కరోనా ఎఫెక్ట్ : సోషల్ మీడియాకు చురుగ్గా స్పందిస్తున్న ఏపీ సర్కార్..
ఒకప్పుడు సోషల్ మీడియా అంటే అందరికీ చిన్న చూపు. నిర్ధారణ లేని వార్తలు, తప్పుడు వార్తలు, జనాల్ని తప్పుదోవ పట్టించే వార్తలకు సోషల్ మీడియా కేంద్రంగా ఉండేది. కానీ క్రమంగా కాలం మారుతోంది. అప్పటికీ విశ్వసనీయత రాకపోయినా కనీసం కొన్ని విషయాల్లో మాత్రం జనాభిప్రాయానికి ప్రతీకలుగా మారుతున్న సోషల్ మీడియా పోస్టులను ప్రభుత్వాలు కూడా పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్ధితి. ఇదే కోవలో ఏపీలోని వైసీపీ సర్కారు తాజాగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులపై స్పందిస్తోంది.
సోషల్ మీడియా అంటేనే...
సోషల్ మీడియా పేరు చెబితేనే ప్రభుత్వాలు మండిపడే రోజులివి. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, వ్యక్తులపై బురదజల్లేందుకు ప్రత్యర్ధులు సామాజిక మాధ్యమాలను వాడుకుంటున్నారని భావించే పరిస్ధితులు. కానీ ప్రస్తుతం కాలం మారుతోంది. తమకు ఇబ్బంది కలిగితే చాలు దాన్ని రెగ్యులర్ మీడియాతో ఎలా పంచుకోవాలో తెలియని పరిస్ధితులలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేస్తున్నారు. వీటి విశ్వసనీయత ఎంత అన్న సందేహాలు ఉన్నా స్ధూలంగా సమస్యను బయటపెట్టడంలో సోషల్ మీడియా ఇప్పుడు వారధిగా మారిపోయింది.
జగన్ సర్కారుదీ ఇదే బాట..
ఏపీలో గతంలో తమపై సోషల్ మీడియాలో ఏదైనా పోస్టు పెడితే అంతెత్తున ఎగిరే వైసీపీ ప్రభుత్వం, పార్టీ పెద్దలు కూడా ఇప్పుడు వాటిలో వాస్తవాన్ని కాస్తో కూస్తో గుర్తించే పనిలో ఉంటున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ వ్యాప్తి సందర్భంగా విధించిన లాక్ డౌన్ లో పోలీసులు కొన్ని చోట్ల అతిగా ప్రవర్తించిన ఘటనలను సోషల్ మీడియా ద్వారా వైరల్ అవుతున్నట్లు తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు వారిని సస్పెండ్ చేయాలని ఆదేశాలు ఇచ్చేశారు.
సోషల్ మీడియా తాజా బాధితులు వీరే..
తాజాగా ఏపీలో లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ప్రజలపై దాడులకు పాల్పడిన రాయచోటి, పెరవలి ఎస్సైలను ప్రభుత్వం సస్పెండ్ చేయగా.. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి మరీ మద్యాన్ని అక్రమంగా తరలించిన తూర్పుగోదావరి జిల్లా రాయవరం ఎక్సైజ్ సీఐని సస్పెన్షన్ తో పాటు 5 లక్షల జరిమానా కూడా విధించారు. దీంతో ప్రభుత్వం ఆయా ఘటనలను ఎంత సీరియస్ గా తీసుకుందో అర్దమవుతోంది.
సోషల్ మీడియా పేరు చెబితే చాలు..
తాజాగా ఏపీ సర్కారు సోషల్ మీడియాలో పోస్టులను సైతం సీరియస్ గా తీసుకుని కఠిన చర్యలకు ఉపక్రమిస్తుండటంతో విధి నిర్వహణలో నిబంధనలు ఉల్లంఘించే అధికారులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ క్షణాన ఎవరు సెల్ ఫోన్లో తమను వీడియో తీసి వైరల్ చేస్తారో తెలియక వీరంతా ఆందోళన చెందే పరిస్ధితి నెలకొంది. దీంతో విధి నిర్వహణలో అప్రమత్తత కూడా పెరిగింది.
రైతు సమస్యలకు సైతం..
ఒకప్పుడు రైతు సమస్యలను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని విమర్శిస్తే కేసులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నరంటూ ప్రభుత్వాలు, పార్టీలు మండిపడేవి. కానీ తాజాగా ఏపీలో వైసీపీ సర్కారు తరఫున వ్యవసాయ మంత్రి కన్నబాబు.. సోషల్ మీడియాలో టమోటా రైతు పడుతున్న ఆవేదనను గమనించి తక్షణం చర్యలకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతులకు సంబంధించిన సమస్యలపైనా సోషల్ మీడియాలో ప్రస్తావిస్తే ప్రభుత్వం స్పందిస్తుందన్న విశ్వాసం వారికి కలుగుతోంది.