రాజధాని పేరెత్తకుండా.. పని కానిచ్చేద్దాం: సీఎం జగన్ కొత్త వ్యూహం: అసెంబ్లీకి బిల్లు సిద్దం..!
మూడు రాజధానుల ఆలోచనను..ఆచరణలోకి తీసుకురావటానికి ప్రభుత్వం సిద్దం అయింది. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో తమ ఆలోచనలకు కార్యరూపం తీసేకొచ్చే విధంగా ప్రభుత్వం వ్యూహాలు అమలు చేస్తోంది. అందులో భాగంగా.. అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశ పెట్టే కొత్త చట్టం సిద్దం చేసింది. అమల్లో న్యాయ పరమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. న్యాయ నిపుణులతో సుదీర్ఘ సంప్రదింపులు కొనసాగిస్తోంది. అందులో భాగంగా.. రాజధాని పేరు లేకుండా కొత్త చట్టం రూపొందించేందుకు సర్కార్ కసరత్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అసెంబ్లీలో ఏపీ ప్రభుత్వం..ఏపీ డీసెంట్రలైజేషన్ అండ్ ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆల్ రిజీయన్స్ బిల్-2020 పేరుతో కొత్త బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. దీని పైన తొలుత కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర వేసి..ఆ వెంటనే అసెంబ్లీకి తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్దం చేసింది.
అసెంబ్లీ ముట్డడిస్తాం: వైసీపీ ఇక బంగాళాఖాతంలోకే: చంద్రబాబు ఏకిపారేశారు
రాజధానుల ప్రస్తావన ఉండదా..
ప్రభుత్వం తొలి నుండి మూడు రాజధానుల గురించి ప్రస్తావిస్తోంది. కమిటీల నివేదికలు అదే తరహాలో సిఫార్సులు చేసాయి. అయితే, ఏపీలో మారుతున్న రాజకీయాలు..పెరుగతున్న సెంటిమెంట్ల కారణంగా ప్రభుత్వం న్యాయ పరంగా..రాజకీయంగా ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడాలని భావిస్తోంది. మరింతగా..ఈ సమస్యను సాగదీయకుండా..సాధ్యమైనంత త్వరగా తమ ఆలోచనలను కార్యరూపంలోకి తీసుకు రావాలని నిర్ణయించింది. అందులో భాగంగా సోమవారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసింది. అందులో..రాజధాని పేరెత్తకుండానే...అధికార వికేంద్రీకరణ దిశగా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం. రాజధాని పేరు ప్రస్తావిస్తే న్యాయ పరంగా చిక్కులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో..రాజధానులుగా ఎక్కడా ప్రస్తావించకుండా..జాగ్రత్తగా..న్యాయ సమీక్షకు అవకాశం లేకుండా తాము అనుకున్న విధంగా అధికారిక విధులను వికేంద్రీకరిస్తూ ఈ బిల్లును సిద్దం చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
నాలుగు జోన్లు.. తొమ్మది మంది సభ్యులు..
ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టే కొత్త బిల్లులో పలు ప్రతిపాదనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే డ్రాఫ్ట్ బిల్లును సిద్దం చేసిన అధికారులు...న్యాయపరంగా ఏమైనా చిక్కులకు అవకాశం ఉందా అనే కోణంలో తుది సంప్రదింపులు చేస్తున్నారు. ఏపీలోని మూడు ప్రాంతాలను వివిధ జోన్లను ఏర్పాటు చేస్తూ బిల్లు రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు జోన్లుగా 13 జిల్లాలను విభజించి బోర్డులు ఏర్పాటు దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతి జోనుకూ ప్రత్యేకంగా ఓ తొమ్మిది మంది సభ్యులతో బోర్డ్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రతి బోర్డులోనూ ఛైర్మనుగా సీఎం, వైస్ ఛైర్మనుగా మరో వ్యక్తికి అవకాశం కల్పిస్తారు. బోర్డులో సభ్యులుగా ఓ ఎంపీ, ఇద్దురు ఎమ్మెల్యేలు, మరో నలుగురు ప్రతినిధులకు ప్రాతినిధ్యం ఉంటుంది. బోర్డ్ కార్యదర్శిగా వ్యవహరించనున్న ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించే విధంగా ప్రతిపాదనలు సిద్దం అయినట్లు సమాచారం. ఉత్తర కోస్తా - శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలుగా..మధ్య కోస్తా- ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలు..దక్షిణ కోస్తా- గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు.. రాయలసీమ- కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
సీఆర్డీఏ బిల్లు పైనే తర్జన భర్జన..
ఇక, ఇప్పుడు అమరావతి ప్రకటన తరువాత చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టం విషయంలో ఏం చేయాలనే దాని పైన ప్రభుత్వంలో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. సీఆర్డీఏ బిల్లును రద్దు చేయాలా..లేక సవరణలు చేయాలా అనే దాని మీద కసరత్తు జరుగుతోంది. సీఆర్డీఏ బిల్లు రద్దు చేస్తే..రైతులకు న్యాయపరంగా పోరాడే అవకాశం ఉంటుందా..అది ఏ మేర ప్రభావం చూపిస్తుందనే అంశం పైన అధ్యయనం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీఆర్డీఏ బిల్లు ద్రవ్య బిల్లుగా ప్రవేశ పెట్టాలా..లేక సాధారణ బిల్లుగా సభలో ప్రవేశ పెట్టాలా అనే దాని పైన ఉన్నత స్థాయిలో సుదీర్ఘ చర్చలు సాగాయి. ఇక, రాజధాని విధుల వికేంద్రీకరణ దిశగా ప్రస్తుతం నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో..ఇప్పుడు సీఆర్డీఏ బిల్లు విషయంలో ప్రభుత్వ తుది నిర్ణయం ఎలా ఉంటుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.