ఏపీలో సీఎంఆర్ఎఫ్ చెల్లింపులకు బ్రేక్- రూ.117 కోట్ల స్కాం ప్రయత్నంపై ఏసీబీ దర్యాప్తు..
ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రాష్ట్రంలో బాధితులు, నిరుపేదలకు చేసే సాయాన్ని అడ్డుపెట్టుకుని రూ.117 కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు జరిగిన కుట్రపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు, సంస్ధలకు లబ్ది చేకూరే విధంగా చోటు చేసుకున్న కుట్రపై సీఎం జగన్ ఏసీబీ దర్యాప్తుకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరున్నా వదిలిపెట్టొద్దని ఆయన ఆదేశాలు జారీ చేశారు. దీంతో బాధితుల పేరుతో కోట్లు కొల్లగొట్టేందుకు జరిగిన కుట్రపై అధికారులు దృష్టిసారించారు. తుళ్లూరు పీఎస్లో రెవెన్యూ శాఖ అధికారులు నమోదు చేసిన కేసు ఆదారంగా దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో అన్ని సీఎంఆర్ఎఫ్ చెల్లింపులను నిలివివేశారు.
సీఎంఆర్ఎఫ్ చెల్లింపుల స్కాం...
ఏపీలో ఏకంగా ముఖ్యమంత్రి సహాయ నిధికే నకిలీ చెక్కులను సృష్టించి రూ.117 కోట్ల రూపాయలు కొల్లగొట్టేందుకు భారీ కుట్ర జరిగింది. గుర్తు తెలియని కొందరు సీఎంఆర్ఎఫ్ పేరుతో భారీగా నకిలీ చెక్కులు సృష్టించి వాటిపై ఫోర్జరీ సంతకాలు చేసి, నకిలీ స్టాంపులు వేసి ఇతర రాష్ట్రాల్లోని బ్రాంచ్ల ద్వారా కోట్ల రూపాయలు డ్రా చేసుకునేందుకు కుట్ర పన్నారు. ఇందులో రూ.45 వేల రూపాయల చొప్పున ఇచ్చిన రెండు చెక్కులను లబ్దిదారులు నగదుగా మార్చుకున్నారు. మరో రూ.16 వేల రూపాయల చెక్కు నగదుగా మారాల్సి ఉంది. ఈ చెక్కుల స్ధానంలో మరో మూడు నకిలీ చెక్కులు సృష్టించి ఢిల్లీ, బెంగళూరు, కోల్కతాలోని ఎస్బీఐ బ్రాంచ్ల్లో వరుసగా రూ.39.85 కోట్లు, రూ.52.65 కోట్లు, రూ.24.55 కోట్లు డ్రా చేసేందుకు నిందితులు ప్రయత్నించడంతో ఈ వ్యవహారం బయటపడింది.
కుట్ర బయటపడిందిలా..
సీఎంఆర్ఎఫ్ కింద ఇచ్చే మొత్తాలు వేలల్లో లేదా లక్షల్లోనే ఉంటాయి. అందులోనూ భారీ మొత్తాలైతే నేరుగా సీఎం అనుమతి తప్పనిసరి. కానీ నిందితులు ఏకంగా కోట్ల రూపాయల నకిలీ చెక్కులు సృష్టించి అందులోనూ ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు ఎస్బీఐ బ్రాంచ్ల్లో వీటిని డ్రా చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆయా బ్రాంచ్ల అధికారులు అనుమానంతో ప్రభుత్వం చెక్కులు జారీ చేసే అమరావతిలోని వెలగపూడి సచివాలయం ఎస్బీఐ బ్రాంచ్ ను సంప్రదించారు. దీంతో వారు అవాక్కయ్యారు. వెంటనే అప్రమత్తమై చెక్కుల చెల్లింపులు నిలుపుదల చేసేశారు. దీంతో కోట్ల రూపాయలు డ్రా కాకుండా నిలువరించినట్లయింది.
జగన్ సీరియస్-ఏసీబీ దర్యాప్తు...
ఏకంగా ముఖ్యమంత్రి సహాయనిధి పేరుతోనే నకిలీ చెక్కులు సృష్టించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టేందుకు ప్రయత్నించిన వారిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు. వెంటనే కేసులు నమోదు చేసి ఏసీబీ దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. ప్రాధమికంగా తుళ్లూరు పీఎస్లో రెవెన్యూ శాఖ అధికారులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో రెండు కంపెనీల పేరుతో ఈ చెక్కులు తయారు చేసినట్లు గుర్తించారు. వీటిలో అద్విత వీకే హాలో బ్లాక్స్ అండ్ ఇంటర్ లాక్స్, మల్లబ్పూర్ ప్రజా గ్రామీణ అభివృద్ధి సొసైటీ పేరుతో ఇవి తయారు చేశారు. వీటి చిరునామాలు గుర్తించే ప్రయత్నం సాగుతోంది. మరోవైపు సీఎం ఆదేశాలతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి ఈ వ్యవహారంపై ఏసీబీ దర్యాప్తు కోరుతూ డైరెక్టర్ జనరల్కు లేఖ రాశారు. దీంతో ఏసీబీ కేసు నమోదుకు సిద్ధమవుతోంది.
Recommended Video
సీఎంఆర్ఎఫ్ చెల్లింపుల నిలిపివేత..
సీఎంఆర్ఎఫ్ పేరుతో రూ.117 కోట్లు కొల్లగొట్టేందుకు జరిగిన కుట్ర దర్యాప్తులో భాగంగా అధికారులు వెలగపూడి ఎస్బీఐ బ్రాంచ్లోని సీఎంఆర్ఎఫ్ అకౌంట్ హ్యాక్ అయిందని భావిస్తున్నారు. హ్యాక్ చేయడం ద్వారానే ఈ చెక్కులు తయారు చేశారని, వాటిని నగదుగా మార్చుకునేందుకు నిందితులు ప్రయత్నించారని అంచనా వేస్తున్నారు. అందుకే తాత్కాలికంగా సీఎంఆర్ఎఫ్ చెల్లింపులను నిలిపిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి సీఎంఆర్ఎఫ్ అకౌంట్ను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ వెలగపూడి ఎస్బీఐ బ్రాంచ్ అధికారులకు లేఖ పంపారు. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ ఏపీలో సీఎంఆర్ఎఫ్ చెల్లింపులు నిలిచిపోనున్నాయి.