయినా.. అవి అనేక కార్యాలయాల్లో అమలు కావటం లేదనే వాదన ఉంది. ప్రత్యేకమైన కేసులోనే చదరపు అడుగు అద్దె 30 రూపాయలుగా చెల్లించే అవకాశముందని స్పష్టం చేసిన ప్రభుత్వం ...అంత వరకు మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది.
తగిన చర్యలకు ఆదేశం..
సీఆర్డీఏ పరిధిలో ఉన్న ప్రభుత్వ శాఖల హెచ్ఓడీ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ విభాగాల ముఖ్య కార్యాలయాలు నిర్దేశిత రుసుము కంటే ప్రస్తుతం ఎక్కువ అద్దె చెల్లిస్తున్నారని జీవోలో పేర్కన్న ప్రభుత్వం ...కొన్ని మార్గదర్శకాలను స్పష్టం చేసింది. మార్కెట్ ధరల కంటే ఎక్కువ అద్దె వసూలు చేస్తున్న భవనాల విషయంలో తగిన చర్య తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ శాఖలు, హెచ్ఓడీలకు ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. ఆర్ధిక శాఖ..రహదారులు భవనాల శాఖ నిర్దేశించిన మొత్తం కంటే ఎక్కువ అద్దె చెల్లింపులు లేకుండా చూడాలని స్పష్టం చేసిన ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దెల వివరాల పైన పూర్తి వివరాలు సేకరించిన తరువాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. తక్షణం ఈ ఉత్తర్వులు అమలు చేయాల్సిందిగా విజయవాడ, గుంటూరు పరిధిలో అద్దె భవనాల్లో కార్యాలయాలను నిర్వహిస్తున్న విభాగాధిపతులు, ప్రభుత్వ శాఖలు, పీఎస్ యూలను ప్రభుత్వం ఆదేశించింది.
అసలు లక్ష్యం ఏంటి...
ప్రభుత్వ ఆకస్మికంగా ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాల అద్దెను సమీక్షించటం వెనుక ఉన్న కారణం ఏంటనే విషయం అంతుబట్టటం లేదు. అద్దె ఎక్కువగా ఉన్న భవనాల విషయంలో తొలుత అద్దె తగ్గించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. అయితే, ప్రభుత్వం నిర్ధేశించిన అద్దె కంటే మరీ ఎక్కువగా ఉండే కార్యాలయాల విషయంలో మాత్రం కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. అయితే,అద్దె పేరుతో భవనాలను మార్చాల్సి వస్తే..వీటిని ఎక్కడకు తరలించే అవకాశం ఉందనే అవకాశం పైన చర్చ మొదలైంది. విజయవాడ..గుంటూరు తో పాటుగా పరిసర ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాల పైన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎటువంటి సంచలనాలకు కారణం అవుతుందో చూడాలి.