రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ- మూడు నెలల బడ్జెట్ ఆమోదిస్తూ ఆర్డినెన్స్ ..
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన ఏపీ కేబినెట్ రేపు ఉదయం 11 గంటలకు భేటీ కాబోతోంది. కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే పరిస్దితి లేకపోవడంతో దానికి బదులుగా ఆర్డినెన్స్ తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేపటి కేబినెట్ భేటీలో మూడునెలల బడ్జెట్ కు ఆమోదం తెలుపుతూ ఆమోద ముద్ర వేసే అవకాశముంది. దీంతో రాబోయే మూడు నెలల పాటు నిధుల విడుదలలో జాప్యం జరగదు.
రేపు ఏపీ కేబినెట్ భేటీ..
ఏపీలో స్ధానిక సంస్ధల ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు సమావేశమైన కేబినెట్.. ఆ తర్వాత ఇప్పటివరకూ మళ్లీ సమావేశం కాలేదు. అయితే కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ సాధ్యం కాదని తేలిపోవడంతో ఇక ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.. ఇందులో కీలకమైన ఆర్డినెన్స్ మార్గాన్ని ప్రభుత్వం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 11 గంటలకు వెలగపూడి సచివాలయంలో జరిగే కేబినెట్ భేటీలో తాత్కాలిక బడ్జెట్ ఆర్డినెన్స్ కు ప్రభుత్వం ఆమోద ముద్ర వేయనుంది.
బడ్జెట్ పై ఆర్డినెన్స్ ఎందుకంటే..
వాస్తవానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనుకున్నట్లు జరిగితే ఆర్డినెన్స్ అవసరం ఉండదు. కానీ స్ధానిక సంస్ధల కారణంగా పలుమార్లు వాయిదా పడిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్.. ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ నిర్వహించే పరిస్దితికి వచ్చింది. చివరికి కరోనా కారణంగా రాష్ట్రంలో లాక్ డౌన్ విధించడంతో ప్రజాప్రతినిధులు నియోజకవర్గాలు దాటి కదల్లేని పరిస్దితి. అలాగని బడ్జెట్ ప్రవేశపెట్టకుండా తప్పించుకుంటే ఏప్రిల్ 1 నుంచి నిధుల లభ్యత ఉండదు. దీంతో ప్రత్యామ్నాయ మార్గంగా ఆర్డినెన్స్ తెరపైకి వచ్చింది. రేపటి కేబినెట్ భేటీలో మూడు నెలల బడ్డెట్ కు ఆమోదం తెలుపుతూ ఆర్డినెన్స్ తీసుకువస్తే నిధులను వాడుకునేందు వీలుంటుంది.
Recommended Video
కేబినెట్ సమావేశం వేదిక మార్పు- సామాజిక దూరం..
కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ఏపీ సచివాలయంలో ఎప్పుడూ కేబినెట్ సమావేశం నిర్వహించే వేదికను మొదటి బ్లాక్ నుంచి ఐదో బ్లాక్ కాన్ఫరెన్స్ హాలుకు మార్చారు. ఇందులో ఎక్కువ మంది విశాలంగా కూర్చుకునేందుకు వీలున్నందున మంత్రివర్గ సమావేశం ఇక్కడ నిర్వహిస్తే బావుంటుందన్న అధికారుల సూచన మేరకు వేదిక మార్చినట్లు తెలుస్తోంది. అలాగే మొన్నటి కేంద్ర కేబినెట్ సమావేశం తరహాలోనే ఏపీ కేబినెట్ భేటీలోనూ సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వం భావిస్తోంది.