నిమ్మగడ్డ ఆదేశాలపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం: ఈ ఐఎఎస్పై చర్యలకు: ఎస్ఈసీకి రిప్లయ్
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కార్యాలయం మధ్య ఆరంభమైన విభేదాలు ఇక పతాక స్థాయికి చేరుకున్నాయి. తొలిదశ పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ఈ విభేదాలు, వివాదాలు మరింత ముదిరిపోతున్నాయి. రాజ్యాంగబద్ధంగా తనకు సంక్రమించిన అధికారాలను అడ్డుగా పెట్టుకుని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. తమ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోందంటూ అధికార జగన్ ప్రభుత్వ పెద్దలు విమర్శలు గుప్పిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో కీలక నిర్ణయం వెలువడింది.
జిల్లాల్లో మంత్రుల పర్యటనలకు బ్రేక్: ఎమ్మెల్యేలకూ వర్తింపు: రీషెడ్యుల్ బాధ్యుడాయనే: నిమ్మగడ్డ
సీనియర్ ఐఎఎస్ అధికారి, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్పై చర్యలు తీసుకోవాలంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జారీ చేసిన ఆదేశాలను ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆయనపై చర్యలు తీసుకోలేమని స్పష్టం చేసింది. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి (పొలిటికల్)గా పనిచేస్తోన్న ప్రవీణ్ ప్రకాష్ను విధుల నుంచి తప్పించాలంటూ రాసిన లేఖకు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఆయనను విధుల నుంచి తప్పించాలంటూ ఇచ్చిన ఆదేశాలు ఇవ్వడం పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.
ఈ ఆదేశాలు అందిన తరువాత.. ప్రవీణ్ ప్రకాష్ నుంచి వివరణ తీసుకున్నామని తెలిపింది. ఆయన ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉండటంతో తాము చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని వివరిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు ఇమెయిల్ ద్వారా బదులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అఖిల భారత సర్వీసు అధికారిపై నేరుగా చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయానికి లేదని, అది పరిధిలోకి రాదని స్పష్టం చేసినట్లు సమాచారం.
Recommended Video
ప్రవీణ్ ప్రకాష్ మీద చేసిన ఆరోపణలు నిరాధారమైనవని ఆదిత్యనాథ్ దాస్ తేటతెల్లం చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలనే విషయాన్ని పునఃపరిశీలించాలని తాను పంపించిన ఇమెయిల్లో కోరినట్లు చెబుతున్నారు. ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చిన వివరణను కూలంకషంగా ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఎస్ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలు.. దానికి ఆయన ఇచ్చిన వివరణను పాయింట్ల రూపంలో ఆదిత్యనాథ్ దాస్ ఎస్ఈసీకి పంపించారని అంటున్నారు. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందని భావిస్తున్నట్లు ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నట్లు చెబుతున్నారు. దీనిపై ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఎలాంటి స్పందన వెళ్లిందనేది తెలియరాలేదు.