12 వేల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ : ఏపీలో మెగా డీఎస్సీ: ముహూర్తం ఖరారు..!
ఏపీలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డీఎస్సీ నియామక షెడ్యూల్ విడుదలకు రంగం సిద్దం అవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ప్రతీ ఏటా జనవరిలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉంటుందని చెప్పటంతో..సాధారణ ఉద్యోగాలతో పాటే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారని తొలుత భావించారు. అయితే, నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా ఖాళీ గా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో..స్థానిక సంస్థలు ముగిసిన వెంటనే ఫిబ్రవరి మూడో వారంలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం కనిపి స్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 12 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం.
ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్..
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చే విధంగా కసరత్తు జరుగుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా, మండల పరిషత్, ప్రభుత్వ, మోడల్, గురుకులాలతో పాటు మున్సిపల్ పాఠశాలల్లో కలిపి ఖాళీగా ఉన్న దాదాపు 10 వేల నుంచి 12 వేల వరకు ఉపాధ్యాయ పోస్టులను ఈ డీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. 75 నుంచి 480 మంది వరకు విద్యార్థులున్న ఉన్నత పాఠశాలను ఒక యూనిట్గా తీసుకుని ఖాళీలను నిర్ధారిస్తారు. ఉన్నత పాఠశాలల్లో మొత్తం 9 మంది టీచర్లు ఉండాలి. వీరిలో ఆరుగురు సబ్జెక్టు టీచర్లు కాగా ముగ్గురు భాషా పండిట్లు ఉండాలి. ఈ ప్రకారం లేని పాఠశాలల వివరాలను సేకరించనున్నారు.
త్వరలో టెట్...జనవరిలో పరీక్ష
వచ్చే జనవరి మొదటి వారంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) నోటిఫికేషన్ జారీచేసి.. నెలాఖరులో పరీక్ష నిర్వహించనున్నారు. టెట్కు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా. అలాగే డీఎస్సీ-2020కి ఐదారు లక్షల మంది దరఖాస్తు చేస్తారని పాఠశాల విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. టెట్, డీఎస్సీల నిర్వహణకు సంబంధించి త్వరలోనే ప్రభుత్వం ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే కోర్టులో పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ నియామక కేసుల పరిష్కారం పైనా ప్రభుత్వం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 10న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూ ల్ విడుదల కానుంది. ఫిబ్రవని మూడో వారానికి ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే..డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
అన్ని కేటగిరీల్లో పోస్టుల భర్తీ..
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ డీఎస్సీ ద్వారా అన్ని కేటగిరీల్లోనూ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే..రిటైర్ అయ్యే వారి వివరాలతో పాటుగా.. పదోన్నతుల ద్వారా ఏర్పడిన ఖాళీలను కూడా సేకరించి డీఎస్సీ-2020 నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం డీఎస్సీ-2018 పేరిట మొత్తం 7,902 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే దివ్యాంగుల కోసం 602 టీచర్ పోస్టులతో ప్రత్యేక డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ.. విద్యార్హతలు..ఇతర సాంకేతిక అంశాలను కారణాలుగా చూపుతూ పలువురు న్యాయస్థానాల్లో కేసులు వేశారు. ఆ కేసులపై విచారణ పెండింగ్లో ఉంది. కోర్టు కేసులు లేని 2,654 టీచర్ పోస్టుల భర్తీకి ఈ నెల 22న జిల్లాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులకు అదే రోజు నియామక పత్రాలు అందజేశారు. కోర్టు కేసుల కారణంగా ఇంకా 5,850 టీచర్ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. వాటిపై ఉన్న కేసులన్నింటినీ జనవరి నెలాఖరులోగా పరిష్కరించే దిశగా పాఠశాల విద్యాశాఖ చర్యలు తీసుకుంటోంది.