జగన్ పర్యటనపై ఆంక్షలు: 'రూట్ మ్యాప్ మార్చుకోవాల్సిందే..'
వైసీపీ రూపొందించుకున్న రూట్ మ్యాప్ ను పక్కనబెట్టి.. తాము సూచించిన మార్గంలోనే పర్యటన చేయాలంటూ జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు.
గుంటూరు: వైసీపీ అధినేత వైఎస్ జగన్ అమరావతి గ్రామాల పర్యటనపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. జగన్ పర్యటనపై ప్రభుత్వానికెందుకు ఉలికిపాటు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తుండగా.. పోలీసులు మాత్రం పర్యటనకు అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పారు.
వైసీపీ రూపొందించుకున్న రూట్ మ్యాప్ ను పక్కనబెట్టి.. తాము సూచించిన మార్గంలోనే పర్యటన చేయాలంటూ జగన్ పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసులు తీరును తప్పుబడుతున్న వైసీపీ నేతలు జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు.
భూములు పోగొట్టుకున్న బాధిత రైతులను పరామర్శించకూడదా? అని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. కాగా, రాజధాని ప్రాంతాల్లో జగన్ పర్యటన ఖాయమైందని తెలియగానే.. మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు లింగాయపాలెం గ్రామస్తులను బుజ్జగించే చర్యలకు దిగినట్టు వాదనలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే, గురువారం నాడు జగన్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం 9.30గం.కు మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రు నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతుందని ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ తెలిపారు.
మధ్యాహ్నాం 2గం.కు లింగాయపాలెం చేరుకుని బాధిత రైతులతో జగన్ మాట్లాడుతారని రఘురామ్ తెలియజేశారు.