అంగన్వాడీలపై వేటు: చంద్రబాబు దొంగదెబ్బతోనే ప్రతీకారమన్న రోజా
విజయవాడ: అంగన్వాడీ కార్యకర్తలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి వెళితే ఈ నెల 18వ తారీఖున వేతనాల పెంపు కోరుతూ 'ఛలో విజయవాడ' నిర్వహించి ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం సీరియస్గా ఉంది.
ఇందులో భాగంగా ఆందోళనలో పాల్గొన్న వారిని గుర్తించి వారి పేర్లన్నింటినీ శుక్రవారం సాయంత్రంలోపు పంపాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ స్పెషల్ కమిషనర్ కేఆర్బీహెచఎన చక్రవర్తి అన్ని జిల్లాలకు సర్కులర్ జారీ చేశారు. అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వీలుగా మొత్తం జాబితాలను ఆయా జిల్లాల కలెక్టర్లకు ఇవ్వాలని అందరు సీడీపీవోలు, మహిళా శిశు అభివృద్ధి ప్రాజెక్టు డైరెక్టర్లను చక్రవర్తి ఆదేశించారు. వీరంతా కృష్ణా జిల్లా కలెక్టర్ ద్వారా ర్యాలీ వీడియోలు సేకరించాలని సూచించారు.
హైదరాబాద్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఈనెల 18న 13 జిల్లాల నుంచి వేలాదిమంది కార్యకర్తలు తరలి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. భారీ స్థాయిలో ర్యాలీ జరిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ప్రారంభమైన ర్యాలీ సాయుధ పోలీసు బలగాలు ఏ ఒక్కరినీ అడుగుముందుకు వేయనీయకుండా లాఠీలతో తమ ప్రతాపం చూపుతూ కాళ్లు విరగ్గొట్టారు.
ప్రభుత్వ ఆదేశాలతో రెచ్చిపోయిన పోలీసులు విచక్షణ రహితంగా అంగన్వాడీలపై దాడికి దిగారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. మహిళలనే సానుభూతి కూడా చూపకుండా మగ పోలీసులు బూట్ కాళ్లతో తన్నుతూ ఈడ్చుకుపోయారు. ఈ సందర్భంగా దాదాపు 100 మందిని పోలీసులు అరెస్టు చేయటం జరిగింది.
పోలీసుల దాడిని అన్ని పక్షాలు ముక్తకంఠంతో ఖండించాయి. అదే రోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్వాడీల వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటిస్తూ 2016 ఏప్రిల్ మాసం ఉంచి అమలు చేస్తామంటూ ప్రకటించారు. విజయవాడలో ప్రదర్శనకు వచ్చిన అంగన్వాడీలందరినీ విధుల నుంచి తొలగించాలంటూ మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి శాఖకు చెందిన ఐసిడిఎస్ ప్రాజెక్టు స్పెషల్ కమిషనర్ కెఆర్ బిహెచ్ఎన్ చక్రవర్తి పేరిట మంగళవారం 13 జిల్లా కలెక్టర్లకు మెమోలు జారీ చేశారు.
ఇందుకోసం కమిషనరేట్ పోలీసులకు ప్రత్యేక ఆదేశాల జారీ అయ్యాయి. తమ వద్దనున్న సిడిలు, ఫోటోల ద్వారా అంగన్వాడీలను గుర్తించి ఆయా జిల్లాల కలెక్టర్లకు తక్షణం నివేదికలు పంపించాలంటూ ఆదేశించారు. ఇంకేముంది పోలీసులు అత్యుత్సాహంగా వారిని గుర్తించేందుకుగాను అందుబాటులో ఉన్న అంగన్వాడీలను రప్పించి వేధించటం, బెదిరించటం ప్రారంభించారని తెలుస్తోంది.
దీంతో అంగన్వాడీలను తొలగించాలనే ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీ అంగనవాడీ, హెల్పర్స్ యూనియన(సీఐటీయూ) అధ్యక్ష కార్యదర్శులు జి.బేబీరాణి, సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 5551 ప్రతులను దహనం చేయాలని కూడా పిలుపునిచ్చారు.
ఇది ఇలా ఉంటే అంగనవాడీలను ఉద్యోగాల నుంచి తొలగించాలనడం అమానుషమని వైసీపీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. వారిపై ప్రతీకారం తీర్చుకోవడం శోచనీయమని అన్నారు. మహిళలంటే చంద్రబాబుకు ఎంత లోకువో తాజాగా జారీచేసిన ఆదేశాలే నిదర్శనమన్నారు.
విజయవాడ ఆందోళనలో పాల్గొన్న అంగన్వాడీ వర్కర్లను ప్రాంతాల వారీగా గుర్తించి జిల్లాల వారీగా జాబితాల్ని తయారు చేసి వారిని సర్వీసు నుంచి తొలగించాలని కలెక్టర్లకు ఆదేశాలివ్వడం ద్వారా చంద్రబాబు దొంగదెబ్బతో ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం దారుణమన్నారు.
అంగన్వాడీల 'ఛలో విజయవాడ' ఆందోళనకు కారణం ఇది:
రాష్ట్రంలో పనిచేస్తున్న 48 వేల 770 మంది అంగన్వాడీలు, 48 వేల 770 మంది హెల్పర్లు, 6837 మంది మినీ అంగన్వాడీలు కల్సి దాదాపు లక్షా 60 వేల మంది గత కొన్నాళ్లుగా చాలీచాలని జీతాలతో విధులు నిర్వర్తిస్తున్నారు. అంగన్వాడీలకు రూ.4,200లు, హెల్పర్లకు రూ.2200లు, మినీ అంగన్వాడీలకు రూ.2950లు నెలవారీ వేతనంగా చెల్లిస్తున్నారు.
కనీస వేతనాల కోసం ఆందోళనలు సాగిస్తుండగా సిఎం చంద్రబాబు గత మార్చిలో జరిగిన శాసనసభ సమావేశంలో వేతనాల పెంపుకు అంగీకరిస్తూ ఇందుకోసం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించారు. ఈ సబ్కమిటీ అనేకమార్లు చర్చలు జరిపి కొత్త వేతనాలపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పటికీ ఆ మేర జీవోలు రాకపోవటంపై ఈ నెల 14వ తేదీ ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.
అయితే ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రత్యేక శిక్షణ పేరిట అంగన్వాడీలను ఈ నెల 14,15 తేదీల్లో నిర్బంధించడం జరిగింది. 16వ తేదీ జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తమ నిర్ణయాన్ని ప్రకటించగలరనే హామీతో చలో విజయవాడను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు.
తీరా ఆ మంత్రివర్గంలో వేతనం పెంపుపై నిర్ణయం కాకుండా కేంద్రంతో చర్చించాలంటూ ఆ అంశాన్ని వాయిదా వేయడంతో ఆగ్రహించిన అంగన్వాడీలు ఈ నెల 18వ తేదీ చలో విజయవాడకు పిలుపునిచ్చారు. కారణాలేమైనా అంగన్వాడీలకు రూ.7 వేలు, మినీ అంగన్వాడీలకు రూ.4,500లు, హెల్పర్లకు రూ.4,500లు చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించింది.
ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా శాసనసభలో ప్రకటించారు. దీనివల్ల అదనంగా రూ.709 కోట్లు ఖర్చు కానుండగా ఇందులో కేంద్రం రూ.169.09 కోట్లు భరిస్తే, రాష్ట్రం రూ.540.85 కోట్లు భరించాల్సి ఉంది. పెంచిన జీతాలు ఈ ఏడాది సెప్టెంబరు నుంచే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దీనికోసం మరో ఆందోళనకు కూడా సిద్ధమని ప్రకటించారు.