జగన్ ప్రభుత్వం తొలి బడ్జెట్.. రెండు లక్షల కోట్లకు పైనే..!సంక్షేమం,నవ రత్నాలకే ప్రాధాన్యం
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి బడ్జెట్ ప్రజల ముందుకు రానుంది. దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా అంచనాలతో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి శాసనసభలో..పిల్లి సుభాష్ చంద్రబోస్ శాసనమండలిలో బడ్జెట్ ను ప్రవేశ పెడతారు. ఈ సారి బడ్జెట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాలకు..సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే సమయంల రాష్ట్ర ఆర్దిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని కేంద్ర బడ్జెట్లో పన్నుల వాటాను పరిగణలోకి తీసుకొని ఏపీ బడ్జెట్ కు తుది రూపం ఇచ్చారు.
జగన్ పాలనకు దిక్సూచీగా..
ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత 2019-20 వార్షిక బడ్జెట్ ను శుక్రవారం సభలో ప్రవేశ పెట్టను న్నారు. ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఇప్పటికే బడ్జెట్ పాఠం మీద కసరత్తు పూర్తి చేసారు. ఉదయం 11 గంటలకు శాసనసభలో ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ప్రవేశ పెడతారు. శాసన మండలిలో అదే సమయంలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ బడ్జెట్ ప్రసంగం చేస్తారు. ఆ వెంటనే శాసనసభలో ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ ను సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ..శాసన మండలిలో మోపిదేవి వెంకట రమణ ప్రవేశ పెడతారు. ఈ బడ్జెట్ లో ప్రధానంగా నవరత్నాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దాదాపు రెండు లక్షల కోట్లకు పైగా ఉండే ఈ బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటా..రాష్ట్ర రెవిన్యూ ను స్పష్టంగా చూపించాలని నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్ర అర్దిక పరిస్థితి పైన శ్వేత పత్రం విడుదల చేసిన ప్రభుత్వం 60 వేల కోట్లకు పైగా రెవిన్యూ లోటు ఉన్నట్లు ప్రకటించింది. దీంతో..వాస్తవంగా ఉన్న ఆర్దిక పరిస్థితి ఆధారంగానే బడ్జెట్ ప్రతిపాదనలు ఉండే ఛాన్స్ కనిపిస్తోంది.
నవరత్నాలకు ప్రాధాన్యత..
బుగ్గన తన బడ్జెట్లో ప్రధానంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నవ రత్నాలకు ప్రాధాన్యత ఇవ్వ నున్నారు. ఇప్పటికే వైయస్సార్ రైతు భరోసా..పెరిగిన పెన్షన్లు..అమ్మ ఒడి..వంటి పధకాలకు అమలు తేదీలను సైతం ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లోనే వీటికి కేటాయింపులు తొలి ఏడాదికి సరిపడా చేయాల్సి ఉంది. ఇదే సమయంలో.. పెరిగిన పెన్షన్ల భారం గతం కంటే దాదాపు రెట్టింపు అయింది .దాదాపు 16 వేల కోట్లకు పైగా సామాజిక పెన్షన్ల కోసం కేటాయించాల్సి ఉంది. అదే విధంగా ఉద్యోగుల జీతాలు..పెన్షన్ల భారం దాదాపు ఆరు వేల కోట్ల వరకు చేరినట్లు తెలుస్తోంది. దీంతో పాటుగా విద్య...వైద్యం..మౌళిక వసతులు..విద్యుత్ రంగం.. వ్యవసాయం వంటి రంగాలకు భారీగా కేటాయింపులు చేయాల్సి ఉంది. ఇప్పటికే రైతులకు అనేక వరాలు ప్రకటన చేయటంతో వాటిని నిదులను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. ఇక, కేంద్రం నుండి పన్నుల వాటా కింద దాదాపు 34 వేల కోట్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దీంతో..లోటు బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి: సభ నుండి పారిపోయారు: ప్రివిలేజ్ నోటీసు ఇస్తాం: చంద్రబాబు ఫైర్..!
అమరావతి..ప్రాజెక్టుల కేటాయింపుల పైనే దృష్టి..
ఇప్పటికే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన ఆరా తీస్తున్న జగన్ ప్రభుత్వం కీలకమైన రాజధాని..పోలవరం.. సాగు నీటి ప్రాజెక్టులకు ఏ మేర నిధులు కేటాయిస్తారనేది ఆసక్తి కరంగా మారింది. రాజధానిలో జరిగిన పనుల మీద పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. తాత్కాలికంగా పనులు నిలిచిపోయాయి. అదే విధంగా పోలవరం టెండర్ల పైనా ఇప్పటికే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేసారు. అదే విధంగా ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి.. ఈ తొలి బడ్జెట్లో సాగునీటి రంగానికి కేటాయింపులు ఎలా ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది. వీటితో పాటుగా మున్సిపల్..పంచాయితీ రాజ్ శాఖల నిధుల పైనా ఆసక్తి నెలకొంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో పంచాయితీ రాజ్ శాఖకు ఎక్కువ మొత్తంలో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. ఇక, గతంలోనే ప్రకటించిన విధంగా కాపు..బ్రాహ్మణ..సాంఘిక సంక్షేమం..బీసీ సంక్షేమ రంగాలకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.