ఏపీ బడ్జెట్ రూ. 2.34 లక్షల కోట్లు..! కేంద్రం నుడి 95 వేల కోట్ల అంచనా: వ్యవసాయానికి ఎంతంటే..!
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తొలి సారి పూర్తి స్థాయి బడ్జెట్ సిద్దమైంది. ఉదయం 8 గంటలకు ఏపీ కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై బడ్జెట్ను ఆమోదిస్తుంది. అనంతరం బడ్జెట్ ప్రతిని పత్యేక ప్రతినిధి ద్వారా రాష్ట్ర గవర్నర్ వద్దకు పంపుతారు. ఉదయం 11 గంటలకు శాసనసభలో ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బడ్జెట్ ను ప్రవేవ పెట్టనున్నారు. ఈ సారి బడ్జెట్లో ఎన్నికల వేళ జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా పెద్ద ఎత్తున సంక్షే మం..నవరత్నాలకు ప్రాధాన్యత ఇస్తూ దాదాపు రూ.2.34 లక్షల కోట్లతో ప్రతిపాదించే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
భారీ ప్రతిపాదనలతో తొలి బడ్జెట్..
ఏపీలో జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్ భారీ అంచనాలతో ప్రజల ముందుకు వస్తోంది. ఈ బడ్జెట్ మొత్తంగా 2.34 లక్షల కోట్లు వరకు ఉండే అవకాశం కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఆర్దిక రంగం మీద శ్వేత పత్రం విడుదల చేసింది. దీనిని ఆధారంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటనేది స్పష్టంగా తెలుస్తోంది. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని పూర్తిగా దివాళా తీయించిందని ప్రభుత్వం చెబుతోంది. నిధులు లేని ఖజానా తమకు అప్పగించినా తమ ప్రాధాన్యతల విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వేయమని స్పష్టం చేసే దిశగా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. ఇందులో భాగంగా..సంక్షేమం..నవ రత్నాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఇందులో ప్రధానంగా బీసీ..సాంఘిక సంక్షేమ రంగానికి కేటాయింపులు భారీగా ఉండే అవకాశం ఉంది. సామాజిక వర్గాల వారీగా కార్పోరేషన్లకు సైతం ఇచ్చిన హామీల మేరకు అంచనాలు ఉంటాచని తెలుస్తోంది.
కేంద్రం నుండి అంచనాలివే..
ఏపీలో భారీగా రెవిన్యూ లోటు ఉన్నా..కేంద్రం నుండి హామీలు అమలు కావటం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో కేంద్రం విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన రెవిన్యూ లోటును పూర్తిగా భర్తీ చేయాలని ఏపీ ప్రభు త్వం అనేక సార్లు కోరింది. అయినా..తాజా కేంద్ర బడ్జెట్లో ఏపికి సంబంధించి ప్రత్యేకంగా ఎటువంటి కేటాయింపు లు లేవు. సాధారణం ఇతర ప్రాంతాలకు వచ్చే విధంగానే ఏపీకీ కేంద్ర పన్నుల వాటా..గ్రాంట్లు రానున్నాయి. ఇక, తాజా బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం సొంతఆదాయం రూ.85 వేల కోట్ల నుంచి రూ.86 వేల కోట్ల వరకు ఉంటుందని బడ్జెట్లో అంచనాకు వచ్చినట్లు సమాచారం. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.60 వేల కోట్లకుపైగా వస్తాయని భావిస్తున్నా రు. కేంద్ర పన్నుల వాటా రూపంలో రూ.34 వేల నుంచి రూ.36 వేల కోట్ల దాకా రాష్ట్రానికి వస్తాయని అంచనా వేస్తూ ఈ మేరకు ఆదాయంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్..28 వేల కోట్ల పైమాటే..
సాధారణ బడ్జెట్ పూర్తయిన తరువాత అసెంబ్లీలో మంత్రి బొత్సా సత్యనారాయణ ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. వ్యవసాయం..అనుబంధ రంగాలతో కలిసి కేటాయింపులు మొత్తం రూ.28 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వ్యవసాయానికి 12 వేల కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. అదే విధంగా అనుబంధ రంగాలైన పశు సంవర్దక శాఖ కు 1200 కోట్లు, మార్కెటింగ్ శాఖకు 3 వేల కోట్లు, విద్యుత్ సబ్సిడీకి 5 వేల కోట్లకు పైగా కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తన సోదరుడి మృతి కారణంగా హాజరు కావటం లేదు. ఆయన స్థానంలో సీనియర్ మంత్రి బొత్సా శాసనసభలో..మరో మంత్రి మోపిదేవి శాసన మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.