ఏపీలో టెన్త్ విద్యార్ధులకు గుడ్ న్యూస్- ఇక ఆకాశవాణి ద్వారా ఆడియో పాఠాలు..
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావం విద్యాసంస్ధలతో పాటు అందులో చదువుతున్న లక్షలాది మంది విద్యార్ధుల భవిష్యత్తును ప్రశ్నార్ధకంగా మార్చేస్తోంది. దీంతో ఎలాగో విద్యాసంస్ధలు తెరిచే అవకాశం లేకపోవడంతో పదో తరగతి విద్యార్ధులకు ఇళ్ల వద్దే ఉంటూ వీడియో, ఆడియో మాధ్యమాల ద్వారా పాఠాలు బోధించాలని ప్రభుత్వం భావిస్తోంది.
సప్తగిరి నుంచి ఆకాశవాణికి..
ఏపీలో ప్రస్తుతం టెన్త్ క్లాస్ విద్యార్ధులకు పాఠశాలల్లో పాఠాలు బోధించే పరిస్ధితి లేనందువల్ల ప్రభుత్వ ఆధ్వర్యంలోని సప్తగిరి ఛానల్ ద్వారా విద్యాబోధన చేస్తున్నారు. విద్యామృతం పథకం కింద ప్రతీ రోజూ దూరదర్శన్ ఛానల్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకూ, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకూ బోధనా తరగతులు నిర్వహిస్తున్నారు. వీటికి మంచి స్పందన వస్తోంది. విద్యార్ధులు ఇళ్ల వద్దే ఉంటూ విద్యామృతం పాఠాలను ఫాలో అవుతూ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. త్వరలో వీటిని ఆకాశవాణికీ విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక రేడియో పాఠాలు...
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్ధలు ఇప్పట్లో తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. అయితే పదో తరగతి పరీక్షలు మాత్రం నిర్వహించక తప్పని పరిస్ధితి. దీంతో ప్రభుత్వం దూరదర్శన్ సప్తగిరి ఛానల్ పాఠాలతో పాటు ఇకపై ఆకాశవాణి రేడియో ద్వారా ఆడియో పాఠాలను కూడా అందించాలని భావిస్తోంది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. అతి త్వరలో ఆడియో పాఠాలను పదో తరగతి విద్యార్ధులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.