3500 ఏసి గదులు : 155 విమాన టిక్కెట్లు : పది కోట్ల పైగా ఖర్చుతో ఢిల్లీ దీక్ష..!
ఢిల్లీ వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన దీక్షకు ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. ముఖ్యమంత్రి దీక్షకు మద్దతుగా వచ్చిన వారి కోసం ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేసారు. అదే విధంగా పలువురికి ప్రభుత్వ ఖర్చులతో విమాన టిక్కెట్లు కొనుగోలు చేసారు. ఇక ప్రత్యేక రైళ్ల కోసం 1.12 కోట్లు చెల్లించారు.
ఖరీదైన హోటళ్లు లో వసతి..
ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న దీక్ష కోసం హాజరయ్యే వారి కోసం ఖరీదైన ఏసీ హోటళ్లలో 3,500 మందికి వసతి సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు నిర్వహించే దీక్షకు రూ. 10 కోట్ల దాకా ప్రజాధనాన్ని ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలకు విలాసవంతమైన హోటళ్లలో వసతి కల్పిస్తోంది. ఢిల్లీలో అత్యంత ఖరీదైన హోటల్ రాయల్ ప్లాజాలో 30 గదులను రాష్ట్ర ప్రభుత్వం తరఫున బుక్ చేశారు. మంత్రులు, వీఐపీలు రెండు రోజులపాటు ఢిల్లీలో ఉంటున్నందున వారి కోసం వీటిని కేటాయించారు.
ఏపీ భవన్
హోటల్ సూర్య లో 200 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ శాఖల చైర్మన్లకు వసతి కల్పిస్తున్నారు. రూ. 1.12 కోట్ల వ్యయంతో అ నంతపురం, శ్రీకాకుళం నుంచి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్ల ద్వారా వచ్చే వారికి పహార్గంజ్ ప్రాంతంలో ‘ఆన్ యువ ర్ ఓన్' (ఓవైఓ) కింద వివిధ హోటళ్లలో 850 గదులను బుక్ చేశారు. కేరళ, మహారాష్ట్ర భవన్లు, టీటీడీ అతిథి గృహం, న్యూఢిల్లీ వైఎంసీఏ టూరిస్ట్ హోటళ్లలో కూడా వందల సంఖ్యలో గదులు బుక్ చేశారు. వీరందరినీ సీఎం చంద్రబాబు దీక్ష చేసే ఏపీ భవన్ వద్దకు తరలించేందుకు ప్రత్యేకంగా 32 బస్సులను ఏర్పాటు చేశారు. వీటి ఖర్చు మొత్తంగా ఏపి ప్రభుత్వ నిధులనే వినియోగిస్తున్నారు.
155 మందికి విమాన టిక్కెట్లు..
ధర్నాలో పాల్గొనాలంటూ ప్రభుత్వ ఉద్యో గులపై ఒత్తిడి చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం వారిని ఢిల్లీకి తరలించి తిరిగి స్వస్థలాలకు చేర్చేందుకు విమాన టిక్కెట్ల కోసం భారీగా వెచ్చిస్తోంది. ఏపీ ఎన్జీవోల సంఘం నుంచి 29 మందికి, ఏపీ జేఏసీ అమరావతి నుంచి 20 మందికి, ఏపీ గెజిటెడ్ ఆఫీసర్స్ నుంచి ఐదుగురికి, ఏపీ సెక్రటేరియట్ అసోసియేష న్ నుంచి 18 మందికి విమాన టిక్కెట్లు సిద్ధం చేసింది. లోక్సత్తా, ఆప్ తదితర రాజకీయ పార్టీల నేతలతోపాటు ఉద్యోగ, రాజకీయ, విద్యార్థి సంఘాల నేతలతో కలిపి మొత్తం 155 మందికి విమాన టిక్కెట్లు సమకూర్చిందని లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీ భవన్ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫునే భారీ ఎత్తున బ్యానర్లు నెలకొల్పారు. వేదిక ఏర్పాటు, హోర్డింగులు ఇతరత్రా ఖర్చులకు రూ. 80 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు ఏపీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.