అర్థరాత్రి రహస్య జీవోల కలకలం...ప్రతిపక్షాలకు చెక్.. ఏపీ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది..?
అమరావతి: ఏపీ ప్రభుత్వం మంగళవారం అర్థరాత్రి ఏకంగా 10 జీవోలు జారీ చేసింది. 10 నిమిషాల్లో జారీ చేసిన 10 ఈ జీవోలను కాన్ఫిడెన్షియల్ జీవోలుగా పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల వ్యవహారం అటు రాజకీయంగా ఇటు న్యాయపరంగా చిక్కులు రాకుండా ఈ జీవోలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం స్థానిక సంస్థల రిజర్వేషన్లను 59.85గా ఖరారు చేస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. 50శాతం దాటకుండా రిజర్వేషన్లు ఉండాలని స్పష్టం చేసింది. ఈనెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చే పెద్ద మొత్తంలో నిధులు నిలిచిపోనున్నాయి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోను స్థానిక సమస్యలను ఈ నెలాఖరులోగానే పూర్తిచేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.
ఇందులో భాగంగా బీసీ రిజర్వేషన్లను కుదిస్తూ కొత్త రిజర్వేషన్లను 50శాతానికి ఖరారు చేసింది. అయితే దీనిని జీవో ద్వారా లేదా ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుంది. ఈ రోజు జరిగే కేబినెట్లో తొలుత కొత్త రిజర్వేషన్లకు ఆమోదం తెలిపి ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావించింది. అయితే ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొందటం కోసం మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఇదే సమయంలో ఆ ఆర్డినెన్స్ పైన బీసీ సంఘాలు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది. దీంతో సమయం తక్కువగా ఉండటం కేంద్ర నిధులు కీలకం కావడంతో హైకోర్టు రద్దు చేసిన జీవో స్థానంలో కోర్టు సూచనల మేరకే 50శాతానికి పరిమితమవుతూ ఈ జీవోలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
Recommended Video
ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ ఈ నెల 7న ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. ఈ సాయంత్రానికి 13 జిల్లాల్లోను రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. అవి కలెక్టర్ల నుంచి ప్రభుత్వానికి అందగానే ఎన్నికల సంఘానికి నివేదించనున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ఈ నెలాఖరులోగానే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. పరీక్షలు జరుగుతున్నా ప్రత్యమ్నాయాలను పరిశీలిస్తున్నారు. ఈనెల 27కల్లా ఎన్నికలు పూర్తి చేసుకుని ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. న్యాయపరంగా చిక్కులు లేకుండా ఉండటానికే ఈ జీవోలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేకుండా చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఎన్నికలు పూర్తి చేయడం కేంద్రం నిధులు దక్కించుకోవడం, ఈ నెలాఖరులోగా బడ్జెట్కు ఆమోదముద్ర వేసుకోవడం అదే సమయంలో పరీక్షలకు ఇబ్బంది లేకుండా చేయడంతో ప్రభుత్వం మార్చి నెలను కీలక నిర్ణయాలతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. ఈ రోజు జరిగే కేబినెట్ సమావేశంలో ఈ మొత్తం వ్యవహారానికి అధికారిక ఆమోదముద్ర లభించనుంది.