కేంద్రానికి మండలి రద్దు తీర్మానం: ఓటింగ్ వివరాలతో సహా: ఎన్నికల సంఘానికి ఏపీ నివేదిక..!
Recommended Video
ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. సోమవారం కేబినెట్ లో ఆమోదించటం..ఆ వెంటనే అసెంబ్లీలో ముఖ్యమంత్రి తీర్మానం..సభలో చర్చ.. చివరకు ఓటింగ్ ద్వారా తీర్మానం ఆమోదం..ఇలా మొత్తం వివరాలను అసెంబ్లీ సచివాలయం నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిక అందింది.
దీంతో..వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అంతే వేగంగా కేంద్రానికి ఈ మొత్తం వివరాలను పంపుతూ..తమ తీర్మానం ఆమోదించాలని..తదనుగుణంగా రాష్ట్రపతి నుండి ఆమోదం పొందేలా చూడాలని కోరుతూ లేఖలో అభ్యర్ధించారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నిర్ణయం..కార్యచరణ పూర్తి కావటంతో..మొత్తం వ్యవహారం కేంద్ర పరిధిలోకి వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం నుండి హోం శాఖ..న్యాయ శాఖ తో పాటుగా ఎన్నికల సంఘానికి పంపించింది. దీని పైన ఇప్పుడు కేంద్రం ఏ రకంగా స్పందిస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం..
ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఏపీ శాసనసభలో మండలి రద్దు తీర్మానం ఆమోదించింది. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను శాసనమండిలో సెలెక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకోవటం పైన ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో..ముఖ్యమంత్రి జగన్ ఏకంగా మండలి రద్దు దిశగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు అనుసరించాల్సిన విధానం మేరకు ముందుగా కేబినెట్ సమావేశమై మండలి రద్దుకు నిర్ణయించింది. ఆ తరువాత అసెంబ్లీ తీర్మానం ప్రతిపాదించి ఆమోదించారు. నిబంధనల మేరకు రెండో వంతు మెజార్టీ కావాల్సి ఉండటంతో..రికార్డు కోసం ఓటింగ్ నిర్వహించగా.. 133 మంది సభ్యులు మద్దతుగా ఓటింగ్ చేసారు. దీంతో..ఇక, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేయాల్సి ఉండటంతో.. శాసన మండలి రద్దు తీర్మానాన్ని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తూనే.. అందులో స్పష్టంగా జరిగిన పరిణామాలు..తమ అభ్యర్ధనలను స్పష్టం చేసింది.
కేంద్రంతో పాటుగా ఎన్నికల సంఘాలనికి
అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిన వెంటనే ప్రభుత్వం సూచనల మేరకు సోమవారం రాత్రే శాసనసభలో చేసిన తీర్మానం ప్రతితో పాటు ఓటింగ్ కు సంబంధిచిన వివరాలను బిల్లులకు సంబంధించిన అంశాలను శాసన సభ సచివాలయం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. శాసనసభలో చేసిన తీర్మానం ప్రతితో పాటు పాటు ఓటింగ్ కు సంబంధించిన వివరాలు, బిల్లులకు సంబంధిచిన వివరాలనూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన శాసనసభ సచివాలయం...సభలో చేసిన తీర్మాన వివరాలను అందులో పేర్కొంది.
దీంతో..రాష్ట్ర ప్రభుత్వం సైతం వేగంగా దీని పైన స్పందించింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన తీర్మానాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి.. హోం,..న్యాయశాఖలతో పాటు ఎన్నికల సంఘానికీ రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దీంతో.. ఇప్పుడు కేంద్రం దీని పైన ఏ రకంగా స్పందిస్తుందీ చూడాల్సి ఉంది. వీలైనంత త్వరగా తీర్మానం కేంద్రంలో సైతం ఆమోదం పొందేలా వైసీపీ ప్రయత్నాలు చేస్తోంది.
కేంద్రం వద్ద పది తీర్మానాలు పెండింగ్..
కేబినెట్ లో తీర్మానం చేసిన అనంతరం పార్లమెంటులో రాజ్యాంగ అధికరణ 169(1) ప్రకారం మండలి రద్దుకు కేంద్రం బిల్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన నివేదికను హోం.. న్యాయ శాఖలు పరిశీలించి కేంద్ర కేబినెట్ ముందు ఉంచుతారు. అక్కడ ఆమోదం పొందితే పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ప్రతిపాదిస్తారు.
రెండు సభల్లోనూ ఆమోదం పొందితే..తిరిగి న్యాయ శాఖ నుండి రాష్ట్ర పతికి సిఫార్సు చేస్తారు. రాష్ట్రపతి తుది ఆమోదంతో నోటిఫికేషన్ జారీ అవుతుంది. అప్పుడు అధికారికంగా ఏపీ మండలి రద్దు ప్రక్రియ పూర్తయినట్లుగా భావించాలి. అయితే, ప్రస్తుతం కేంద్రం వద్ద పది తీర్మానాలు పెండింగ్ లో ఉన్నాయని..దీనికి సంబంధించి కొద్ది రోజుల క్రితమే రాజ్యసభ స్టాండింగ్ కమటీ సభకు నివేదిక సమర్పించిందని నిపుణులు చెబుతున్నారు. దీంతో..ఒక వైపు కేంద్రం నుండి ఆమోదం లభించేలా వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. టీడీపీ మాత్రం రెండేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తోంది. దీంతో..కేంద్రంలో దీని పైన ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాలి.