సుప్రీంకు ఏపీ ప్రభుత్వం: రమేష్ కుమార్ నిర్ణయంపైన అదే మార్గం: ఎన్నికలు కొనసాగించేలా..!
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా నిర్ణయం పైన సుప్రీంను ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని పైన ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు ప్రభుత్వం తీసుకుంటోంది. తమతో ఎటువంటి సంప్రదింపులు లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికలను వాయిదా వేయటం పైన ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు ప్రయోజనాల కోసమే ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పని చేస్తున్నారంటూ మండిపడ్డారు. దీంతో..ఆయన తీసుకున్న నిర్ణయాలు అమలు చేయకుండా న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నేరుగా గవర్నర్ వద్దకు వెళ్లి ఎన్నికల కమిషనర్ పైన ఫిర్యాదు చేసారు. ఈ రోజు రమేష కుమార్ గవర్నర్ ను కలిసి వివరణ ఇవ్వనున్నారు. ఇదే సమయంలో ఎన్నికలను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటీషన్..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉద్దేశపూర్వక చర్యలు అమలు కాకుండా..సుప్రీంను ఆశ్రయించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను యథావిధిగా కొనసాగించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం వల్ల రాష్ట్రానికి నష్టం తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల ప్రక్రియ ఈనెల 31లోగా ముగించకపోతే.. స్థానిక సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లకు పైగా రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉందనే వాదన సుప్రీం ముందు వినిపించే అవకాశం ఉంది.
నిధుల విడుదలకు ఎన్నికల వాయిదా సాకు...
ఎన్నికలు యధావిధిగా జరిగేలా చూడటం..లేదా కేంద్రానికి నిధుల విడుదలకు ఎన్నికలు కారణంగా చెప్పవద్దని కేంద్రానికి సూచన చేయటం ఇందులో ప్రధాన అంశంగా పిటీషన్ లో పేర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఈ నెలాఖరుకు షెడ్యూల్ ప్రకారం ముగిస్తే.. పాలన మరింత బలపడుతుందన్న అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లనుంది. వ్యాధుల నివారణలో స్థానిక సంస్థల పాత్ర కీలకమని, ఆ సంస్థల్లోని ప్రజా ప్రతినిధుల ద్వారా మరింత సమర్థవంతంగా వైరస్ల నియంత్రణ కార్యక్రమాలు చేపట్టవచ్చని కోర్టుకు ప్రభుత్వం నివేదించనుంది.
Recommended Video
సాయిరెడ్డి వ్యాఖ్యల పరమార్ధం అదే..
ఎన్నికల వాయిదాపై ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని పైన తీవ్రంగా స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం అప్రజాస్వామికమని, దీన్ని తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు ఆ హోదాను దుర్వినియోగం చేస్తే శిక్షించే అధికారం న్యాయస్థానానికి మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా కేంద్రానికి, గవర్నర్కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉందనే సంకేతాలిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ వ్యవస్థను ఖూనీ చేసిన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకర వ్యక్తి అని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయం అమలు కాకుండా అన్ని స్థాయిలో పోరాటం చేయాలనేది ఇప్పుడు ఏపీ ప్రభుత్వ ఆలోచనగా సాయిరెడ్డి వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది.