ఆశలు గల్లంతు: అమరావతి శిల్ప సంపదపై చంద్రబాబువి ఉత్తమాటలేనా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతలా అంటే అమరావతి చరిత్రకు సంబంధించిన కొన్ని ఆనవాళ్లు ఖండాంతరాలను దాటి విదేశాలకు వెళ్లేలా. చెప్పాలంటే లండన్ మ్యూజియంలో ఏకంగా అమరావతి పేరిట ఒక విభాగాన్నే ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి పేరుని ఖరారు చేసిన తర్వాత చరిత్రకు సంబంధించిన కళాఖండాలు, శిల్పకళ చాతుర్యానికి సాక్ష్యాలుగా నిలిచిన అపురూప సంపదను తిరిగి తీసుకురావాలన్న వాదనలు పెరిగాయి. అంతేకాదు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అమరావతి శిల్ప సంపదను, చరిత్ర గుర్తులను ఏపీకి తీసుకువచ్చి ఓ ప్రత్యేక మ్యూజియం నిర్మిస్తామని ప్రకటించారు.
ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. అయితే ఆ అపురూప సందప ఇప్పట్లో ఏపీకి వచ్చేలా కనిపించడం లేదు. అమరావతికి సంబంధించిన శిల్ప సంపద, చరిత్ర గుర్తులు తెలంగాణలోని స్టేట్ మ్యూజియంతోపాటు తమిళనాడులోని ఎగ్మోర్ మ్యూజియం, కోల్కతా, ఢిల్లీ, లండన్ మ్యూజియంలలో ఉన్నాయి.
అమరావతి చారిత్రక సంపదను తమకు ఇవ్వాల్సిందిగా ఏపీ సర్కారు చేసిన విజ్ఞప్తులను ఢిల్లీ, కోల్కతా మ్యూజియాలు అస్సలు పట్టించుకోలేదు. బౌద్ధులకు సంబంధించిన దాదాపు 400లకు పైగా శిల్పాలు చెన్నైలోని ఎగ్మోర్ మ్యూజియంలో ఉన్నాయి. బ్రిటిష్ పాలకులు నాడు అమరావతిలో తవ్వకాలు జరపగా బయటపడిన శిల్పాలను చెన్నై తరలించి ఎగ్మోర్ ప్రభుత్వ పురావస్తు ప్రదర్శనశాలలో భద్రంగా ఉంచారు.
ఇప్పుడు వాటినే రాజధాని అమరావతికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శిల్పాలు తమకు తిరిగి ఇవ్వాలని ఏపీ ఉన్నతాధికారులు తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాశారు. దీంతో, దీనిపై ఓ నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఎగ్మోర్ మ్యూజియం అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో చెన్నైలోని ఎగ్మోర్ మ్యూజియం అధికారులు ''అమరావతి శిల్పాలు తిరిగి ఇవ్వాలని ఏపీ కోరడం సబబే. అయితే ఇప్పటికే ఈ శిల్పాలను పరిరక్షించటానికి కోట్లు ఖర్చుపెట్టాం. కదిలించటానికి వీలు లేని విధంగా శాశ్వతంగా చాలా శిల్పాలను ఫిక్స్ చేశాం. అందులోనూ అమరావతి శిల్పాలు చాలా సున్నితంగా ఉంటాయి. వీటిని తరలించడం చాలా కష్టం. ఆ శిల్పాలను ఇక్కడ ఉంచటమే మంచిది'' అంటూ ఎగ్మోర్ మ్యూజియానికి చెందిన క్యూరేటర్ ఇటీవల ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు.
మరోవైపు, అమరావతి శిల్పాల కోసం విదేశాంగ శాఖ ద్వారా ఏపీ ప్రభుత్వం లండన్ మ్యూజియానికి ఓ లేఖ రాసింది. ఈ లేఖకు లండన్ మ్యూజియం క్యూరేటర్ స్పందిస్తూ ''అమరావతి శిల్పాలను లోన్బేసిస్లో ఇస్తాం. కానీ, అన్నింటినీ ఇవ్వలేం. కొన్ని శిల్పాలను 5 నుంచి 10 ఏళ్లు ఏపీలో ఉంచి తిరిగి మాకు అప్పగించాలి. వీటికి సమ్మతమైతే తిరిగి లేఖ రాయండి'' అంటూ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది.
దీంతో ''లోనబేసిస్లో ప్రత్యేక ఏర్పాట్లతో వీటిని ఏపీకి తీసుకురావడం చాలా కష్టమైన పని. ఈ శిల్పాలను పరిరక్షించే అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం లేదు. నెలకు లక్షల్లో ఖర్చుపెట్టి లండన నుంచి నిపుణులను తీసుకురావాలి. వీటిని పరిరక్షించటానికి కోట్లలో ఖర్చు అవుతోంది. తిరిగి లండన్కు పంపించే ఖర్చులు కూడా మనమే భరించాలి. వీటన్నింటి కన్నా లండన్లోనే ఉంటే అమరావతి పేరు పాపులర్ అవుతుంది'' అని ఏపీ ఉన్నతాధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. దీనిని బట్టి చూస్తుంటే అమరావతి శిల్ప సంపదపై ఆంధ్రులు పెట్టుకున్న ఆశలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఉత్తమాటలేనని తేలిపోయింది.