ఇక రాత్రి 9 వరకే మద్యం..880 దుకాణాల తగ్గింపు: 3500 ప్రభుత్వ షాపులు..15 వేల ఉద్యోగాలు..!!
ఏపీ ప్రభుత్వం మద్యం విధానంలో కొత్త నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు దశల వారీగా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేస్తోంది. కొత్తగా మద్యం పాలసీని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఏపీ మొత్తంగా 4,380 మద్యం దుకాణాలు ఉండగా.. అందులో కొత్త పాలసీ మేరకు 880 దుకాణాలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా అందులో ప్రభుత్వ మద్యం దుకాణాల సంఖ్య 3,500గా ప్రకటించింది. వీటిలో 15 వేల ఉద్యోగాలను కాంట్రాక్టు పద్దతిన నియమించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, మద్యం విక్రమాల సమయాన్ని సైతం కుదించింది. ఇక నుండి ఏపీలో మద్యం దుకాణాలు రాత్రి తొమ్మది గంటల వరకే పని చేయనున్నాయి. అక్టోబర్ 1 నుండి ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం కానున్నాయి.
రివర్స్ టెండరింగ్ మానుకోవాలని సూచన .. జగన్ సర్కార్ కు పీపీఏ సిఈవో జైన్ లేఖ
మద్యం పాలసీ ప్రకటన...
ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని ప్రకటించింది. అందులో భగంగా కొత్త విధి విధానాలను ఖరారు చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు అక్టోబర్ 1 నుండి ప్రభుత్వ మద్య దుకాణాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో 4,380 మద్యం షాపులుండగా తొలి ఏడాదే వీటిలో 880 తగ్గించి 3,500కి కుదించింది. వీటిని ప్రభుత్వమే నిర్వహించనుంది. షాపులను ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఏర్పాటు చేయనుంది. వీటికి ఏపీఎస్బీసీఎల్ రిటైల్ ఔట్లెట్గా నామకరణం చేస్తారు. వీటిపై షాపు నెంబర్ కూడా ఉంటుంది. జిల్లాలవారీగా షాపుల సంఖ్యపై ఎక్సైజ్ కమిషనర్ గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు. కొత్తగా ఖరారు చేసిన విధి విధానాల మేరకు ఒక్కో షాపు 150 చదరపు అడుగుల నుంచి 300 చదరపు అడుగుల లోపు ఉండాలిని స్పష్టం చేసింది. అదే విధంగా పక్కా నిర్మాణంతో రోడ్డుకు అభిముఖంగా..ఒకే డోర్తో నిర్మించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొదటి అంతస్తులోనే షాపు ఉండాలి. ఎమ్మార్పీ ధరలను సూచించే బోర్డును ఖచ్చితంగా ఏర్పాటు చేయాలిని ఆదేశించింది. మద్యం షాపులో సీలింగ్ ఫ్యాన్లు, టేబుళ్లు, కుర్చీలు, ఐరన్ ర్యాక్లు, ఎలక్ట్రికల్ సబ్ మీటర్, దొంగ నోట్లను గుర్తించే డిటెక్టర్, సీసీ కెమెరాలు, అవసరమైన సాఫ్ట్వేర్ ఉండాలంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది.
రాత్రి 9 గంటల వరకే మద్యం షాపులు..
ఇప్పటి వరకు మద్యం దుకాణాల వేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంది. ఇక నుండి మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడపాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఆ తరువాత ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం అమ్మకాలు చేయటానికి వీళ్లేదని తేల్చి చెప్పింది. ఏడాదికి మాత్రమే షాపు అద్దె అగ్రిమెంట్ చేసుకోవాలి. ఆ తర్వాత టైమ్ టు టైమ్ పొడిగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రతి మద్యం షాపులో అర్బన్ ప్రాంతాల్లో ఐదుగురు, గ్రామీణ ప్రాంతాల్లో నలుగురు ఉంటారు. అర్బన్ ప్రాంతాల్లో ప్రతి మద్యం షాపులో ఒక సూపర్వైజర్, ముగ్గురు సేల్స్మెన్, ఒక వాచ్మెన్, గ్రామీణ ప్రాంతాల్లోని షాపులో సూపర్వైజర్, ఇద్దరు సేల్స్మెన్, ఒక వాచ్మెన్ ఉండేలా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. షాపు సూపర్వైజర్కు వయోపరిమితి 21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు ఉండి, మద్యం షాపు ఎక్కడ ఏర్పాటవుతుందో ఆ మండలానికి చెందినవారై ఉండాల్సి ఉంటుంది. విద్యార్హత డిగ్రీ. బీకాం ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఉంటుంది. షాపు సేల్స్మెన్కు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు స్థానికులై ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సూపర్వైజర్కు నెలకు రూ.17,500 జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ, సేల్స్మెన్కు నెలకు రూ.15 వేల జీతంతోపాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పిస్తారు.
కాంట్రాక్టు విధానంలో సిబ్బంది ఎంపిక
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మొత్తం 15 వేల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత అర్హులైనవారు ఆన్లైన్లో ఏపీఎస్బీసీఎల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైనవారికి కాంట్రాక్టు విధానంలో ఏడాది పాటు మద్యం షాపులో పనిచేసే అవకాశం ఉంటుంది. సిబ్బందికి వీక్లీ ఆఫ్ను ఆయా డిపో మేనేజర్ అనుమతితో ఇస్తారు. సూపర్వైజర్ లేదా సేల్స్మెన్ సేవలు సంతృప్తిగా ఉంటే వారిని రెండో ఏడాది కొనసాగించవచ్చు. రెండో ఏడాదిలో ఓ నెల రెమ్యునరేషన్ను బోనస్గా ఇస్తారు. మద్యం షాపులో రోజువారీ లావాదేవీలు, స్టాకు రిజిస్టర్ల నిర్వహణ, డిపో మేనేజర్ సూచించే పనులను సూపర్వైజర్ నిర్వహించాలి. వినియోగదారుల బిల్లింగ్, మద్యం బాటిళ్ల లోడింగ్, సూపర్వైజర్ సూచించే బాధ్యతలను సేల్స్మెన్ నిర్వహించాల్సి ఉంటుంది. మద్యం షాపును ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నడపాలి. మద్యం షాపులో ఏదైనా నష్టం సంభవిస్తే సిబ్బందిదే పూర్తి బాధ్యత. జిల్లాల సంయుక్త కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా స్థాయి కమిటీలు మద్యం షాపుల ఏర్పాటు, రవాణా, సిబ్బంది ఎంపికలను పర్యవేక్షిస్తాయి. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త విధి విధానాల ద్వారా మద్యం అమ్మకాల పైన ఏ మేరకు ప్రభావం పడుతుందని చూడాల్సి ఉంది.