ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్ సస్పెన్షన్: జగన్ కేసుల విచారణలో ఆయన ఇలా: చంద్రబాబు హాయంలో ఏపీకి..!
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో డిప్యుటేషన్ పైన పని చేస్తున్న ఐఆర్ఎస్ అధికారి కృష్ణకిశోర్ పైన సస్పెన్షన్ వేటు వేసింది. ఆయనతో పాటుగా పే అండ్ అకౌంట్స్ విభాగానికి చెందిన అకౌంట్స్ అధికారి శ్రీనివాసరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రజాధనం దుర్వినియోగంలో వీరిద్దరి పాత్ర ఉందని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలు సమర్పించింది.
పరిశీలించిన ప్రభుత్వం.. వీరిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. రిద్దరి మీద నమోదైన అభియోగాలపై తక్షణమే కేసు నమోదు చేసి ఆరు నెలల్లోగా దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలని ఏసీబీతో పాటుగా సీఐడీని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, గతంలో కృష్ణకిశోర్ పదేళ్ల కిందట వైఎస్ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్లో ఆర్థిక అక్రమాల విచారణ అధికారిగా పని చేసారు. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వంలో ఏపీకి డిప్యుటేషన్ పైన వచ్చారు.
కృష్ణకిశోర్ సస్పెన్షన్..ఏం చేసారంటే
ప్రజాధనం దుర్వినియోగం చేశారని, అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) అధికారి జె. కృష్ణకిశోర్ను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు గురువారం వేర్వేరు ఉత్తర్వులు జారీచేసింది. ప్రజాధనం దుర్వినియోగంలో పాత్ర ఉందని పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్య శాఖ ప్రభుత్వానికి వేర్వేరుగా నివేదికలు సమర్పించింది. పరిశీలించిన ప్రభుత్వం.. వీరిద్దరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నిబంధనావళి ప్రకారమే కృష్ణకిశోర్ను సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. క్రమశిక్షణ ప్రక్రియ ముగిసే వరకూ ఆయన సస్పెన్షన్ కొనసాగుతుందని.. శ్రీనివాసరావు సస్పెన్షన్కు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని తెలిపింది. వీరిద్దరి మీద నమోదైన అభియోగాలపై తక్షణమే కేసు నమోదు చేసి ఆరు నెలల్లోగా దర్యాప్తు ప్రక్రియ పూర్తిచేయాలని ఏసీబీ, సీఐడీ ని ప్రభుత్వం ఆదేశించింది. కేసు దర్యాప్తు ప్రక్రియ పూర్తయ్యే వరకూ ప్రభుత్వ అనుమతిలేనిదే వారివురూ అమరావతిని వీడరాదని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
జగన్ కేసుల విచారణలో ఆయన ఇలా
ఐఆర్ఎస్ అధికారి అయిన కృష్ణకిశోర్ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపికి డిప్యుటేషన్ పైన వచ్చారు. అంతకు ముందు ఆయన పదేళ్ల కిందట వైఎస్ జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్లో ఆర్థిక అక్రమాల విచారణ అధికారిగా పని చేసారు. కృష్ణ కిశోర్ 2009లో ఆదాయపు పన్ను శాఖలో హైదరాబాద్ రేంజ్-2 అదనపు కమిషనర్గా ఉన్నారు. ఆయనకంటే పై హోదాలో కమిషనర్, చీఫ్ కమిషనర్ ఉంటారు. అప్పట్లో... జగతి పబ్లికేషన్స్ సంస్థ 10 రూపాయల ముఖ విలువ ఉన్న షేరును... రూ.370 చొప్పున విక్రయించింది. అంటే... ఒక్క షేరుకు రూ.360 ప్రీమియం! ఈ లావాదేవీ సక్రమంగానే జరిగిందా అనే విషయం తేల్చాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) హైదరాబాద్ రేంజ్-2 ఐటీ అధికారులకు ఫైలు పంపింది. ఈ బాధ్యతను అదనపు కమిషనర్గా ఉన్న జాస్తి కృష్ణ కిశోర్కు అప్పగించారు. ఆయన దీనిపై లోతుగా విచారణ జరిపారు.
జగతి పెట్టుబడులు అక్రమం అంటే తేల్చారు
కృష్ణకిశోర్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) విచారణ అధికారిగా జగతి పబ్లికేషన్స్కు ఉన్న ఆస్తులు సున్నా.. ఆదాయమూ సున్నా.. ఇలాంటి కంపెనీ షేరును రూపాయికి కూడా కొనరని తన నివేదిక లో తేల్చారు. ఈ షేరును రూ.370కి కొనడం అసాధారణమని తెలిపారు. ఈ షేర్లు కొన్న వారంతా వైఎస్ సర్కారు హయాంలో పలుమార్గాల్లో లబ్ధి పొందిన వారే అని కూడా గుర్తించారు. దీనిని ‘క్విడ్ ప్రోకో'గా నిర్ధారించారు. షేర్ల విక్రయం ద్వారా జగతి సమకూర్చుకున్న సొమ్మును ఇతర మార్గాల్లో ఆదాయం (ఇన్కమ్ ఫ్రం అదర్ సోర్సె్స)గా పరిగణించి రూ.325 కోట్ల పన్ను చెల్లించాలని నివేదించారు. ఈ లావాదేవీపై సవివరమైన నివేదికను సీబీడీటీకి పంపించారు. దీనిపై జగతి పబ్లికేషన్స్ సీఐటీ అప్పీల్కు వెళ్లారు. నివేదిక పక్కాగా ఉందని, రూ.325 కోట్ల చెల్లించాల్సిందేనని సీఐటీ తెలిపింది. జగతి సంస్థ ఈ ఆదేశాలపై తిరిగి ఐఐసీటీకి అప్పీలుకు వెళ్లింది. అక్కడ ఈ సంగతి ఇంకా పెండింగ్ లో ఉంది. దీనిని సీబీఐ కూడా పరిగణనలోకి తీసుకుంది. దీనిని మరింత లోతుగా విశ్లేషించి, దర్యాప్తు జరిపి... జగన్ అక్రమాస్తుల కేసుల్లో అభియోగాలు నమోదు చేసింది.
చంద్రబాబు హయాంలో..
ఐఆర్ఎస్ అధికారిగా కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న కృష్ణకిశోర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్న సమయంలో డిప్యుటేషన్ మీద ఏపీకి వచ్చారు. ఆయన ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు సీఈవోగా కృష్ణ కిషోర్ పని చేశారు. ఇక, ఏపీలో ప్రభుత్వం మారిన తరువాత కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం ఆయన ప్రజాధనం దుర్వినియోగం చేసారనే కారణంతో సస్పెండ్ చేసింది. కొద్ది రోజుల క్రితం ఇదే కేడర్ (ఐఆర్ఎస్) కు చెందిన వెంకయ్య చౌదరి సైతం ఏపీ నుండి తిరిగి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఏపీ ప్రభుత్వం నుండి కాకుండా ఆయన డీమ్డ్ టు బి రిలీవ్ ఉత్తర్వులతో రిలీల్ అయ్యారు. ఆ సమయంలో ఇద్దరు అధికారులు సస్పెండ్ కు గురయ్యారు. ఇప్పుడు వారి పైన ప్రభుత్వం ఆ సస్పెన్షనత్ ఎత్తివేసింది.