జగన్ ఎక్కడా తగ్గట్లేదు :రీ టెండరింగ్ తోనే పోలవరం : ఆగ్రహించిన కేంద్ర మంత్రికే ఆహ్వానం..!!
ఎన్ని విమర్శలు వచ్చినా ముఖ్యమంత్రి జగన వెనక్కు తగ్గటం లేదు. ప్రతిపక్షాలు ఒక్కటిగా నినదిస్తున్నా..ఆరోపిస్తన్నా...వ్యతిరేకత వస్తందనే ఆందోళన వ్యక్తం అవుతున్నా లెక్క చేయటం లేదు. కేంద్ర మంత్రిని సైతం ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నేరుగా ఎవరైతే ఏపీ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారో కేంద్ర జలశక్తి మంత్రిని పోలవరం పర్యటనకు సీఎం జగన్ ఆహ్వానించారు. అదే సమయంలో రివర్స్ టెండరింగ్ ద్వారానే పోలవరం రికార్డు సమయంలో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక, తాజాగా పోలవరం హెడ్ వర్క్స్ పనుల మీద తాజాగా విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో వైపు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రితో జగన్ సమావేశమయ్యారు. 2022 నాటికి పోలవరం పూర్తి చేస్తామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
వెనుకడుగు వేయని జగన్..
ముఖ్యమంత్రి జగన్ తాను నిర్ణయించుకున్న మార్గంలోనే ముందుకు వెళ్తున్నారు. ఎన్ని అభ్యంతాలు వచ్చినా వెనక్కు తగ్గటం లేదు. విమర్శలకు సమాధానం ఇవ్వటం లేదు. తాను ముందు నుండి నిర్ణయం తీసుకున్న విధంగానే..పోలవరం నుండి నవయుగను తప్పించారు. హైడల్ పవర్ ప్రాజెక్టు అంశంపైన నవయుగ కోర్టుకు వెళ్లగా..హైడల్ ప్రాజెక్టు వరకు నవయుగకు రిలీఫ్ వచ్చింది. అయినా..అది ఎదురు దెబ్బగా ప్రచారం సాగినా..జగన్ హెడ్ వర్క్స్ విషయంలో మాత్రం రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలని నిర్ణయించింది. బీజేపీ నేతలు ప్రభుత్వానికి పోటీగా పోలవరం సైట్ లో అధికారులతో సమీక్ష చేసారు. పునారావాస బాధితుల సమస్యల పై చర్చించామని చెబుతున్నారు. ఇదే సమయంలో పోలవరం కేంద్రం టేకోవర్ చేస్తుందనే ప్రచారం సైతం మొదలైంది. అయినా..జగన్ మాత్రం ఎక్కడా వెనక్కు తగ్గటం లేదు. పోలవరం లో ఎలాగైనా చంద్రబాబు ఎక్కువ ధరకు పనులు అప్పగించారు..అవినీతి జరిగిందని నిరూపించి తక్కువ ధరలకే ప్రాజెక్టు పూర్తి చేసి చూపించాలని పట్టుదలతో ఉన్నారు. అందులో భాగంగానే ఢిల్లీలో హోం మంత్రి అమిత్ షాకు నిర్ణయాల వెనుక జరిగిన వ్యవహారం.. బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలు..తన ఉద్దేశం వివరించి కేంద్రం మూడ్ తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఆగ్రహించిన కేంద్ర మంత్రికే ఆహ్వానం..
రివర్స్ టెండరింగ్ విధానం.. నవయుగకు పనులు రద్దు..పీపీఏ అభ్యంతరాలను పట్టించుకోక పోవటం పైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పోలవరం పనులు నిలిపి వేయటం.. పీపీఏ అబ్యంతరాలను పట్టించుకోకపోవటం.. నవయుగను తప్పించటం.. రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయటం పైన ఆయన ఏపీ ప్రభుత్వం మీద ఫైర్ అయ్యారు. తాము నివేదిక కోరామని అది వచ్చిన తరువాత అవసరమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి పోలవరం క్షేత్ర పర్యటనకు రావాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను ఏపీ సీఎం ఆహ్వానించారు. కేంద్ర మంత్రితో ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేవమయ్యారు. షెకావత్ ఏపీలో పర్యటిస్తారని... పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారని మంత్రి తెలిపారు. మంత్రిని కలిసిన తరువాత ఢిల్లీ కేంద్రంగా పెద్దిరెడ్డి రీ టెండరింగ్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు పనులను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
పోలవరం హెడ్ వర్క్స్ పై విజిలెన్స్ విచారణ..
ఇప్పటికే నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా రివర్స్ టెండరింగ్ కు వెళుతున్న ప్రభుత్వం..తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒక వైపు విద్యుత్ ప్రాజెక్టు ఒప్పందం రద్దు పైన నవయుగ కోర్టుకు వెళ్లినా..కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ప్రభుత్వం మాత్రం తమ ఆలోచనకు అనుగుణంగా ముందుకు వెళ్తోంది. తాజాగా.. పోలవరం పనుల్లో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు విజిలెన్స్ దర్యాప్తు కు ప్రభుత్వం ఆదేశించింది. హెడ్ వర్క్స్ పనులకు సంబంధించి ఇప్పటివరకు జరిగిన లావాదేవీల సమాచారం ఇవ్వాలని పోలవరం ఎస్ ఈ కు రాజమహేంద్రవరం ప్రాంతీయ విజిలెన్స్ అధికారి లేఖ రాసారు. దీని ద్వారా కాంట్రాక్టర్ల మీద మరింత ఒత్తిడి చేసే వ్యూహం కొనసాగిస్తోంది. ఇదే సమయంలో ఢిల్లీలో ముఖ్యమంత్రి జగన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. అన్ని పరిస్థితులను షాకు వివరించారు. ఆయన నుండి వచ్చే స్పందనతో ముఖ్యమంత్రి జగన్ భవిష్యత్ నిర్ణయాలు తీసుకోనున్నారు.