ప్రభుత్వానికి నేడే అసలు పరీక్ష: మండలిలో గండం గట్టేక్కేదెలా: బిల్లు టీడీపీ అడ్డుకుంటే..!
జగన్ ప్రభుత్వానికి నేడే అసలు పరీక్ష. మూడు రాజధానుల వ్యవహారం పైన ముందు నుండి చెబుతున్నట్లుగానే..బిల్లు తీసుకొచ్చింది. అసెంబ్లీలో తమకున్న మెజార్టీతో ప్రతిపక్షాన్ని పూర్తిగా డామినేట్ చేస్తూ.. ముఖ్యమంత్రి సుదీర్ఘ వివరణ తరువాత అసెంబ్లీలో రెండు బిల్లులను ఆమోదించారు. మూడు రాజధానులు వద్దని ప్రతిపక్ష నేత చంద్రబాబు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రికి చేతులు జోడించి వేడుకున్నారు. సీఎం జగన్ సుదీర్ఘ సమాధానం ఇచ్చారు. అమరావతిని రాజధానిగా రద్దు చేయటం లేదని స్పష్టత ఇచ్చారు. ఇక, ఇదే సమయంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ బిల్లులు ఈ రోజు మండలి ముందు కు రానున్నాయి. అక్కడ టీడీపీదే సంఖ్య పరంగా ఆధిపత్యం. బిల్లును అడ్డుకు తీరుతామని టీడీపీ చెబుతోంది. ప్రభుత్వం సైతం తమ వ్యూహాలు తమకు ఉన్నాయని..బిల్లుల ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది లేదని ధీమా వ్యక్తం చేస్తోంది. దీంతో..ఈ రోజు మండలిలో జరిగే పరిణామాలపైనే అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
అలా అయితే ఢిల్లీని కూడా మార్చాలి, చంద్రబాబు.. మోడీకి లేఖ రాయండి, అసెంబ్లీలో సీఎం జగన్
నేడు మండలి ముందుకు బిల్లులు..
ఏపీ ప్రభుత్వం పక్కా వ్యూహాత్మకంగా ముందుగా సిద్దం చేసిన ప్రణాళిక ప్రకారం మూడు రాజధానులు..సీఆర్డీఏ చట్టం బిల్లులకు శాసనసభలో ఆమోదం పొందేలా చేసింది. కేబినెట్ సమావేశంలో ఆమోదం.. ఆ వెంటనే శాసనసభలో బిల్లు ప్రవేశ పెట్టింది. సుదీర్ఘ చర్చ తరువాత ముఖ్యమంత్రి సైతం తన ఆలోచన వెనుక ఉద్దేశాలను వివరించారు. రాత్రి శాసనసభలో బిల్లులకు ఆమోదం లభించింది. ఇక, ఆ రెండు బిల్లు లు ఈ రోజు శాసన మండలి ముందుకు రానున్నాయి. మండలిలో టీడీపీ సంఖ్యా పరంగా బలంగా ఉంది. మూడు రాజధానులకు టీడీపీ వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంది. శాసనసమండలిలో టీడీపీ ఇతర సభ్యు లతో కలిసి బిల్లు అడ్డుకొనే అవకాశం కనిపిస్తోంది. దీంతో..అర్ద్రరాత్రి వరకు ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు వ్యూహాలు సిద్దం చేసారు. టీడీపీ సైతం సుదీర్ఘ కసరత్తు చేసింది. దీంతో..ఈ రోజు పెద్దల సభలో ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపిస్తోంది.
టీడీపీ అడ్డుకుంటే..ఏం జరుగుతుంది..
ప్రభుత్వం శాసన మండలిలో ఈ బిల్లులను ప్రతిపాదించనుంది. టీడీపీ మూడు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. శాసనసభలో ఆమోదం పొందిన బిల్లును తిరస్కరించి వెనక్కు పంపడం మొదటి ప్రత్యామ్నాయం. ఇదే జరిగితే శాసనసభలో రెండోసారి ఆమోదించి మళ్లీ మండలికి పంపుతారు. మండలికి మరోసారి వచ్చినప్పుడు తిరస్కరించకుండా సెలెక్ట్ కమిటీకి పంపడం రెండో ప్రత్యామ్నాయం. బిల్లు మొదటిసారి వచ్చినప్పుడే సెలక్ట్ కమిటీకి పంపడం మూడో ప్రత్యామ్నాయం. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపితే అక్కడ రెండు మూడు నెలలపాటు ఆపడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల అప్పటిదాకా బిల్లు ఆమోద ప్రక్రియ పూర్తి కాదు. ఇదే సమయంలో రాజ్యంగ పరంగా గతంలో కోర్టుల్లో చోటు చేసుకున్న అంశాల పైన టీడీపీ ఫోకస్ చేసింది. అయితే, సభలో టీడీపీ ఏ మార్గం ఎంచుకుంటుంది..ఇతర సభ్యులు ఏ విధంగా సహకరిస్తారు..ప్రభుత్వం ఏ వ్యూహంతో ముందుకు వస్తుందనేది సైతం ఇక్కడ కీలకం కానుంది.
ప్రభుత్వం సైతం సిద్దంగా..
మండలిలో బిల్లు గట్టెక్కించుకోవటం పైన వైసీపీ ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. టీడీపీ మండలిలో అడ్డు తగిలితే.. ఆర్దినెన్స్ దిశగా ఆలోచన చేస్తోంది. ఆరు నెలల్లోపు దానికి అసెంబ్లీ ఆమోదం పొందాలి. కానీ, ఆర్డినెన్స్ జారీకి గవర్నర్ ఆమోదం తెలపాలి. ఆయన దాన్ని కేంద్రం పరిశీలనకు పంపాలని నిర్ణయిస్తే మళ్లీ అక్కడ కూడా జాప్యం చోటుచేసుకొంటుంది. ఏ అడ్డంకులు లేకుండా ఆర్డినెన్స్ జారీ అయితే అక్కడి నుంచి విషయం కోర్టులకు మారే అవకాశం ఉంది. ఆర్డినెన్స్ జారీపై కోర్టులో పిటిషన్లు వేయొచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ కోర్టు స్టే ఇస్తే ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోతుంది. స్టే రాకపోతే ప్రభుత్వం తాను అనుకొన్నట్లు ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎలా ఉంటుందన్నదానిపైనా చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో శాసన మండలిలో బిల్లు అడ్డుకుంటే టీడీపీ రాజకీయంగా ఏమవుతుందో చూడాలంటూ బొత్సా వ్యాఖ్యానించటం వెనుక..ప్రభుత్వం ఏ వ్యూహంతో ఉందనే కోణం పైనా చర్చ సాగుతోంది.