మూడు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ: 20వ తేదీన ప్రారంభం: రాజధాని తరలింపు తీర్మానం..!
ఏపీ ప్రభుత్వం రాజధానుల వ్యవహారానికి అధికారికంగా ఆమోద ముద్ర వేసేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా..ఇప్పటికే జీఎన్ రావు..బోస్టన్ కమిటీల అధ్యయనం కోసం నియమించిన హై పవర్ కమిటీ మూడు సార్లు భేటీ అయింది. ఈ నెల17న తుది సమావేశం కానుంది. ఇక, ఇదే సమయంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించి మూడు రాజధానులు..అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు పైన తీర్మానం చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు.
అందు కోసం ఈ నెల 20,21,22 తేదీల్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. రెండు రోజు ల పాటు అసెంబ్లీ..చివరి రోజు మండలిలో తీర్మానం ఆమోదించనున్నారు. అదే సమయంలో మరో మూడు కీలక బిల్లులకు ఆమోదం తెలపనున్నారు.
మూడు రోజుల పాటు అసెంబ్లీ..
ఈ నెల 20వ తేదీ నుండి ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు సాగనున్నాయి. తొలుత అసెంబ్లీ..మండలి కలిపి ఉమ్మడి సమావే శం నిర్వహించి..మూడు రాజధానులు..అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు తీర్మానం ఆమోదించాలని ప్రభుత్వం భావించింది.
ఆ విధంగా చేస్తే..ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందనే అభిప్రా యం వచ్చే అవకాశం ఉండటంతో వ్యూహం మార్చింది. అందు కోసం తొలి రెండు రోజుల పాటు అసెంబ్లీలో దీని పైన సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి సమాధానం ఇచ్చి..తీర్మానం ఆమోదం పొందే విధంగా ప్రభుత్వం సభలో వ్యవహరించే అవకాశం ఉంది. ఇక, 23న ఇదే విధానాన్ని మండలిలో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
మూడు బిల్లులకు ఆమోదం..
రాజధాని వ్యవహారం తో పాటుగా మరో మూడు ముఖ్యమైన బిల్లులకు ఈ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. గత శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోనే కీలకమైన ఇంగ్లీషు మీడియం బిల్లు అదే విధంగా ఎస్సీ వర్గీకరణ బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపారు. అయితే, అక్కడ ఆ రెండు బిల్లలకు సవరణలు ప్రతిపాదించారు. దీంతో..తిరిగి ఇప్పుడు శాసనసభలో ఆమోదిస్తేనే అవి బిల్లుగా మారి అమల్లోకి వస్తాయి. ఈ మూడు రోజుల సమావేశాల్లోనే ఆ బిల్లులు సైతం ప్రవేశ పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఇక, ప్రస్తుతం అమరావతిలో అమల్లో ఉన్న సీఆర్డీఏ చట్టానికి సంబంధించిన బిల్లును సైతం ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ నెల 20న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ప్రారంభం అవుతుందని..ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశం పైన 20న జరిగే బీఏసీ సమావేశంలో తుద నిర్ణయం తీసుకుంటారంటూ ఎమ్మెల్యేలకు సందేశాలు పంపినట్లు తెలుస్తోంది.