ఈ నెల మూడోవారంలో ఏపీ అసెంబ్లీ ! - బడ్జెట్ తో పాటు కీలక బిల్లుల కోసం- మండలిపై ఉత్కంఠ....
కరోనా వైరస్ కారణంగా వాయిదాపడిన ఏపీ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల మూడో వారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కేబినెట్ లో గతంలో ఆమోదించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాల పరిమితి తీరిపోనుండటంతో పాటు పలు కీలక బిల్లులు పెండింగ్ లో ఉన్నందున ఈ నెలలో అసెంబ్లీ నిర్వహణకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే తుది నిర్ణయం తీసుకున్నాక షెడ్యూల్ విడుదల కానుంది.
ఏపీ నో: అంతరాష్ట్ర రాకపోకలకు నో పర్మిట్, తప్పదంటే మాత్రం.. : డీజీపీ గౌతమ్ సవాంగ్
ఈ నెలలో ఏపీ బడ్జెట్ సమావేశాలు.. ?
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బడ్జెట్ ఆమోదం వాయిదా పడటంతో ఏపీ సర్కార్ కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను మూడు నెలలకు ఆమోదింపజేసుకుంది. దాని గడువు ఈ నెలాఖరుతో ముగిసిపోనున్న నేపథ్యంలో తిరిగి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ లేదా ఆర్డినెన్స్ గడువు పొడిగింపు చేపట్టక తప్పని పరిస్దితి. దీంతో ఈ నెలాఖరులోపు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం సమాలోచనలు జరుపుతోంది. అన్నీ కుదిరితే ఈ నెల మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు ఉండొచ్చని చెప్తున్నారు.
ఓటాన్ తో పాటు కీలక బిల్లులు...
ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరిగితే అందులో ఓటాన్ అకౌంట్ లేదా పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ మీడియంతో పాటు పలు కీలక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో రాజధానితో పాటు పలు కీలక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ఈ బిల్లులపై ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్దితి ప్రభుత్వానిది. కాబట్టి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గుచూపుతోంది.
మండలిపై ఉత్కంఠ....
రాజధాని బిల్లులు ఆమోదించకుండా, తిరస్కరించకుండా ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టిన శాసనమండలి ఎట్టి పరిస్ధితుల్లోనూ సమావేశం కాకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఈసారి అసెంబ్లీ సమావేశమైనా మండలి పరిస్ధితి ఏంటన్నది ఇంకా స్పష్టత రావడం లేదు. వాస్తవానికి అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్ లోనే అసెంబ్లీతో పాటు మండలి కూడా సమావేశమవుతున్న్టట్లు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. దీన్ని బ్రేక్ చేసి వైసీపీ ప్రభుత్వం కేవలం అసెంబ్లీకి మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.
సెలక్ట్ కమిటీపై కోర్టు కేసులు ..
అటు శాసనమండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీకి పంపిన రాజధాని బిల్లులపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. వీటిపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో మండలి సమావేశం కావడం, ఈ బిల్లులపై మరోసారి చర్చించడం సాధ్యమవుతుందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్దితి. అసలు మండలి సమావేశమైతే విపక్ష టీడీపీ వీటిపై ఎలాగో చర్చకు పట్టుబట్టే అవకాశముంది. అంతవరకూ ప్రభుత్వం అవకాశమిస్తుందా లేదా అన్నది చూడాల్సి ఉంది.