ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎల్వీపై బదిలీ వేటు: సీఎంఓ అధికారికి నోటీసు ఎఫెక్ట్: ప్రభుత్వంలో కలకలం..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసారు. ఆయన స్థానంలో సీసీఎల్ఏ నీరభ్ కుమార్ ప్రసాద్ కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న వ్యక్తిని బదిలీ చేయటం అనేది అరుదైన అంశం. సాధారణంగా పాలన జరుగుతున్న సమయంలో పాలనా వ్యవస్థకు కేంద్ర మైన సీఎస్ ను పదవీ కాలం ముగియకుండానే బదిలీ చేయటం అంత సులువు కాదు.
ప్రత్యక సందర్భాల్లో మినహా ఇటువంటి నిర్ణయం తీసుకోలేరు. అయితే, కొంత కాలంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం..అదే విధంగా సీఎంఓ అధికారుల మధ్య కొంత గ్యాప్ కనిపిస్తోంది. తాజాగా..సాధారణ పరిపాలనా శాఖ ముఖ్యకార్యదర్శిగా ఉంటూ ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ కు సీఎస్ నోటీసు జారీ చేసారు.
ఈ వ్యవహారం పైన సీఎం ఆగ్రహం తో ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకోవాలి కానీ..ఇలా నోటీసులు ఇవ్వటం ద్వారా ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా సీఎస్ వ్యవహరించారనే అభిప్రాయంతో ఉన్నట్లుగా సమాచారం. దీంతో..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎస్ పైన బదిలీ వేటు..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం పైన బదిలీ వేటు వేస్తూ ఏపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. గత మార్చిలో ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా ఉన్న అనీల్ చంద్ర పునీఠాను తప్పించి ఎల్వీ సుబ్రమణ్యంకు బాధ్యతలు అప్పగించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత సైతం ఎల్వీనే కొనసాగించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఎన్నికల సమయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు..ఎల్వీ మధ్య అధికార విధుల విషయంలో వివాదాలు చోటు చేసుకున్నాయి.
జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సీఎస్ గా ఉన్న ఎల్వీ పైన ముఖ్యమంత్రి సదాభిప్రాయంతోనే ఉన్నారు. అయితే, సీఎం కార్యాలయంలోని కొందరు అధికారులు..సీఎస్ మధ్య కొంత గ్యాప్ ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో కొద్ది రోజులుగా సీఎస్ కొందరు అధికారుల వద్ద తన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా చెబుతున్నారు.
సీఎం కార్యదర్శికి నోటీసు ఇవ్వటం పైన ఆగ్రహం
రెండు రోజుల క్రితం సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ కు షోకాజ్ నోటీసు జారీ చేసారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు..అదేశాల అమలు విషయంలో బిజినెస్ రూల్స్ మారుస్తూ ప్రవీణ్ ప్రకాశ్ జీవో జారీ చేసారు. సీఎస్ కు సమాచారం లేకుండా జారీ చేసారని..నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ప్రవీణ్ ప్రకాశ్ మీద ఆరోపణ. ఇక, వైఎస్ఆర్ లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుల ఫైలును కేబినెట్ అజెండాలో పొందుపరిచేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ప్రవీణ్ ఫైలు పంపారు.
అయితే, ఆ ఫైలుకు ఆర్థిక శాఖ ఆమోదం తీసుకుని తిరిగి పంపాలని ఆదేశిస్తూ సీఎస్ వెనక్కి పంపారు. కానీ, అవేమీ పాటించకుండా ఆ ఫైలును ప్రవీణ్ ప్రకాశ్ నేరుగా కేబినెట్ ముందు ప్రవేశపెట్టాడు. బిజినెస్ రూల్స్లోని రూల్ 7(2) ప్రకారం.. సెక్రటరీ ఒక ఫైలుపై సంబంధిత శాఖ నుంచి తప్పనిసరిగా ఆమోదాలు తీసుకోవాలి. వైఎస్సార్ లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ అవార్డుల ఫైలుకు ఆర్థిక శాఖ ఆమోదం తీసుకోలేదు.
పైగా దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టమైన సూచనలు ఇచ్చినా... ఆ ఆదేశాలను పట్టించుకోకుండా నేరుగా ఆ ఫైలును కేబినెట్ ముందు ప్రవేశ పెట్టారు. మంత్రివర్గ సమావేశంలో గ్రామన్యాయాలయాల ఫైలు పెట్టాలని న్యాయశాఖకు ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆదేశాలు అందాయి. ఆ ఫైలుపై సీఎం సంతకం కూడా జరిగిపోయింది. దీనికి సంబంధించిన మెమోను జీఏడీలోని కేబినెట్ విభాగానికి అందజేశారు. అయినప్పటికీ గత నెల 16వ తేదీ, 30వ తేదీ ల్లో జరిగిన కేబినెట్ సమావేశాల్లో గ్రామ న్యాయాలయాల ప్రతిపాదన ఫైలును ప్రవేశపెట్టడంలో ప్రవీణ్ ప్రకాశ్ విఫలమయ్యారని నోటీసులో పేర్కొన్నారు.
నోటీసు జారీ పర్యవసానమేనా..
ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉన్న అధికారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసు ఇవ్వటం..దీని పైన పెద్ద ఎత్తున చర్చ జరగటం పైన ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమస్యలు ఉంటే అధికారులు చర్చించి పరిష్కరించుకోవాలని కానీ..ఇలా సీఎంఓ కార్యదర్శికే లేఖ ఇవ్వటం సరి కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ఫలితంగా ఎల్వీ సుబ్రమణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తప్పించాలని నిర్ణయించారు. ఆయనను ఏపీ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇనిస్టిట్యూట్ డీజీగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఇక, కొత్త సీఎస్ వచ్చే వరకూ నీరభ్ కుమార్ ప్రసాద్ ఆ హోదాలో కొనసాగుతారు. కొత్తగా సీఎస్ రేసులో నీలం సహానీ..శమీర్ శర్మ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
సీఎం ఆగ్రహం వెనుక..
జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఎల్వీ సుబ్రమణ్యం ఆయన పదవీ విరమణ చేసే వరకూ అదే హోదాలో కొనసాగుతారంటూ అభయం ఇచ్చారు. 2020 ఏప్రిల్ లో ఆయన రిటైల్ అవ్వాల్సి ఉంది. ఆయన పదవీ విరమణ చేసిన తరువాత కూడా ఆయన సేవలు వినియోగించుకోవాలని తొలుత జగన్ భావించారు. అయితే, కొద్ది రోజులుగా ఎల్వీ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోందని కొందరు అధికారులు చెబుతున్నారు.
స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షలకు సైతం సరిగ్గా హాజరు కాకపోవటం..సీఎంఓ ఆదేశాల మీద ఉదాసీనంగా వ్యవహరించటం వంటి వాటి పైన సీఎం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆకస్మికంగా బదిలీ చేయటం పైన అటు అధికారిక వర్గాల్లోనూ..ఇటు రాజకీయంగానూ చర్చ సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.