ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 14 వేల సచివాలయ పోస్టుల భర్తీ : నియామకం ఇలా..!!
నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. గ్రామ - వార్డు సచివాలయాల్లో 14వేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్దమైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ కసరత్తు తుది దశకు చేరింది. మరి కొద్ది రోజుల్లోనే ఈ నోటిఫికేషన్ జారీ కానుంది. ఇప్పటికే 1.34 లక్షల మంది సచివాలయ ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వం..ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది. గత రెండు విడతల మాదిరే.. ఈ సారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. ఇదే సమయంలో నియామక ప్రక్రియలో కొన్ని కీలక మార్పుల దిశగా నిర్ణయం తీసుకుంది. మొత్తం 19 కేటగిరీ పోస్టులను భర్తీ చేయాలని ప్రాధమికంగా నిర్ణయించారు.

14వేల సచివాలయ పోస్టుల భర్తీ..
ఏపీలో గ్రామ - వార్డు సచివాయాల్లో 14వేల ఖాళీల భర్తీకి ప్రభుత్వంనిర్ణయించింది. దీనికి సంబంధించి వచ్చే నెల తొలి వారంలో నోటీఫికేషన్ జారీ కానుంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని నిర్ణయించింది. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు. ఇందు కోసం కేవలం నాలుగు నెలల సమయంలో 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసారు. 2020లో రెండో విడత నియామకం చేపట్టారు. గత రెండు విడతల మాదిరే.. ఈ సారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. సచివాలయాల్లో మొత్తం 20 రకాల కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల కేటగిరి ఉద్యోగాలు మినహా మిగిలిన 19 కేటగిరి ఉద్యోగాల భర్తీ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు. ప్రస్తుతం మూడో విడతలో 19 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 19 రకాల పరీక్షల నిర్వహణకు కసరత్తు జరుగుతోంది.

నియామక విధానంలో కొత్త మార్పులు
గ్రేడ్- 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా ఒకే రాత పరీక్ష నిర్వహించారు. ఈ సారి గ్రేడ్- 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు, గ్రేడ్ - 2 వీఆర్వో, విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు కూడా వేర్వేరుగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. సచివాలయ ఉద్యోగ కేటగిరీల్లో తక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడినప్పుడు కూడా.. మరో కేటగిరి ఉద్యోగ ఖాళీల గురించి వాటి భర్తీని ఆలస్యం చేసే అవకాశం లేకుండా ఒక్కొక్క దానికి వేరుగా పరీక్షల నిర్వహణ మంచిదని అధికారులు నివేదించారు. మూడో విడత ఆన్లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించినా, ఒక్కో విడతకు 40 వేల మంది దాకా పరీక్షలు రాసే వసతులు రాష్ట్రంలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో..అభ్యర్దుల నుంచి వచ్చే డిమాండ్ ..నిర్వహణ పైన అధికారులు కసరత్తు చేస్తున్నారు.

నోటిఫికేషన్ - 8 లక్షల దరఖాస్తుల అంచనా..
గ్రామ-వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. దీంతో పంచాయితీ రాజ్ శాఖ అధికారులు కసరత్తు వేగవంతం చేసారు. కేటగిరీల వారీగా సంబంధిత శాఖలు..రోస్టర్ తో పాటుగా రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాల ప్రకటనకు తుది రూపు ఇస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ కానుంది. సచివాలయ ఉద్యోగాల భర్తీలో భాగంగా 2019లో 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పించారు. అప్పట్లో 21.69 లక్షల మంది దరఖాస్తు చేసారు. రెండో విడత ఉద్యోగాలకు 9 లక్షల మంది పోటీ పడ్డారు. ఈ సారి 8 లక్షల మంది ఈ 14వేల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చే నెల నోటిఫికేషన్ జారీ.. ఏప్రిల్ లో పూర్తి నియామక ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications