రేపటి నుంచి నోటీసులు: భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణకు రంగం సిద్ధం
అమరావతి: విజయనగరం జిల్లా భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి భూసేకరణ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి ఆ ప్రాంత రైతులకు శనివారం నోటీసులు జారీ చేయనుంది. ఇందులో ఏమైనా అభ్యంతరాలుంటే 60 రోజుల్లో రైతులు తెలియజేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.
భోగాపురంలోని 1,205 కుటుంబాలను తరలించి వారికి ప్రత్యేక గ్రామాలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఎయిర్ పోర్టుకు భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తే ల్యాండ్ పూలింగ్ కైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొంది.
భోగాపురం ప్రాంతంలో మొత్తం 5,311 ఎకరాల భూమిని సేకరించేందుకు 48 మంది అధికారులను ప్రభుత్వం నియమించింది. ఇదిలా ఉంటే భూసేకరణను వ్యతిరేకిస్తూ భోగాపురం రైతులు గత కొంతకాలంగా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
తిరుపతి ఎంపీ వరప్రసాద్ విజ్ఞప్తి
చిత్తూరు జిల్లాలో మన్నవరం విద్యుత్ పరికరాల పరిశ్రమను త్వరగా పూర్తి చేయాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రికి తిరుపతి ఎంపీ వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన కేంద్ర భారీ పరిశ్రమల, టూరిజం శాఖామంత్రులను కలిశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా తూపులపాలెంలో బీచ్ ఏర్పాటు చేసి, టూరిజం హబ్గా చేయాలని కోరినట్లు ఎంపీ వరప్రసాద్ తెలిపారు.
అన్నదాన పథకానికి రూ.50 వేలు విరాళం
శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి శ్రీశైలానికి చెందిన వి. కాశమ్మ అనే భక్తురాలు రూ. 50 వేలను విరాళంగా అందజేశారు.
శుక్రవారం శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకున్న అనంతరం ఆమె దేవాదాయసహాయ కమీషనర్ మహేశ్వరరెడ్డికి అందజేశారు. అనంతరం ఆమెకు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలు, అన్నదాన బాండ్ను అందించారు.