ప్రత్యేక వ్యవసాయ జోనుగా అమరావతి..! ప్రభుత్వం కసరత్తు: రైతులు అంగీకరించేనా..!
రాజధాని తరలింపు ప్రతిపాదనల పైన కసరత్తు చేస్తున్న ఏపీ ప్రభుత్వం మందు మరో ప్రతిపాదన సిద్దమైంది. అమరావతి ప్రాంతంలో ఆందోళన చేస్తున్న రైతులు రాజధాని తరలింపు ప్రతిపాదనను వ్యతరేకిస్తు న్నారు. రాజధాని కొనసాగింపు మినహా ఏ ప్రతిపాదన వారు అంగీకరించటం లేదు. అయితే, ప్రభుత్వం మాత్రం ఆ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో వివరించి..వారి ఆందోళనలకు ముగింపు పలకాలని ఆలోచన చేస్తోంది.
అందులో భాగంగా ఇప్పుడు ప్రభుత్వం వద్ద కొత్త ప్రతిపాదన సిద్దంగా ఉంది. అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక వ్యవసాయ జోన్ గా ప్రకటించే అంశం మీద కసరత్తు జరుగుతోందని విశ్వస నీయ సమాచారం. అందు కోసం రైతులకు తిరిగి ఇవ్వాల్సిన ప్లాట్లతో పాటుగా..ఇప్పటికే నిర్మాణాల జరిగిన భూముల విషయంలోనూ స్పష్టతకు వచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రతిపాదన ప్రభుత్వం ఎంపిక చేసిన వారి ద్వారా రైతుల వద్ద ప్రతిపాదించనున్నట్లు సమాచారం.
ప్రత్యేక వ్యవసాయ జోన్ గా ప్రతిపాదన..
అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక వ్యవసాయ జోన్ గా ప్రకటించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అమరావతి ప్రాంతాన్ని ప్రత్యేక అగ్రికల్చర్ జోనుగా మార్చే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే నివేదికతో కూడిన ప్రతిపాదనను సిద్దం చేసిన వ్యవసాయ నిపుణులు ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అమరావతి గ్రామాల్లో ప్రస్తుతమున్న రోడ్లు.. భవనాలను యధాతధంగా ఉంచేసి మిగిలిన భూమిని స్పెషల్ అగ్రి జోన్ కు ఉపయోగించాలనే ప్రతిపాదన అందినట్లు సమాచారం.
ఈ ప్రతిపాదనపై సర్కార్ కసరత్తు ప్రారంభించింది. దీని ద్వారా.. ల్యాండ్ పూలింగ్ భూముల సహా ప్రభుత్వ భూములనూ ఈ ప్రత్యేక వ్యవసాయ జోన్ పరిధిలోకి తెచ్చే యోచన చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రత్యేక ఆర్ధిక మండళ్ల పురోగతిని పరిశీలించిన అనంతరం నివేదిక రూపకల్పన చేసారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
విలువైన పంటల హబ్ గా ప్రణాళిక..
వాణిజ్య పరంగా అత్యంత విలువైన పంటలకు హబ్ గా అమరావతి ప్రాంత అభివృద్ధికి ప్రణాళిక లు అందించినట్లు తెలుస్తోంది. స్పెషల్ అగ్రికల్చర్ జోనుకు రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తల పరిశోధనలకు కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అమరావతి అనూకులమన్న నిపుణుల నివేదిక పైన అధ్యయనం చేస్తున్నారు.
ఇదే సమయంల..స్పెషల్ అగ్రికల్చర్ జోనులో రైతులను భాగస్వాములను చేయాలని సూచన అందింది. రైతులకు మరింత లబ్ది కలిగించాలని భావిస్తోన్న సర్కార్...ఈ ప్రతిపాదన పైన రైతులతో చర్చించాలని యోచిస్తోంది. అదే సమయంలో.. రిటర్నబుల్ ప్లాట్లను రైతులకు ఇచ్చి.. మిగిలిన భూములను వ్యవసాయ జోన్ పరిధిలోకి తెస్తే ఎలా ఉంటుందనే యోచన పైనా కసరత్తు చేస్తున్నారు. స్పెషల్ అగ్రికల్చర్ జోనులో నిపుణలతో పాటు ఇతరులకూ పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని స్పష్టం చేస్తోన్న నివేదికలో పేర్కొన్నట్లుగా సమాచారం. ఈ జోన్ కు అనుబంధంగా ఇతర ఆహారశుద్ధి పరిశ్రమలూ అభివృద్ధి చెందుతాయన్న నిపుణుల సూచనలతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
రైతులు అంగీకరిస్తారా..
రాజధాని ప్రాంతం తమ ప్రాంతంలో ఉండాలని మాత్రమే నినదిస్తున్న అమరావతి ప్రాంత రైతులు ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారా అనే సందేహం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అమరావతి నుండి రాజధాని తరలిస్తే.. తమ భూములకు విలువ ఉండదని..తాము నష్టపోతామనే భావన వారిలో ఉందని..దీని ద్వారా వారి ఆందోళనకు పరిష్కారం లబిస్తుందని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు.
అయితే , ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో నిర్మాణాలు జరగటం..రైతులను ప్లాట్లు తిరిగి ఇవ్వాల్సి ఉండటం కొంత సమస్యగా మారే అవకాశం కనిపిస్తోంది. మరి..ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందీ .. రైతులు ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.