బీజేపీ నేత మెప్పు కోసం..ఇలా : ప్రైవేటు వ్యక్తికి కీలక హోదా : జగన్ సర్కార్ వివాదస్పద నిర్ణయం..!
ఏపీ ప్రభుత్వ ఈ మధ్య కాలంలో హడావుడిగా చేసిన ఓ నియామకం ఇప్పుడు ఢిల్లీలో చర్చనీయాంశంగా మారింది. ఒక ప్రయివేటు వ్యక్తికి ముఖ్యకార్యదర్శి హోదాలో సలహాదారు పదవని కట్టబెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు జీవోలో స్పష్టం చేసారు. ఇప్పుడు ఈ నిర్ణయం వివాదాస్పదమైంది. కేంద్రంలో కీ రోల్ పోషిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ నేత సతీమణికి ఈ పోస్టింగ్ ఇచ్చారు. ఆ బీజేపీ నేతను ప్రసన్నం చేసుకోవటానికే ఇలా చేసారా అనే చర్చ మొదలైంది. అయితే ఆ వ్యక్తి తెలంగాణలో ఒక కీలక ప్రాజెక్టుకు సహకరించాని చెబుతున్నారు. ఇప్పుడు ఏపీలోనూ ఆయన అవసరం గుర్తించి..ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బీజేపీ 164, శివసేన 124 స్థానాల్లో పోటీ, ఎట్టకేలకు మరోసారి పొడిసిన పొత్తు
జగన్ సర్కారు వివాదాస్పద నిర్ణయం
ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఢిల్లీలో ఒక ప్రయివేటు వ్యక్తికి ముఖ్య కార్యదర్శి హోదాలో సలహాదారు పదవిని కట్టెబెట్టింది. వైద్యురాలిగా ఉన్న డాక్టర్ చేకుపల్లి శిల్పకు ఆరోగ్య సలహాదారు పేరుతో పదవిని ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పటికీ ఆ పదవి కింద అందే జీత భత్యాల గురించి ఆ జీవోలో ప్రస్తావించ లేదు. నామినేటెడ్ పదవిలో ఐఏయస్ అధికారి నిర్వహించే హోదాతో సమానంగా ఈ నియమాకం జరిగింది. అందులోనూ ముఖ్య కార్యదర్శితో సమాన హోదా ఇవ్వటం గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. వైసీపీకి సంబంధం లేని తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ డాక్టర్ కు పదవి కట్టబెట్టటం వెనుక అసక్తి కర చర్చ సాగుతోంది.
వెదిరె శ్రీరామ్ సతీమణి కావటంతోనేనా..
ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం వెనుక అధికారుల నుండి ఆసక్తి కర సమాచారం అందుతోంది. ప్రభుత్వం పదవి కట్టబెట్టిన డాక్టర్ చేకుపల్లి శిల్ప కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలో సలహాదారుగా ఉన్న బీజేపీ నేత వెదిరె శ్రీరామ్రెడ్డి సతీమణి కావడం వల్లే ఈ నియామకం జరిగిందని చెబుతున్నారు. వెదిరె శ్రీరామ్ నదుల అనుసంధానం, నదుల నిర్వహణ, గంగా పరిశుద్ధత, నీటి పారుదల ప్రాజెక్టులు తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సలహాదారుగా పని చేస్తున్నారు. ఏపీలో ప్రాజెక్టుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వంలో ఆయనతో ఉన్న అవసరాలను పరిగణలోకి తీసుకొని..ఆయన్ను ముందుగానే ప్రసన్నం చేసుకొనే క్రమంలో భాగంగానే ఈ పదవి కేటాయించారని..అందునా పార్టీ ముఖ్య నేత విజయ సాయిరెడ్డి సిఫార్సు మేరకే ఇది జరిగినట్లుగా తెలుస్తోంది.
ఆయనను ప్రసన్నం చేసుకొనేందుకేనా..
వెదిరె శ్రీరాం కేంద్రంలో కీలక పదవిలో ఉన్నందువల్లే డాక్టర్ శిల్పను సలహాదారుగా నియమించినట్లు చెబుతున్నారు. కేంద్రంలో శ్రీరామ్కు కేబినెట్ హోదా లేకపోవడంతో ఆయనకు నివాస వసతి కల్పించే ఉద్దేశంతో డాక్టర్ శిల్పను సలహాదారుగా నియమించినట్లు మరో వాదన. ఆమెకు ఢిల్లీలో ప్రభుత్వ క్వార్టర్ కేటాయించేందుకు కూడా అవసరమైన విధంగా ఫైలు సిద్దం అవుతున్నట్లుగా సమాచారం. పోలవరం, నదుల అనుసంధానం వంటి అనేక విషయాలు కేంద్ర జలశక్తి శాఖ పరిశీలనలో ఉన్నాయి. అక్కడ కీలకమైన వెదిరె శ్రీరామ్ను అనుకూలంగా మార్చుకునేందుకే డాక్టర్ శిల్ప నియామకం జరిగిందని ప్రచారం జరుగుతోంది. గతంలో కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల విషయంలో కూడా శ్రీరామ్ తెలంగాణ ప్రభుత్వానికి తగిన తోడ్పాటునందించారని ప్రచారం లో ఉంది. అయితే..తెలంగాణ ప్రాంతానికి చెందిన డాక్టర్ కు ఢిల్లీలో పదవి ఇవ్వటం...ఇప్పుడు వివాదాస్పద నిర్ణయంగా మారింది.