ఆ 10 వేల కోట్ల కోసం జగన్ ఎదురుచూపులు... ఆరు రోజులే గడువు..
కరోనా వైరస్ ప్రభావంతో దేశవ్యాప్తంగా అన్నిరంగాలూ కుదేలైపోతున్నాయి. ప్రభుత్వాలకు రాబడి తగ్గిపోయింది. లాక్ డౌన్ ఎంతకాలం కొనసాగించాలో తెలియదు. ఏపీ ప్రభుత్వం పరిస్ధితి కూడా ఇంతకంటే భిన్నంగా ఏమీ లేదు. అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే రెవెన్యూ లోటు అదనంగా ఉండటంతో ప్రభుత్వానికి ఊపిరాడని పరిస్దితి. దీంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం వివిధ మార్గాల్లో రుణాల కోసం అన్వేషణ సాగిస్తోంది.
ఆర్ధిక సంక్షోభం ముంగిట...
విభజన తర్వాత అప్పులను, రెవెన్యూ లోటును వారసత్వంగా తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ గత ఐదేళ్లలో దాన్ని మరింత పెంచుకోవడం మినహా చేసిందేమీ లేదు. గతేడాది వైసీపీ అధికారం లోకి వచ్చిన అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, మద్యనిషేధం వల్ల కోల్పోయిన ఆదాయం దీనికి అదనం. వీటికి తోడు తాజాగా కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలు మూతపడటంతో మూలిగే నక్కపై తాటి పండు పడినట్లయింది.
కేంద్రం విధించిన అప్పుల పరిమితి....
ఎంత ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వాలు మార్గదర్శకాలు పాటించాల్సిందే. ఈ లెక్కన కేంద్ర ప్రభుత్వం విధించిన పరిమితుల మేరకు ఈ ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంగా గరిష్టంగా 15 వేల కోట్ల రుణాలు మాత్రమే తెచ్చుకునే వీలుంది. అయితే ప్రస్తుతం ఉన్న సంక్షోభ పరిస్ధితుల్లో వెంటనే ఈ మొత్తం రుణాలను తెచ్చుకోవడం మినహా ఏపీకి మరో గత్యంతరం లేదు. దీంతో నెల రోజులుగా రుణాల కోసం అధికారుల వేట కొనసాగుతోంది.
Recommended Video
ఆ 10 వేల కోట్ల మీదే ఆశలు...
కేంద్రం విధించిన పరిమితులకు లోబడి ప్రస్తుతానికి 10 వేల కోట్ల రుణాలు తెచ్చుకునేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్ధలవైపే చూడాల్సిన పరిస్దితి. దీంతో ఆ పది వేల కోట్లు ఎప్పుడొస్తాయా అని నేరుగా సీఎం జగనే అధికారులను తరచూ వాకబు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిపై ఏదో ఒకటి తేలితే ఉద్యోగుల జీతాలు, పింఛన్ల విషయంలోనూ ప్రభుత్వ నిర్ణయం ప్రకటించవచ్చని జగన్ ఎదురుచూస్తున్నారు. ఈ నెల ముగియడానికి మరో ఆరు రోజుల గడువు ఉంది. ఈ లోపు రుణాలపై క్లారిటీ వస్తే ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, పింఛన్లతో పాటు మరికొన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు మెరుగుపడతాయి.