రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే: హైకోర్టులో ఏపీ సర్కారు అఫిడవిట్
అమరావతి: రాజధానిపై నిర్ణయాధికారం రాష్ట్రానిదేనని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టుకు తన అఫిడవిట్లో పేర్కొంది. రాష్ట్ర విభజన అంశాలపై పీవీ కృష్ణయ్య వేసిన పిటిషన్పై ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది. రాజధాని నిర్ణయం రాష్ట్రానిదేనని, కేంద్రం కూడా తన అఫిడవిట్లో ఇదే విషయాన్ని తేల్చి చెప్పిందని ఏపీ సర్కారు తెలిపింది.
పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల తర్వాత ఈ అంశాలు సమీక్షార్హం కాదని, కార్యాలయ తరలింపుపై లేవనెత్తిన అంశాలు న్యాయ సమీక్షార్హం కాదని ప్రభుత్వం తన అఫిడవిట్లో పేర్కొంది. అభివృద్ధి ప్రణాళిక, వివిధ ప్రాజెక్టుల సమీక్షాధికారం రాష్ట్రానికి ఉందని తెలిపింది.
విభజన అంశాల్లో ఒకటైన ప్రత్యేక హోదా గురించి చెబుతూ.. హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా కేంద్రం వాగ్ధానం చేసిందని, అది ఇప్పటి వరకు అమలు కాలేదని అఫిడవిట్లో ఏపీ సర్కారు వెల్లడించింది. కేంద్రంతో జరిగే ప్రతి భేటీలోనూ హోదా గుర్తించి అడుగుతున్నామని తెలిపింది. రాష్ట్ర విభజనలో ప్రత్యేక హోదా అంశం అనేది అంతర్భాగమని పేర్కొంది. హోదా రానంత వరకు రాష్ట్ర విభజన ప్రక్రియ అసంతృప్తిగానే ఉంటుందని వివరించింది.
తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా చేయగా.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమరావతితోపాటు విశాఖపట్నం, కర్నూలును రాజధానులుగా ప్రకటించారు. అమరావతిలో అసెంబ్లీ భవనం, శాసనమండలి కొనసాగుతాయని, విశాఖపట్నంలో సచివాలయం ఉంటుందని, ఇక కర్నూలులో రాష్ట్ర హైకోర్టు ఉంటుందని ఏపీ సర్కారు తెలిపింది. అయితే, అమరావతి, విశాఖపట్నంలలో హైకోర్టు బెంచ్లు ఉంటాయని పేర్కొంది.