జనం తీరుపై ఏపీ సర్కార్ సీరియస్... రేపటి నుంచి షాపింగ్ సమయాల కుదింపు.. కొత్త టైమింగ్స్ ఇవే..
ఏపీలో నిత్యావసరాల కొనుగోళ్ల కోసం ప్రజలు భారీగా ఎగబడుతున్న నేపథ్యంలో సమయాన్ని పెంచిన ప్రభుత్వం.. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదని భావిస్తోంది. దీంతో ప్రస్తుతం అనుమతిస్తున్న సమయాన్ని మూడు గంటల మేర కుదించేందుకు సిద్దమైంది. రేపటి నుంచి ఉదయం నాలుగు గంటలు మాత్రమే నిత్యావసరాల కొనుగోళ్లకు ప్రజలను అనుమతించనున్నారు.
ఏపీలో కరోనా కేసులతో ప్రభుత్వం అప్రమత్తం..
ఏపీలో ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుంచి తగిన సహకారం లభించకపోవడమే ఇందుకు కారణంగా అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం నిత్యావసరాల కొనుగోళ్ల కోసం 7 గంటల సమయం ఇచ్చినా సామాజిక దూరం పాటించకుండా ఎగబడుతుండడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ కేసులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో సామాజిక దూరం పాటించకపోవడం తీవ్ర నేరమని అధికారులు చెప్తున్నారు.
రేపటి నుంచి కొనుగోళ్ల వేళలు తగ్గింపు..
ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే ఉన్న నిత్యావసరాల కొనుగోలు సమయాన్ని అనూహ్యంగా మరో నాలుగు గంటలు పెంచింది. వీటి ప్రకారంం ప్రస్తుతం మధ్యాహ్నం ఒంటిగంట వరకూ కొనుగోళ్లకు వీలుగా షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తున్నారు. అయితే సామాజిక దూరం పాటించాలని ఆంక్షలు విధించారు. కానీ ప్రజలు వీటిని లెక్కచేయకుండా గుంపులు గుంపులుగా షాపింగ్ కోసం ఎగబడుతున్నారు దీంతో తిరిగి షాపింగ్ సమయాన్ని ఉదయంం 6 గంటల నుంచి పది గంటల వరకూ పరిమితం చేయాలని నిర్ణయించారు.
దెబ్బతింటున్న ప్రభుత్వ లక్ష్యం..
ప్రజలు ఉదయం వేళ గుంపులు గుంపులుగా కొనుగోళ్లకు ఎగబడుతున్న నేపథ్యంలో సమయాన్ని మరింత పెంచడం ద్వారా వారికి ఎలాంటి హడావిడి లేకుండా షాపింగ్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. కానీ ఇప్పుడు సమయం పెంచినా ప్రజలు ఎగబడుతుండటంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. సమయం పెంచినా ఉపయోగం లేకపోవడం, అదే సమయంలో రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని తిరిగి కొనుగోళ్ల సమయాన్ని తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలో ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వెలువడనున్నాయి.