జగన్ కోటరీలో కొత్త అడ్వైజర్... ఆ సాయానికి ప్రతిఫలంగా.. వైసీపీ ఇమేజ్ పెంచే బాధ్యత ఆయనకే..!
ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ రమాకాంత్ రెడ్డికి కీలక పదవి కట్టబెట్టనున్నట్లు సమచారం. తన తండ్రి వైయస్ హయాంలో పనిచేసిన రమాకాంత్ రెడ్డికి సీఎం జగన్ ఎలాంటి పదవిలో కూర్చోబెట్టనున్నారు...? ప్రభుత్వం ఇమేజ్ను రమాకాంత్ రెడ్డి మరో లెవెల్కు తీసుకెళుతారా..? ఇంతకీ ఏంటా పదవి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డికి కీలక పదవి
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన తండ్రి వైయస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీఎస్గా పనిచేసిన రమాకాంత్ రెడ్డికి కీలక బాధ్యతలు అప్పచెప్పేందుకు రంగం సిద్ధం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన ఉమ్మడి ఏపీ సీఎస్గా పనిచేశారు. ఇక వైయస్సార్ ఆకస్మిక మరణం తర్వాత రోశయ్య ఏపీకి సీఎం అయ్యారు. ఆయన హయాంలో కొంతకాలం సీఎస్గా పనిచేశారు రమాకాంత్ రెడ్డి. ఇక సీఎస్గా పదవీవిరమణ పొందిన తర్వాత ఆయన ఉమ్మడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పని చేశారు. ఉమ్మడి ఏపీలో పలు శాఖల్లో పని చేసిన అనుభవం రమాకాంత్ రెడ్డికి ఉంది.
ఎన్నికల కమిషనర్ వ్యవహారంలో కీలక సూచనలు..?
ఇక జగన్ కేసుల్లో రమాకాంత్ రెడ్డి మద్దతుగా నిలిచారనే చెప్పాలి. పలు సందర్భాల్లో ఆయన జగన్ కేసులకు సంబంధించి ప్రస్తావిస్తూ పరోక్షంగా మద్దతు తెలుపుతూ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ మధ్యకాలంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వర్సెస్ జగన్ సర్కార్గా వార్ మారడంతో మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేసినట్లు సమాచారం. ఆయన సూచనల మేరకే ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందని వార్తలు వచ్చాయి. హైకోర్టు జడ్జిగా ఉన్నవారికే ఎస్ఈసీ పదవి కట్టబెట్టేలా ఆర్డినెన్స్ తీసుకురావడంలో రమాకాంత్ రెడ్డి జగన్ ప్రభుత్వానికి సలహాలు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది.
ప్రతిష్టాత్మకంగా మారిన పోలవరం ప్రాజెక్టు
ఇక పాలనాపరంగా ఉమ్మడి ఏపీకి సంబంధించి సుదీర్ఘ అనుభవం ఉండటంతో రమాకాంత్ రెడ్డికి జగన్ కీలక పదవి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. ఏపీకి కీలకంగా మారిన పోలవరం ప్రాజెక్టుకు సలహాదారుడిగా నియమించే అవకాశాలున్నట్లు అమరావతిలో వార్త ప్రచారం జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరతగతిన పూర్తి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకోసం రమాకాంత్ రెడ్డి సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆయన పర్యవేక్షణలో పోలవరం నిర్మణం అడుగులు వేగంగా ముందుకు పడతాయని భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయన్ను పోలవరంకు సలహాదారుడిగా నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు సమాచారం.
Recommended Video
వైసీపీ ప్రభుత్వం ఇమేజ్ రమాకాంత్ రెడ్డి చేతుల్లోనే..
ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలో చాలా కీలక పదవుల్లో తెలంగాణకు చెందిన వ్యక్తులే ఉన్నారు. ఇటు సీఎంఓలో కానీ ఇతరత్ర నామినేటెడ్ పదవుల్లోకానీ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. ఇక అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు రమాకాంత్ రెడ్డిని సలహాదారుడిగా ప్రభుత్వం నియమిస్తే తెలంగాణ ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కీలక పదవి కట్టబెట్టినట్లు అవుతుంది. ఇదిలా ఉంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ కేంద్ర కార్యాలయంలో సాంకేతిక న్యాయ సలహాదారు(టెక్నో లీగల్ కన్సల్టెంట్) హెచ్కే సాహును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధుల నుంచి రెండు రోజుల క్రితం తొలగించింది. వైసీపీ ప్రభుత్వం ఇమేజ్ పెంచే పోలవరం ప్రాజెక్టు సలహాదారుడి బాధ్యతలు అప్పగించడం ద్వారా ఇప్పుడు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత సైతం ఆయన మీద పడింది.