కీలక నిర్ణయాల దిశగా జగన్..!! సీమ..ఉత్తరాంధ్రకు ప్రాధన్యత : ఆ ప్రాంతాల్లోనే కీలక సంస్థల ఏర్పాటు..!!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. రాజధాని రగడ మీద స్పష్టత ఇవ్వాలని భావిస్తోంది. ఇదే సమయంలో అధికార వికేంద్రీకరణ దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందు కోసం అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ గా అమరావతి ప్రాంతాన్ని ఉంచుతూ.. ప్రముఖ సంస్థలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వంలో కీలక చర్చ జరుగుతున్నట్లుగా విశ్వస నీయ సమాచారం. తాజాగా మంత్రులు బుగ్గన..బొత్సా చేసిన వ్యాఖ్యల్లో సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసారు. దీంతో..ఇప్పుడు పాలనా వికేంద్రీకరణ చేయాలని ముఖ్యమంత్రి పట్టుదలతో ఉన్నారు. హైదరాబాద్ కేంద్రంగా డెవలప్ మెంట్ జరిగి ఉండటంతోనే ఇతర ప్రాంతాల్లో వెనుకబాటు తనం కనిపిస్తోందని తాజాగా మంత్రులతో జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో..రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ సంస్థలను వికేంద్రీకరించాలని నిర్ణయించారు. ఇందు కోసం ఎక్కడ ఏది ఏర్పాటు చేయాలనే దాని పైన కసరత్తు చేస్తున్నారు.
రాజధాని నుండి పరిపాలనా వ్యవహారాలు..
రాజధాని ప్రాంతంలో పాలనా పరమైన వ్యవహారాలకే పరిమితం కావాలని..మిగిలిన రాష్ట్రం మొత్తంలో పాలనా వికేంద్రీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న అమరావతి లో రాజధాని నిర్మాణం పైన అనుమానాలు వద్దని మంత్రులు చెబుతున్నారు. అదే సమయంలో ఇక నిర్మాణాలు ముంపు ప్రాంతంలో కాకుండా.. రాజధాని ప్రాంత పరిధిలోనే మంగళగిరి సమీపంలో చేసే విధంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇక, ఇదే సమయంలో 29 గ్రామాల్లోనే గత ప్రభుత్వం నిర్మించాలని తల పెట్టిన వాటి విషయంలో అందరి అభిప్రాయంతో ముందుకు వెళ్లాలనేది ప్రభుత్వ ఆలోచనగా సమాచారం. దీని కోసం త్వరలోనే నిపుణులతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ చుట్టూ వివాదం నెలకొందని..అక్కడ మాత్రమే అందరూ డెవలప్ మెంట్ దిశగా వ్యవహరించటంతో ఆ పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం గుర్తు చేస్తోంది. శివ రామ క్రిష్ణన్ నివేదిక లో సైతం ఏపీలో ఒకే చోట అన్ని వ్యవస్థలు కేంద్రీక్రుతం కాకుండా.. అధికార వికేంద్రీకరణ చేసి.. అన్ని ప్రాంతాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలని సూచించారు. దీంతో..ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రాయలసీమ..ఉత్తరాంధ్రకు ప్రాధాన్యత..
ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురవుతున్న రాయలసీమ..ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ ప్రభుత్వ సంస్థలను విస్తరించాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. అందులో భాగంగా ఎంతో కాలంగా హై కోర్టును కర్నూలు లో ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. రాయలసీమలో హైకోర్టు..లేదా..హైకోర్టు బెంచ్ కోసం డిమాండ్ ఎంతో కాలంగా పెండింగ్ లో పెట్టారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కర్నూలు లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ చేయలేదు. ఇక, ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కర్నూలులో హైకోర్టు లేదా బెంచ్ కర్నూలు తో పాటుగా విశాఖలో ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. దీంతో పాటుగా ఏపీ ఆర్దిక రాజధానిగా ఉన్న విశాఖను పూర్తిగా ఐటి హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఐటీ పరిశ్రమను పూర్తగా అక్కడే ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో వెనుకబాటు తనం తగ్గించటానికి దొనకొండ లో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు నిర్ణయించారు. దేవాదాయ విభాగాలకు చెందిన అన్ని శాఖలు..అనుబంధ కార్యాలయాలను తరుపతికి తరలించి టెంపుల్ సిటీగా మార్చాలని ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. అధికార వికేంద్రీకరణ దిశగా బీజేపీ సైతం డిమాండ్ చేస్తూ వస్తోంది. రాయలసీమ లో సంస్థలు ఏర్పాటు చేయాలని కోరుతోంది. దీంతో..తాజా నిర్ణయాల ద్వారా బీజేపీ తమ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని ప్రాంతాల డెవలప్ మెంట్ ఈ నిర్ణయాల దిశగా సాగనుంది.
త్వరలో కార్యాచరణ ప్రకటన...
ప్రస్తుతం అమరావతి గురించి రచ్చ సాగుతున్న సమయంలోనే ఇప్పుడు రాయలసీమ నుండి తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ మొదలైంది. దీంతో..అన్ని ప్రాంతాల వారిలోనూ నిర్లక్ష్యం చేస్తారనే భావన రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక, రాజధాని ప్రాంతంలో ముంపు ప్రాంతాలను తప్పించి..మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో మంగళగిరి జాతీయ రహదారి సమీపంలో కొత్త నిర్మాణాల పైన ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు విశ్వస నీయ సమాచారం. ఇదే సమయంలో శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం విజన్ డాక్యెమెంట్ ను విడుదల చేసింది. కానీ ,అమలు చేయలేదు. ఇప్పుడు ప్రాంతీయ డెవలప్ మెంట్ బోర్డుల ద్వారా నియామకాలను ప్రకటించి..వాటి ఆధ్వర్యంలో డెవలప్ మెంట్ కార్యక్రమాలు కొనసాగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ మొత్తానికి మరో వారం రోజుల్లోగా స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.