ఇళ్లపట్టాల పంపిణీ వాయిదా వెనుక: అసలు కారణం అదేనా: సీఎం జగన్ ఏం చెబుతున్నారు...!
అమరావతి: ఏపీలో ఈ ఉగాది నాడు రికార్డు స్థాయిలో ఒకేసారి 26.6 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణి చేపట్టాలని భావించిన ప్రభుత్వం ఈ రోజు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా వేయడం వెనక ప్రభుత్వ వ్యూహం ఏమిటి..? ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చింది..?
వ్యూహాత్మకంగానే వాయిదా
స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహణకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వకపోవటం పైన స్వయంగా ముఖ్యమంత్రితో సహా మంత్రులంతా తప్పు బట్టారు. ఇది ముందుగానే నిర్ణయించిన కార్యక్రమమని..దీనికి ఎలా అడ్డు చెబుతార ని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ కు పేదలకు మేలు చేయటం కూడా ఇష్టం లేదని విమర్శించారు. ఇక, ఎన్నికలు వాయిదా పడటం.. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్నికల సంఘం ఇళ్ల పట్టాల పంపిణీకి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇంతలో ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 25న చేపట్టాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి నాడు నిర్వహించాలని నిర్ణయించారు. కలెక్టర్లు..ఎస్పీలతో జరిగిన వీడియో కాన్ఫిరెన్స్ లో ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే, దీని వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటనేది చర్చ జరుగుతోంది
ఉగాది నుండి అంబేద్కర్ జయంతి నాటికి వాయిదా..
ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని అయిదు నెలల క్రితమే ముఖ్యమంత్రి జగన్ నిర్ధేశించారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ స్థలాలు లేని ప్రాంతాల్లో ప్రైవేటు స్థలాల సమీకరణ సైతం చోటు చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నా.. ఇది ముందుగానే నిర్ణయించిన పథకం కావటంతో కోడ్ ఇబ్బంది కాదని అధికార పార్టీ నేతలు భావించారు. అయితే, ఎన్నికలు వాయిదా సమయంలో కోడ్ మాత్రం అమల్లో ఉంటుందని చెప్పటంతో ఈ కార్యక్రమం వాయిదా పడుతుందని భావించారు. సుప్రీం సూచనలతో ఎన్నికల సంఘం ఈ కార్య క్రమం నిర్వహణకు అనుమతిచ్చింది. అయితే, ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయం మార్చుకుంది. కరోనా కారణంగా...ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ నిర్వహణ సరికాదని..ఈ కార్యక్రమాన్ని అంబేద్కర్ జయంతి నాడు ఏప్రిల్ 14న నిర్వహించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు.
ఎన్నికలు వాయిదా పడటమే కారణమా...
స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తే..రాజకీయంగా లబ్ది కలుగుతుందని వైసీపీ అంచనా వేసింది. దీంట్లో భాగంగానే.. పొలిటికల్ మైలేజ్ కోసం ఎన్నికల వాయిదా నిర్ణయం పైన మాట్లాడే సమయంలోనే చంద్రబాబు కు మేలు చేసేందుకు ఎన్నికల కమిషనర్ పని చేస్తున్నారని చెబుతూనే..పేదలకు మంచి చేయటం కూడా ఇష్టం లేదని వ్యాఖ్యానించినట్లుగా విశ్లేషణలు వినిపించాయి. అయితే, ఇప్పుడు కరోనా కారణంగా కార్యక్రమాలు..సభలు ఏర్పాటు చేయటం రిస్క్ కారణంగానే కార్యక్రమం వాయిదా వేసుకున్నామని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఏప్రిల్ చివరిలో ఎన్నికల నోటిఫికేషన్..?
ఎన్నికలు ఏప్రిల్ లో కూడా జరిగే అవకాశం లేదని..అప్పుడు మాత్రం పట్టాల పంపిణీ నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు. కానీ, వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎన్నికల కమిషనర్ అధికారాలకు కత్తెర వేసేలా ప్రభుత్వ వ్యూహాలు సిద్దం చేస్తోంది. అదే జరిగితే ఏప్రిల్ చివర్లో ఎన్నికల నోటిఫికేషన్ కు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో..ఏప్రిల్ 14న ఈ కార్యక్రమం నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంత పెద్ద కార్యక్రమం ద్వారా రాజకీయంగానూ ప్రయోజనం పొందాలని అధికార పార్టీ ఆశిస్తోంది.