నిమ్మగడ్డ రమేష్ పై వేటు.. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం- ఏపీ సర్కార్ జీవోలు జారీ...
ఏపీలో కరోనా వైరస్ లాక్ కల్లోలం రేపుతుండగానే రాజకీయ వేడి పుట్టించే నిర్ణయాన్ని జగన్ సర్కారు తీసుకుంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం పంపిన ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో న్యాయశాఖ రెండు జీవోలు జారీ చేసింది. దీంతో పాటు ఎన్నికల కమిషనర్ అర్హతల్లోనూ మార్పులు చేశారు.
Recommended Video
నిమ్మగడ్డ రమేష్ పై వేటు...
ఏపీలో ఓవైపు కరోనా వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ కొనసాగుతుండగానే అంతకు మించి వేడిపుట్టే నిర్ణయాన్ని వైసీపీ ప్రభుత్వం తీసుకుంది. స్ధానిక ఎన్నికలను వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం గవర్నర్ ఆమోదంతో జీవోలు జారీ చేసి వెంటనే ఆయనకు ఉద్వాసన పలికింది. తొలుత కేబినెట్ లో ఆర్డినెన్స్ ను ఆమోదించాలని భావించిన ప్రభుత్వం రాజకీయంగా రచ్చకు అవకాశం ఇవ్వకుండానే పని పూర్తి చేయాలన్న ఆలోచనతో వెనువెంటనే కమిషనర్ ను తొలగిస్తూ రెండు రహస్య జీవోలు ఇచ్చేసింది.
అర్హతల్లో మార్పు- రహస్య జీవోలు..
ఏపీ ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ సీనియర్ ఐఏఎస్ అధికారి మాత్రమే. దీంతో ఆయన స్ధానంలో హైకోర్టు న్యాయమూర్తి స్దాయి వ్యక్తి కమిషనర్ గా ఉండేలా ప్రభుత్వం నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ మేరకు రహస్య జీవోలు తీసుకొచ్చింది. కమిషనర్ అర్హతలు మారడంతో ప్రస్తుతం కమిషనర్ గా ఉన్న రమేష్ కుమార్ పదవి కోల్పోయినట్లయింది. ఓవైపు కరోనా నియంత్రణ చర్యల్లో రాష్ట్ర అధికార యంత్రాంగం నిమగ్నమై ఉంది.
క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది
ఇలాంటి సమయంలో ప్రభుత్వం ఎక్కడా గుట్టుచప్పుడు కాకుండా ఎన్నికల కమిషనర్ తొలగింపు కోసం ఆర్డినెన్స్ తీసుకురావడంతో పాటు దానికి ఆమోదం కూడా తీసుకోగలిగింది. దీనిపై రాజ్ భవన్ నుంచి కూడా ఎలాంటి ప్రకటనా రాలేదు. ఆ లోపే న్యాయశాఖ రెండు రహస్య జీవోలు విడుదల చేసింది. విషయం తెలియడంతో ప్రతిపక్షాల గగ్గోలు మొదలైంది. దీంతో నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారం క్షణాల్లో అందరికీ తెలిసిపోయింది.