కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగం పెంచిన ఏపీ సర్కార్ .. ఊపందుకున్న పునర్విభజన ప్రక్రియ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది .ఏపీలో అధికారం రాగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీకి ప్రత్యేక సంఘాలను, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసి కొత్త జిల్లాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివరాల సేకరణలో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.
Recommended Video
ఎన్నికలు వాయిదా వేస్తే ఎవరికి నష్టమో చంద్రబాబు ,నిమ్మగడ్డ చెప్పాలి : మంత్రి కొడాలి నానీ
ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానంటూ ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ హామీ
ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేస్తానంటూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఏపీలో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి జిల్లాల పునర్విభజన పై ప్రత్యేకమైన దృష్టి సారించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియ ప్రస్తుతం ఊపందుకుంది. కొత్త జిల్లాలు ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రంలో తాజాగా ప్రభుత్వ ఆదేశాలతో పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాలు ఆస్తులు భూముల వివరాలను సేకరిస్తున్నారు.
జిల్లాల ఏర్పాటుకు కసరత్తు ... కార్యాలయాల ఏర్పాటుకు భవనాల పరిశీలన
రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అన్ని జిల్లాలలోనూ వివిధ శాఖల ఏర్పాటుకు కావలసిన కార్యాలయాలు ఏ మేరకు సరిపోతాయని దానిపై పరిశీలన చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన వివరాలను పునర్విభజన వెబ్సైట్ లో అప్ లోడ్ చేస్తున్నారు. పనిచేసే ప్రాంతాల ప్రాతిపదికన ఉద్యోగుల గణనను పూర్తి చేసిన అధికారులు జె సి లు, డిఆర్ఓ నేతృత్వంలో జిల్లా స్థాయిలో సబ్ కమిటీలను ఏర్పాటు చేసి కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు.
పునర్విభజనలో వేగం పెంచిన ఏపీ సర్కార్
ఇప్పటికే ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మార్చేందుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన కోసం ఏర్పాటు చేసిన రాష్ట్రకమిటీకి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి , పునర్విభజనపై రంగంలోకి దిగిన సర్కార్ నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేసి పునర్విభజనలో వేగం పెంచింది . జిల్లా బౌండరీలు, నియంత్రణ, లీగల్ వ్యవహారాల అధ్యయనానికి ఒక సబ్ కమిటీ, నిర్మాణాత్మకత, సిబ్బంది, పునర్విభజన అధ్యయనానికి రెండవ సబ్ కమిటీ, మౌలిక సదుపాయాల అధ్యయనం, ఆస్తుల అధ్యయనానికి మూడవ సబ్ కమిటీ, ఐటీ సంబంధిత పనుల అధ్యయనానికి నాలుగవ సబ్ కమిటీని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.ఇక ఈ కమిటీలన్నీ యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నాయి .
కొత్త జిల్లాలు ఇవే !
రాష్ట్ర స్థాయి కమిటీ, సబ్ కమిటీలకు సహాయం కోసం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీలకు చైర్మన్ గా కలెక్టర్ వ్యవహరిస్తారు.ఆయనతో పాటు పది మంది సభ్యులతో జిల్లా స్థాయి కమిటీలు పునర్విభజన సాధ్యాసాధ్యాలపై , మౌలిక వసతులపై దృష్టి సారించాయి. ప్రస్తుతం ఉన్న జిల్లాలతో పాటు ఏపీలో మరో 12 కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుంది .కొత్తగా ఏర్పాటు కానున్న 12 జిల్లాలు చూస్తే అనకాపల్లి (విశాఖ జిల్లా), అరకు (విశాఖ జిల్లా), అమలాపురం (తూర్పు గోదావరి), రాజమండ్రి (తూర్పు గోదావరి), నరసాపురం (పశ్చిమగోదావరి), విజయవాడ (కృష్ణా జిల్లా), రాజంపేట (కడప జిల్లా),నంద్యాల (కర్నూలు జిల్లా), హిందూపురం (అనంతపురం జిల్లా), నర్సరావుపేట (గుంటూరు జిల్లా), బాపట్ల (గుంటూరు జిల్లా), తిరుపతి (చిత్తూరు జిల్లా) అని తెలుస్తుంది. అంతే కాదు అరకుతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను కలుపుతూ మరో గిరిజన జిల్లాను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో కూడా జగన్ ఉన్నారని సమాచారం.